CM KCR | మంచిర్యాల : సజీవమైన గోదావరిని చూస్తుంటే తన హృదయం ఉప్పొంగిపోయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి అని పాటలు పాడుకున్నాం. కానీ ఇవాళ గోదావరి సజీవంగా ఉందని కేసీఆర్ తెలిపారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ మాట్లాడారు.
మంచిర్యాల జిల్లా కావాలనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల కాంక్ష అని కేసీఆర్ తెలిపారు. జిల్లా కోసం ఎన్నో పోరాటాలు, నిరాహార దీక్షలు చేశారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లా ఏర్పడింది. మెడికల్ కాలేజీతో పాటు ఆస్పత్రిని సమకూర్చుకుంటున్నాం. ఇప్పుడు మొదలు పెడితే రేపటి వరకు బీఆర్ఎస్ కార్యక్రమాలు చెప్పొచ్చు అని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పనుల కోసం చెన్నూరు, బెల్లంపల్లి వారు దూరం పోవాల్సిన అవసరం లేదు అని కేసీఆర్ అన్నారు. మీ వద్దకే పరిపాలన వచ్చింది. ఉద్యమ సమయంలో మంచిర్యాలకు వచ్చాను. సింగరేణి కార్మికులు, ప్రజలను ఉద్దేశించి అనేక సందర్భాల్లో మాట్లాడాను. ఉద్యమ సందర్భంలో జరగాలని కోరుకున్న వాటిని సాధించుకుంటూ తెలంగాణను దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుకున్నాం. తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగంలో మనమే నెంబర్ వన్. తాగునీటి సదుపాయంలో మిషన్ భగీరథ ద్వారా అన్ని ఇండ్లకు మంచినీటిని సరఫరా చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత కరెంట్ను రైతాంగానికి అందిస్తున్నాం. రైతుబంధు ద్వారా 65 వేల కోట్ల పంపిణీ చేశాం అని కేసీఆర్ వివరించారు.
గతంలో పంటలు పండాలంటే నీళ్లు, కరెట్ లేక గోసపడ్డాం అని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ యాసంగిలో భారతదేశం మొత్తం మీద సాగైన వరి పంట 94 లక్షల ఎకరాలు. అందులో తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి ఉత్పత్తిలో పంజాబ్ను మించిపోయింది తెలంగాణ. గతంలో ఒక కోటి టన్నులు పండితే చాలా ఎక్కువ అనుకున్నాం. కానీ ఇప్పుడు 3 కోట్ల టన్నులు పండింది. కేంద్ర ప్రభుత్వాల యొక్క దుర్గార్మల పాలసీ లక్ష కోట్ల విలవైన పామాయిల్ను దిగుమతి చేసుకుంటున్నాం. ఆ బాధ నుంచి తప్పించుకునేందుకు 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ పంట పండించాలని నిర్ణయించుకున్నాం. పామాయిల్ పంట వేసేందుకు మంచిర్యాల జిల్లాలో బ్రహ్మండంగా ముందుకు వస్తున్నారు. దాని కోసం పామాయిల్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని రూ. 500 కోట్లతో మందమర్రిలో ఏర్పాటు చేసుకోబోతున్నాం. శంకుస్థాపన చేసుకున్నాం. ఆదివాసీ గిరిజినులకు పోడు భూముల పట్టాలు ఇచ్చుకుంటున్నాం. గొర్రెల విడత పంపిణీ చేసుకున్నాం. ఎంబీసీ కులాల్లో ఉండే నిరుపేదలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని కూడా ప్రారంభించుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.
సజీవమైన గోదావరి చూస్తుంటే తన హృదయం ఉప్పొంగిపోయింది అని కేసీఆర్ పేర్కొన్నారు. 250 కిలోమీటర్ల గోదావరి సస్యశ్యామలంగా ఉంది. సదాశివుడు అనే గొప్ప కవి ఉండేవారు. తలాపున పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి అని ఆయన పాటలు రాస్తే మనం పాడుకున్నాం. కానీ ఇవాళ గోదావరి సజీవంగా ఉంది. చెన్నూరు నియోజకవర్గానికి లిప్ట్కు శంకుస్థాపన చేసుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.