CM KCR | అసైన్డ్ భూములు గుంజుకుంటామని బీజేపోడు ప్రచారం చేస్తున్నాడని.. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరివైనా భూములు గుంజుకున్నదా? రైతులకు మేలు చేయడం తప్పా గుంజుకుంటదా? అంటూ ముఖ్యమంత్రి కుల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. అసైన్డ్ భూముల రైతుల సోదరులకు పట్టాలని ఇవ్వాలని నిర్ణయించామని యావత్ తెలంగాణకు దుబ్బాక గడ్డ నుంచి తెలియజేస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్ ఆదివారం దుబ్బాకలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు.
‘ప్రభాకర్రెడ్డి పదేళ్ల నుంచి ఎంపీగా ఉన్నడు. చీమకు, దోమకు అన్యాయం చేసిన వ్యక్తి కాదు. పదేళ్లు ఎంపీగా పని చేస్తే ఎన్నడూ గర్వం చూపెట్టలేదు. ఏ ఒక్కరోజు గర్వపడలేదు. దర్పం చూపట్టలేదు. ప్రజల్లో కలిసిపోయి అయినంత వరకు మంచిచేసిండు తప్పా చీమకు అపకారం చేసిన వ్యక్తి కాదు. దుబ్బాక నేను హైస్కూల్లో చదువుకున్నప్పటికీ నుంచి ఇదే ప్రాంతంలో ఉన్నా. ఎప్పుడన్నా కత్తిపోట్లు చూసినమా? ఆ సంస్కారం ఉందా? కత్తులు పట్టుకొని రావాలంటే.. మనకు దొరుకయా కత్తులు. వాడికన్నా పొడువు కత్తులు తేగలుగుతాం కదా..? కానీ, పద్ధతి కాదని.. మర్యాద పాటించాం. ఎంత కోపం వచ్చినా అణచివేసుకున్నాం. హరీశ్రావు గిట్ల ఉరికి ఆయనను హాస్పిటల్లో అడ్మిన్ చేశారు. కడుపులో బ్లీడింగ్ అయితే చెడు రక్తం తీసేసి.. ఆయన పేగును 15ఇంచులు డాక్టర్లు కట్ చేశారు. నేను కూడా పర్యటన ముగించుకొని ఉరికి పరామర్శించాను. భగవంతుడి దయతో ఆయన బయపడ్డాడు. మన అందరి అదృష్టం, భగవంతుడి దయ.. ప్రభాకర్ అదృష్టం’ అన్నారు.
‘అప్పుడు రామలింగారెడ్డి చనిపోతే ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో నేను ప్రచారానికి రాలేదు. నేను వస్తే ఒడిసేపోవు కథా. ఆ ఎన్నికల్లో ప్రచారానికి రాకపోతే ఏం జరిగింది ఇక్కడ ? ఆయన వాగ్ధానాలంటే చెప్పరాదు. తిన్నోనికే ఇస్తరాకు.. నాగళ్లు.. ఎడ్లు.. గీసినోడికే గుండు.. నోటికి వచ్చిన వాగ్ధానం చేసిండు. ఒక్క ఏకాన పని జరిగిందా ? ఇటువంటి మోసకారులు గెలిచారు. నేను ఇంకొక మాట చెబుతున్నా. బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇవాళ 157 మెడికల్ కాలేజీ పెట్టింది. ఒక్కటంటే ఒక్కటి తెలంగాణకు ఇవ్వలేదు. వంద ఉత్తరాలు రాసినా ఇవ్వలేదు. నవోదయ పాఠశాల జిల్లాకు ఒకటి ఇవ్వాలని పార్లమెంట్లో చట్టం ఉన్నది. మోదీకి వంద ఉత్తరాలు రాస్తే ఒక్కటంటే ఒక్కటి నవోదయ పాఠశాల ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీ పార్టీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి? బీజేపోడికి ఓటు వేస్తే మోర్లె పాడేసినట్లవుతుంది’ అన్నారు.
‘అదే బీజేపోడు పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అసైన్డ్ భూములు గుంజుకుంటరని చెబుతున్నడు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరివైనా భూములు గుంజుకున్నదా? రైతులకు మేలు చేయడం తప్పా గుంజుకుంటదా? నేను దుబ్బాక నియోజకవర్గానికి కాదు.. యావత్ తెలంగాణ అసైన్డ్ భూముల రైతు సోదరులకు దుబ్బాక నుంచి చెబుతున్నా.. మొన్ననే నిర్ణయం చేశాం. అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తే అందరిలాగే వాళ్లు ఉంటారని మొన్ననే నిర్ణయం చేశాం. భూములు గుంజుకుంటమనేది పచ్చి అబద్ధం.. వారందరికీ పట్టాలు ఇచ్చేస్తమని మనవి చేస్తున్నా. ఈ విధంగా జూటమాటలు చెబుతరు. అనేక బాధలు అనుభవించి.. మొన్ననే విముక్తి జరిగి.. కొద్దిగా ఇప్పుడిప్పుడే తెల్లవడుతున్నాం. దీన్ని మళ్లి చెడగొట్టుకోవాల్నా మనం ? దయచేసి నేను చెప్పిన విషయాలు, మీరు గమనించిన వాస్తవాలు.. అన్నింటిపై చర్చించి నిర్ణయం చేయండి’ అని పిలుపునిచ్చారు.