హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతిని శుక్రవారం నుంచి నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడైనా, ఎక్కడైనా విధ్వంసం అనంతరం ఆయా వ్యవస్థలను పునర్నిర్మించుకోవడం అంత తేలికైన పని కాదన్నారు. ‘ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో వివిధ రంగాల్లో ధ్వంసమైన తెలంగాణను తిరిగి బాగుచేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కష్టపడాల్సి వస్తోంది. అదే సందర్భంలో మన రాష్ట్రాన్ని మనం బాగుచేసుకోవడంలో ఆనందం కూడా ఉంది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను రూపొందించి అమలుపరచడం ద్వారా మన పల్లెలు, పట్టణాల రూపురేఖలే మారిపోయాయనడంలో అతిశయోక్తి లేదు.
దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా గ్రామీణ, పట్టణాభివృద్ధి తెలంగాణలో జరిగింది. గ్రామీణ స్థానిక సంస్థల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.256.66కోట్ల నిధులు నేరుగా విడుదల చేస్తున్నది. ప్రతీ గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను అందించి, చెత్త, ఇతర వ్యర్థాల నిర్వహణ కోసం డంపు యార్డు, మృతులకు సగౌరవంగా అంత్యక్రియల కోసం ఆధునిక వసతులతో వైకుంఠధామాలను సైతం ఏర్పాటు చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. దోవకిరువైపులా పచ్చని చెట్లు, నర్సరీలు, ప్రకృతి వనాలతో పల్లెలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పచ్చదనం, పారిశుధ్యం వెల్లివిరుస్తున్న తెలంగాణ గ్రామాలు, గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నాయి. గ్రామీణ జీవన ప్రమాణాల్లో గుణాత్మకమైన అభివృద్ధి వచ్చింది’ అని తెలిపారు.
ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలకు నేడు దేశవ్యాప్తంగా విశేషంగా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘రెండు పర్యాయాలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పదిగ్రామాలు, రెండో దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ రాష్ట్రం నుంచే ఎంపిక కావడం మనందరికీ గర్వకారణం. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిరంతరంగా నిర్వహిస్తోంది. మరో దఫా పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా అమలుకానున్నాయి’ అన్నారు.
భవిష్యత్ తరాలు శరీర దారుఢ్యంతో, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు ప్రతి గ్రామంలో ‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘ఈ రోజు నుంచే ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సాధించిన ప్రగతిపైన ఇటీవల కొన్ని జాతీయ మీడియా సంస్థలు కార్యక్రమాలు ప్రసారం చేశాయి. అది చూసిన ఇతర రాష్ట్రాలవారు ఆశ్చర్యంతో, ఇంత తక్కువ కాలంలో ఇంతటి అభివృద్ధి ఎలా సాధ్యమైందని ఆనందాశ్చర్యాలు వ్యక్తం చేస్తున్నారు. మనం అనతికాలంలోనే అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించగలిగామంటే, అందుకు సహకరించిన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు అధికార
యంత్రాంగానికి అభినందనలు తెలియజేస్తున్నాను’ అన్నారు.
రాష్ట్రం ఏర్పడిన అతికొద్ది కాలంలో అత్యంత అభివృద్ధిని సాధించి, తెలంగాణలోని ప్రతి పౌరుని హృదయంలో గొప్ప స్థానాన్ని ప్రభుత్వం సాధించుకుందని సీఎం అన్నారు. ‘చిత్తశుద్ధి, నిబద్ధత, ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఎనలేని శ్రద్ధ, పాలనలో పారదర్శకత, నిర్ణయాల్లో మానవీయకోణంతో పాటూ కార్యక్రమాల అమలులో గట్టి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. అనతి కాలంలోనే తెలంగాణలో అద్భుతమైన సంపద సృష్టించబడింది. రాష్ట్రంలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగాయి. 57 ఏళ్లకే పింఛన్ అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా సాగాలన్నది ప్రభుత్వ ఆశయం. అందుకు అనుగుణంగానే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో ఈ రోజు ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు’ అని పేర్కొన్నారు.
వృద్ధాప్య పింఛను పొందేందుకు అర్హత వయస్సును 57 తగ్గించామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో మరింత మంది నిస్సహాయులకి ఆసరా అందనున్నది. ‘ప్రభుత్వం పింఛను పొందేవారి సంఖ్య మాత్రమే కాదు.. పింఛను మొత్తాన్ని కూడా భారీగా పెంచి అమలుచేస్తున్నది. పేదింటి ఆడబిడ్డను తల్లిదండ్రులు గుండెలపై కుంపటిగా భావించే పరిస్థితి ఉండకూడదని తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.51వేల ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పుడు రూ.1,1,116 అందిస్తున్నది.
పథకం ద్వారా ఇప్పటివరకు 11.44 లక్షల మంది ఆడపిల్లల పెండ్లికి ఆర్థిక సహాయం అందింది. బాల్య వివాహాలను నిరోధించడానికి కూడా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడింది. ఇవేవీ ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన వాగ్ధానాలు కావు. కానీ, పేదల కష్టనష్టాలు తెలిసిన ప్రభుత్వం మానవతా హృదయంతో అమలులోకి తెచ్చిన పథకాలివి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు.. ఎనిమిదేళ్ల చిరుప్రాయంలో రాష్ట్రం సాధించిన విజయాలలో ఇప్పటి వరకూ నేను పేర్కొన్నవి కొన్ని మాత్రమే’నని సీఎం కేసీఆర్ అన్నారు.