ఆంధోల్: కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అంటున్నదని, కాబట్టి 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ పార్టీని, ఆంధోల్లో క్రాంతి కిరణ్ను గెలిపించాలని సీఎం కోరారు. క్రాంతి కిరణ్ను గెలిపించి ఆయన చేతుల మీరు కత్తి పెట్టాల్నని, కత్తి ఒకలికి ఇచ్చి, యుద్ధం ఒకల్ని చేయమంటే అయితదా..? అని ఓటర్లను ప్రశ్నించారు. క్రాంతి కిరణ్ను గెలిపిస్తే ఆంధోల్ మరింత అభివృద్ధి చెందుతదని అన్నారు. ఆంధోల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు.
‘బీఆర్ఎస్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలతోటి వ్యవసాయం బాగుపడ్డది. ఇయ్యాలా రాష్ట్రంలో మూడు కోట్ల టన్నుల వడ్లు పండుతున్నయ్. కాంగ్రెస్ హయాంల ఉత్త కోతలే ఉండేటియి.. ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో వరి కోతలు ఉంటున్నయ్. కాంగ్రెసోళ్లు ధరణిని తీస్కపోయి బంగాళాఖాతంలో వేస్తమని అంటున్నరు. అంటే ఏమన్నట్టు..? ధరణిని తీసేసి మళ్ల ఎనకటి దళారీ రాజ్యం తెస్తరన్నట్టు. రైతులు దళారీల చుట్టు తిరిగి, లంచాలు పోసే పరిస్థితి తీసుకొస్తరన్నట్టు. కాబట్టి పొరపాటున కూడా కాంగ్రెస్ను గెలువనీయవద్దు. కాంగ్రెస్ గెలిస్తే అంతా బూడిదల పోసిన పన్నీరు అయితది’ అని హెచ్చరించారు.
‘సింగూరు జలాశయం మన నెత్తిమీద కుండలా ఉంటది. నాకు జోగిపేట బాగా తెలుసు. ఇక్కడ నేను తిరగని గల్లీ లేదు. జోగిపేట పట్టణంలో మాణిక్రెడ్డి సాబ్ ఇంట్లో పండుకుని ప్రతి గల్లీ తిరిగిన నేను మినిస్టర్గా ఉన్నప్పుడు. సమస్యలన్నీ చూసి చేయాల్సినవన్నీ చేసిన. సింగూరు నీళ్లు ఆనాడు ఎందుకు రాలే…? ఎందుకు కాంగ్రెసోళ్ల నోర్లు బంద్ అయినయ్..? సమైక్య పాలకులు మన నోర్లుగొట్టి, ఇటు మనల ముంచి, అటు ఘనపూర్ ఆయకట్టును ముంచి, నిజాంసాగర్ ఆయకట్టును ముంచి, సింగూరును హైదరాబాద్కు అప్పజెప్పి మంచి నీళ్లు అని పెడితే ఒక్క కాంగ్రెసోడు నోరు తెర్సిండా..? ఇక్కడ నిలబడ్డ దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టలేదా..? మరె ఏం జేసిండు..? ఎందుకు తేలేదు నీళ్లు..?’ అని సీఎం ప్రశ్నించారు.
‘సమైక్య రాష్ట్రంల చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి అని ఒకాయన ఉండె. మనోళ్లు హరీశ్రావుగిట్ల తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి అసెంబ్లీల కొట్లాడుతున్నరు. అప్పుడు ఆయన ఏమన్నడు..? తెలంగాణకు ఒక్క రూపాయి గూడా ఇయ్య.. ఏం జేసుకుంటరో చేస్కోపోండ్రి అన్నడు. ఒక్క కాంగ్రెసోడన్నా మాట్లాడిండా..? ఇదే దామోదర రాజనర్సింహ మంత్రి పదవి వెలగబెట్టుకుంట ముసిముసి నవ్వులు నవ్వుకుంట ఆసెంబ్లీల కూసున్నడు. మరి ఇయ్యాల ఏం ముఖం పెట్టుకుని ఓట్లడుగుతుండు..? కాంగ్రెసోళ్లు పైనంగనేమో రైతుబంధు దుబారా, 24 గంటల కరెంటు వృథా, ధరిణి తీసేస్తం అని మాట్లాడుతున్నరు. ఇక్కడ రాజనర్సింహనేమో నాకు ఓటేసి గెలిపించండి అని అడుతున్నడు. రేపు కాంగ్రెస్ గెలిచి మూడు గంటల కరెంటు చేస్తే ఏం జేస్తడు..? అది పైనోళ్లు జేసిన పని నా చేతుల లేదు అంటడు. అయినా కాంగ్రెసోళ్లు గెలిస్తే ఢిల్లీకి, హైదరాబాద్కు తిరుగుడే సరిపోతది. ఈడ ఉంటరా..? క్రాంతి కిరణ్ లోకల్ వ్యక్తి కాబట్టి మీ మధ్యలనే తిరుగుతున్నడు. కాంగ్రెసోడు గెలిస్తే ఈ పరిస్థితి ఉంటదా..? కాబట్టి మీరు ఒట్టిగ ఓటెయ్యొద్దు. జాగ్రత్తగా ఓటేస్తే మంచిగ పని చేసే నాయకులు, ప్రభుత్వం ఉంటయ్’ అన్నారు.
‘సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల గానీ.. సింగూరుకు కాళేశ్వరం లింకు గానీ.. వీటి ద్వారా జోగిపేట నియోజకవర్గంలో ఒక లక్షా 70 వేల ఎకరాలకు నీటి పారుదల వస్తది. జోగిపేట సుభిక్షంగా, బ్రహ్మాండంగా ఉంటది. కాబట్టి ఇక్కడ క్రాంతి కిరణ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుతున్నా. క్రాంతి కిరణ్ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని కోరికలు కోరిండు. అవన్నీ నెరవేరుస్తా అని మాట ఇస్తున్నా. కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యంలనే గదా తెలంగాణ నాశనం పట్టంది. ఇందిరమ్మ రాజ్యం మంచిగుంటే.. ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం పథకం ఎందుకు తెచ్చినట్టు..? ఇందిరమ్మ రాజ్యం సక్కగ లేకనేగదా ఎన్టీఆర్ రూ.2కు కిలో బియ్యం పథకం తెచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలనే గదా తెలంగాణ కోసం కొట్లాడిన 400 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నది’ అని సీఎం విమర్శించారు.