హైదరాబాద్ : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తున్నదన్నారు. ఆ దిశగా ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు దోహదపడే పలు పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని సీఎం అన్నారు. ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వైద్య వ్యవస్థను బలోపేతం చేసిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం బస్తీ దవాఖానాలు నిర్వహిస్తూ సత్ఫలితాలను సాధించిందని, మిగతా పట్టణాల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే చర్యలు చేపట్టిందన్నారు. తద్వారా ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి, ప్రజారోగ్య పరిరక్షణకు పాటుపడుతున్నదన్నారు.
ప్రొటీన్తో కూడిన ఆహారాన్ని అందుబాటులోకి తెస్తూ, ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం మాంసం, చేపల వినియోగాన్ని పెంచే పథకాలను అమలు చేస్తున్నదన్నారు. మాంసం, చేపలు, పండ్లు, కూరగాయలు తదితర పౌష్టికాహార సరఫరాను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా శాఖాహార, మాంసాహార మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అమలు పరుస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి స్వచ్ఛ కార్యక్రమాలు.. పలు జాతీయ అవార్డులు పొందడం.. ప్రజారోగ్య పరిరక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సునిశితంగా పనిచేస్తున్నదనడానికి నిదర్శనమన్నారు.
గత ఏడాది కాలంగా కరోనా కష్టకాలాన్ని తెలంగాణ తట్టుకొని నిలబడడానికి ప్రజల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కారణమని, తద్వారా రోగ నిరోధక శక్తి స్థాయి పెరగడానికి ఇవి దోహద పడ్డాయన్నారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న.. మిషన్ భగీరథ శుద్ధి చేసిన స్వచ్ఛమైన నల్లా నీటిని రాష్ట్రవ్యాప్తంగా నూటికి నూరుశాతం సరఫరా చేస్తుండటంతో ప్రజలను రోగాల నుంచి కాపాడుతూ ప్రజారోగ్యం గుణాత్మకంగా మెరుగు పడిందన్నారు. అదే సందర్భంలో తల్లీ, బిడ్డల సంరక్షణే లక్ష్యంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్ పథకం విజయవంతమై, మాతా శిశు సంక్షేమం మెరుగు పడిందన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో బాల్య వివాహాలు తగ్గిపోయి, తద్వారా బాల్య ప్రసవాలకు అడ్డుకట్ట వేసినట్లయిందన్నారు.
కరోనా తిరిగి వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, పౌష్టికారం తీసుకుంటూ, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నారు. నిరంతరం ఆరోగ్యంపై దృష్టి నిలపడం ద్వారా తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.