CM KCR | హైదరాబాద్ : ఇది విగ్రహం కాదు.. ఒక విప్లవం. ఇది ఆకారానికి ప్రతీక కాదు.. ఇది తెలంగాణ కలలను సాకారం చేసే దీపిక అని అంబేద్కర్ విగ్రహాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం జయంతి నిర్వహిస్తున్నాం. పాటలు పాడుతున్నాం.. ఆడుతున్నాం. ఆక్రోషాన్ని తెలియజేస్తున్నాం. సంవత్సరాలు, శతాబ్దాలు గడిచిపోతున్నాయి.
ఒక్కటే మాట మనవి చేస్తున్నాను. అంబేద్కర్ విశ్వమానవుడు. అంబేద్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనది. ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితమైంది కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అణగారిన జాతులకు ఆశాదీపం అంబేద్కర్. ఈ రోజు ఆయన రచించిన రాజ్యాంగం 70 సంవత్సరాలు దాటిపోతోంది. ఆయన చెప్పింది ఆచరించాలి. ఆ దిశగా కార్యాచరణ జరపాలి. మన నూతన సచివాయలానికి అంబేద్కర్ పేరు పెట్టాం. ప్రతి రోజు సచివాలయానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తూ ప్రభావితం కావాలి. ఆయన సిద్ధాంతం, ఆచరణ కళ్లలో మెదలాలని ఈ విధంగా రూపకల్పన చేశాం అని కేసీఆర్ తెలిపారు.