హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవం నుంచి నేతన్నకు బీమా సదుపాయాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. చేనేత కార్మికులు ఎవరైనా విధివశాత్తూ మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు. ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నదన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోతలు, పవర్ హాలిడేలతో తెలంగాణ భయంకరమైన బాధలు అనుభవించిందని చెప్పారు.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా చరిత్రకెక్కిందని ముఖ్యమంత్రి అన్నారు. నేడు యావత్ భారతదేశంలో కరెంటు కోతలు విధించని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును అందించడం ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యపడిందన్నారు. వ్యవసాయానికి ఉచితంగా, ఇతర రంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. విద్యుత్తురంగంలో సమూలమైన మార్పులు తేవడం వల్లనే ఈ అద్భుతమైన విజయం సాధ్యమైందని వెల్లడించారు. తలసరి విద్యుత్ వినియోగంలోనూ దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా, ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగిందని చెప్పారు.
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతకాలం పాలించిన ప్రభుత్వాలు తమ చేతకానితనంతో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీళ్లు కూడా ఇవ్వలేదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షలాదిమంది బిడ్డలు ఫ్లోరైడ్ నిండిన నీళ్లుతాగడంతో బొక్కలు వంకరబోయి నరకయాతన పడ్డారని ఆవేదనవ్యక్తం చేశారు. ఈ బాధల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకాలంలో ‘నల్లగొండ నగారా’ పేరుతో తానే స్వయంగా పోరాడానని చెప్పారు. నల్లగొండ బిడ్డల దు:ఖాన్ని వివరిస్తూ ‘చూడు చూడు నల్లగొండ.. గుండెమీద ఫ్లోరైడు బండ’ అనే పాటను కూడా రాశానని వెల్లడించారు.
గుక్కెడు నీళ్లకోసం మైళ్లు నడిచి పడరాని పాట్లు పడ్డ తెలంగాణ, నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను నల్లాల ద్వారా ఉచితంగా సరఫరా చేస్తున్నదని వెల్లడించారు. మిషన్ భగీరథతో 100 శాతం ఆవాసాలకూ మంచినీరు అందించడంతో తెలంగాణ ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా కొనియాడిందన్నారు. అతి తక్కువ వ్యవధిలో ఇంతటి బృహత్తర పథకాన్ని పూర్తిచేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని ముఖ్యమంత్రి తెలిపారు.