హైదరాబాద్: అత్యంత పిన్నవయస్సు గల తెలంగాణ (Telangana) స్వల్ప వ్యవధిలో వైద్యారోగ్య రంగాన్ని (Medical field) విస్తృత పరిచిందని, వైద్యసేవల ప్రమాణాలను పెంచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 2014లో తెలంగాణ వచ్చేనాటికి ఆరోగ్యరంగం అంపశయ్య మీద ఉందని, మందుంటే సూదిలేక, సూది ఉంటే మందు లేక, పడకలు లేక ఉన్న పడకలకు ఆక్సీజన్ సౌకర్యం లేక, సిబ్బంది లేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పారు. అయితే స్వపరిపాలనలో ఆరోగ్య రంగం ప్రజలకు అత్యంత చేరువయిందని, విశ్వసనీయతను పెంచుకున్నదని వెల్లడించారు. ప్రజలకు ఆరోగ్యభాగ్యాన్ని అందించడంలో నేడు తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని సీఎం చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను (Telangana Decade celebrations) సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్ ఆయన మాటల్లోనే..
‘అన్ని దవాఖానాల్లో మౌలిక వసతులు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకున్నాం. ఆస్పత్రులలో అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఉచిత డయాగ్నస్టిక్ సెంటర్లు, కిడ్నీరోగుల కోసం ఉచితంగా డయాలసిస్ సెంటర్లు, అన్ని ఆస్పత్రులలో ఆక్సిజన్ సదుపాయం గల పడకలు ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కేవలం 1400 ఆక్సిజన్ పడకలు ఉంటే, వాటి సంఖ్యను 27,966కు అంటే 20 రెట్లు పెంచుకున్నాం. ఇటీవలే వైద్యారోగ్యశాఖలో 950 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను, 1442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించుకున్నాం.
రాష్ట్రం నలువైపుల నుంచీ రాజధాని నగరానికి వైద్యం కోసం వచ్చే రోగులకు సత్వరం కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడం కోసం హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించుకుంటున్నాం. నిమ్స్ విస్తరణలో భాగంగా మరో రెండువేల పడకలతో ఏర్పాటు చేస్తున్న నూతన వైద్య భవనానికి ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే స్వయంగా నేను శంకుస్థాపన చేస్తున్నాను. వరంగల్ నగరంలో రూ.1100 కోట్లతో 2 వేల పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. అతి త్వరలోనే ఈ హాస్పిటల్ ప్రారంభించుకునే అవకాశం ఉంది.
గతంలో నగరంలోని బస్తీలలో వైద్యసౌకర్యాలేవీ ఉండేవి కావు. పేదలు విధిలేక ప్రైవేటు వైద్యులను ఆశ్రయించ వలసి వచ్చేది. బస్తీ పేదలకు చేరువలో వైద్యం అందించేందుకు హైదరాబాద్లో 256 బస్తీ దవాఖానాలు ప్రారంభించింది. వీటిలో 57 రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. మేలైన చికిత్సలను అందిస్తున్నారు. బస్తీ దవాఖానాల మాదిరిగానే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానాలను ప్రారంభించబోతున్నది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్, ఆరోగ్యలక్ష్మి తదితర పథకాల వల్ల వివిధ ఆరోగ్య సూచీల్లో తెలంగాణ రాష్ట్రం అద్భుత పురోగతిని సాధించింది. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల రేటు 30 శాతం నుంచి 62 శాతానికి పెరిగింది. అలాగే, ప్రసవ సమయంలో మాతృ మరణాల రేటు 2014లో లక్షకు 92 కాగా ప్రస్తుతం 43కి తగ్గిపోయింది. శిశు మరణాల సంఖ్య 2014లో వెయ్యికి 35 కాగా ప్రస్తుతం 21కి గణనీయంగా తగ్గిపోయింది.
అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ‘ఆరోగ్య మహిళ’ అనే అత్యుత్తమమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. రాష్ట్రంలో వంద దవాఖానాలలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం అమలవుతున్నది. భవిష్యత్తులో మరో 1200 దవాఖానాల్లో ప్రభుత్వం అమలు చేయనున్నది. ఈ మహిళా దవాఖానాలు ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే పని చేస్తాయి. ఇందులో అటెండర్ నుంచి వైద్యుల వరకూ అంతా మహిళలే ఉంటారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యలను సత్వరం పరిష్కరించుకోవచ్చు. ఇక్కడే వైద్య పరీక్షలు చేసి అక్కడికక్కడే మందులు కూడా అందజేస్తారు. అవసరమైతే రిఫరల్ ఆస్పత్రులకు సిఫార్సు చేస్తారు.
రాష్ట్రం ఏర్పాటయిన నాటికి తెలంగాణ ప్రాతంలో కేవలం మూడంటే మూడు వైద్య కళాశాలలు ఉండేవి. ఉస్మానియా, గాంధీ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేకన్నా ముందు నుంచే ఉన్నాయి. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. తొలి ఏడున్నర సంవత్సరాల కాలంలోనే ప్రభుత్వం 12 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించింది. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 26కి చేరుతుంది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనే లక్ష్యం అతిత్వరలోనే నెరవేరనుంది. 2014లో తెలంగాణ ప్రాంతంలో మెడికల్ సీట్లు 850 ఉండగా, వాటి సంఖ్య 2022-23 నాటికి 2,790కి పెరిగింది. వీటితోపాటు పీజీ సీట్లు కూడా రెట్టింపయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు సగటున 19 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య విద్యలో తెలంగాణ దేశం మొత్తంలో ప్రథమ స్థానంలో ఉంది. మెడికల్ పీజీ సీట్లలో ప్రతి లక్ష జనాభాకు 7 సీట్లతో దేశంలో రెండో స్థానంలో ఉంది.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.