CM KCR | ముథోల్ : ముథోల్ నియోజకవర్గంలో మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాలకు సాగునీరు పారుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ముథోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ముథోల్ నియోజకవర్గంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. విఠల్ రెడ్డి తండ్రి గడ్డెన్న చాలా సేవ చేశారు. ఎమ్మెల్యేగా పని చేశారు. గడ్డెన్న వాగు కింద 14 వేల ఎకరాలు పారాలి. కానీ 4 వేల ఎకరాలకు కూడా నీళ్లు వచ్చేవి కావు. డబ్బులు మంజూరు చేయించి పనులు చేయించాం. ఇప్పుడు 12 వేల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. మిగతా పనులు పూర్తయితే మిగిలిన రెండు, మూడు వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి అని కేసీఆర్ తెలిపారు.
అదే విధంగా ఎస్సారెస్పీ నుంచి లిఫ్ట్ పెట్టుకున్నాం.. కాంట్రాక్టర్ వల్ల ఆ పనులు ఆలస్యమయ్యాయని కేసీఆర్ తెలిపారు. మొన్ననే ఆ పనులు పునఃప్రారంభమయ్యాయి. ముథోల్, తానూరు, లోకేశ్వరం మడలాల్లో 50 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయి. చెరువులన్నీ బాగు చేసుకున్నాం. వాగుల మీద చెక్ డ్యాంలు కట్టుకున్నాం. ఈ పని కాంగ్రెస్ ఎందుకు చేయలేదు. వారి హయాంలో చెరువులు బాగు చేయలేదు. ఇవాళ రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎరువు బస్తాలు దొరికేది కాదు. చెప్పులు లైన్లో పెట్టి ఎరువులు, విత్తనాలు తీసుకునేది. ఇవాళ ఎరువులు, విత్తనాలు దొరుకుతున్నాయి. ఈ ప్రాంతంలో పత్తి తప్ప వేరే పండించేది కాదు. వరి, సోయా, ఇతర పంటలు పండిస్తున్నారు. రైతులు లాభాలు గడిస్తున్నారు. రైతుబంధుతో అప్పులు తీరుతున్నాయి. చాలా కష్టపదడి సమస్యలు తీర్చుకున్నాం. మంచినీళ్ల బాధలు లేవు. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి భగీరథ నీళ్లు అందిస్తున్నాం. కరెంట్ బాధ లేదు. యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే కరెంట్ కొరత రానే రాదని కేసీఆర్ తేల్చిచెప్పారు.