హైదరాబాద్ : దేశంలో కొత్త నినాదం మొదలు పెట్టారని.. అది డబుల్ ఇంజిన్ గ్రోత్ కాదు.. ట్రబుల్ ఇంజిన్ గ్రోత్ అంటూ సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. మంగళవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘దేశంలో కొత్త నినాదం మొదలుపెట్టారు డబుల్ ఇంజిన్ గ్రోత్. ఇగ డబుల్ ఇంజిన్ గ్రోత్ కథ చెప్పాలి. ఇందులో ఉన్న మర్మం ప్రజలకు తెలియాలి. ప్రజలకు అమాయకులు కాబట్టి నిజమే అని నమ్మే పరిస్థితి ఉంటది. ఒకాయన బయట పున్మాత్ముడు మాట్లాడుతూ.. డబుల్ ఇంజిన్ గ్రోత్ ఉన్న రాష్ట్రాలు చాలా బాగుపడ్డాయ్ అని మాట్లాడారు. డబుల్ ఇంజిన్ గ్రోత్ అంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే సర్కారు అని అర్థం. అది ఎంత వెకిలిగా, అసహనంగా ఉందంటే.. అది కూడా ప్రజలను గోల్మాల్ తిప్పే పరిస్థితి. డబుల్ ఇంజిన్ గ్రోత్ ఉన్న ఉత్తరప్రదేశ్ తలసరి ఆదాయం 71వేలు. తెలంగాణ తలసరి ఆదాయం 2.87లక్షలు. ఆర్థిక వృద్ధి రేటు యూపీలో 7.26 శాతమైతే.. తెలంగాణ 10.8శాతంగా ఉంది’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజిన్ మోపైంది 2015లో. 2017-2021లో ఉత్తరప్రదేశ్లో డబుల్ ఇంజిన్ గ్రోత్ రేట్ 25.69 శాతం.. ఇంజిల్ ఇంజిన్ ఉన్న తెలంగాణలో 55.46 శాతం. తెలంగాణ గ్రేత్ రేటులో సగం లేదు. సింగిల్ ఇంజిన్ ఉన్నకాడ రూపాయి సంపాదిస్తే.. డబుల్ ఇంజిన్ ఉన్న కాడ ఆటాన సంపాదించారు. డబుల్ ఇంజిన్ గ్రోత్ ఉన్న ఉత్తరప్రదేశ్లో ఎంఎంఆర్ (మాతా మరణాల సంఖ్య) 167, తెలంగాణలో 56. ఉత్తరప్రదేశ్లో శిశు మరణాల రేటు 41, తెలంగాణలో 23. ఈ గణంకాలు డప్పుకొట్టే వాళ్ల ప్రభుత్వం ఇచ్చే గణాంకాలు.. నావి కావు.. కాబట్టి డబుల్ ఇంజిన్ గ్రోత్.. మత పిచ్చి.. రాష్ట్రాల అధికారాలు హరించే పద్ధతులు.. సంస్కరణల పేరిట జరిగే మర్మం, మాయాజాలం వీటన్నింటిని తట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతి సాధించింది. ఇదే పద్ధతిలో అందరిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రజానీకాన్ని కడుపులో పెట్టుకొని.. సర్వులను సమానంగా చూస్తు.. అందరికీ అభివృద్ధి ఫలాలు పంచుతూ.. మా ఏకాగ్రత దెబ్బతిన్నకుండా.. అడ్డుకునే వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ట్రాక్ తప్పకుండా ఇదే మార్గంలో పూర్తి స్థాయిలో తీసుకెళ్తాం’ అన్నారు.