CM KCR | ఖమ్మం : బీఆర్ఎస్ తరపున నిలబడ్డ ఎవర్నీ అసెంబ్లీ వాకిలి తొక్కనీయమని కొందరు మాట్లాడుతున్నారు.. ఏం అహంకారం. నేను రాస్ట్రానికి సీఎంగా ఉండి.. ఇన్ని పనులు చేసి, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని.. నేను కూడా అంత అహంకారంగా వాన్ని లేవనియ్య, పండనియ్యా, రానియ్యా అని మాట్లాడటం లేదు అని కేసీఆర్ పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నాలుగు పైసలు జేబులకు రాగానే ఇంత అహంకారామా..? ఇంత మదమా..? ఖమ్మం జిల్లా దీన్ని సహిస్తదా.? డబ్బు, అహంకార రాజకీయాలు ఎన్ని రోజులు జరుగుతాయి ఈ జిల్లాలో.. జిల్లా మొత్తం ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. ఇది వ్యక్తుల మధ్య పోరాటం కానే కాదు.. పార్టీ ల మధ్య పోరాటం. ఏ పార్టీ వైఖరి ఏంటో ప్రజల ముందు చరిత్ర ఉంది. మొత్తం కాంగ్రెస్ పాలించింది. కొద్ది రోజులు టీడీపీ పాలించింది. ఈ పదేండ్లలో మనం ఏం చేశామో మీ కండ్ల ముందు ఉంది. ఆలోచించి ఓటేయండి. హృదయంతో ఏది నిజమో ఏది మంచో ఆలోచించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
హుజురాబాద్లో నూటికి నూరు శాతం దళితబంధు అమలు చేశామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇదే జిల్లాలోని మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో 100 శాతం కుటుంబాలకు ఇచ్చాం. భట్టి విక్రమార్క నాకు దరఖాస్తు ఇచ్చిండా..? నన్ను ఏమైనా అడిగిండా..? మా అంతల మేం సెలెక్ట్ చేసుకుని నాలుగు మండలాలు తీసుకున్నాం. మా ఎమ్మెల్యే అని సత్తుపల్లి పెట్టకపోదునా..? సండ్ర వెంకట వీరయ్యకే పేరు రావాలని స్వార్థంగా ఆలోచించలేదు. ప్రతిపక్ష నాయకుడు ఉన్నకాడ చింతకాని మండలంలో పెట్టాం. అది మా నిజాయితీకి గీటురాయి. స్వార్థ రాజకీయ నాయకులం అయితే మా ఎమ్మెల్యేల దగ్గరనే దళితబంధు పెట్టుకునేవాళ్లం. నాలుగు జిల్లాల్లో పెట్టాం. మొన్న సత్తుపల్లి నియోజకవర్గాన్ని పెట్టాం.. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దళితబంధు ఆపాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. మళ్లీ ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎలక్షన్ల కోసమని. ఎలక్షన్ల కోసం కేసీఆర్ పెడుతడా..? మిషన్ భగీరథ నీళ్లు ఎలక్షన్ కోసమే తెచ్చామా..? సీతారామా ప్రాజెక్టు కట్టమని నాకు ఎవడైనా చెప్పిండా..? ఈ జిల్లాలో బలుపు రాజకీయాలు చేసిన నాయకులకు వారి కలలోనైనా సీతారామ ప్రాజెక్టు కట్టాలని ఆలోచన వచ్చిందా..? వాళ్ల జన్మలా ఆలోచించారా..? గిరిజన ప్రాంతానికి నీళ్లు రాకుండా, పంటలు ఎండిపోతా ఉంటే ఎవరూ పట్టించుకోలేదు. సాగర్ పారుతుందని, పై ప్రాంతాల గురించి ఆలోచించలేదు అని కేసీఆర్ తెలిపారు.