CM KCR | హైదరాబాద్ : గతంలో అమలు చేసిన ప్రతి పాలసీని యథావిధిగా కొనసాగిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల కొనసాగింపు విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, సందర్భోచితంగా పథకాలను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆదివారం మధ్యాహ్నం విడుదల చేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో అనేక విషయాల్లో అగమ్యగోచర పరిస్థితులు ఉండేవి. సాగు, తాగునీరు లేక కరువులతో అల్లాడుతూ, బతుకుదెరువు కోసం దేశం నలుమూలలా లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు వలస పోయేవారు. నాడు కరెంట్ లేదు, ఇరిగేషన్ సౌకర్యం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక రెండు, మూడు మాసాల పాటు ఆర్థిక నిపుణులతో మేధోమదన చర్చలు జరిపాం అని కేసీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ క్యారెక్టర్ ఏంటంటే.. మేనిఫెస్టోల రూపంలో, ఎన్నికల ప్రణాళిక రూపంలో చెప్పింది 10 శాతం మాత్రమే అని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ ఆచరణ రూపంలో, స్వీయ అనుభావాలను, ప్రజల అవసరాలను బట్టి.. 90 శాతం పథకాలను రూపకల్పన చేసుకున్నాం. కల్యాణలక్ష్మి, రెసిడెన్షియల్ పాఠశాలలు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు, విదేశీ విద్యా స్కాలర్షిప్స్ వంటి వాటిని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని అమలు చేశాం. ఇలా 90 శాతం పథకాలు ఎన్నికల ప్రణాళికలో ప్రకటించనవే ఎక్కువగా ఉన్నాయని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దళితులు, గిరిజనుల, మైనార్టీలు, 50 శాతం జనాభా ఉన్న బీసీ కులాల ప్రజల అవసరాలు, ఆశలను దృష్టిలో పెట్టుకుని పని చేశామని కేసీఆర్ తెలిపారు. 10 ఏండ్లు పాలన చేసిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీల కోసం రూ. 970 కోట్లు ఖర్చు పెడితే.. తాము తొమ్మిదిన్నరేండ్లలో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. మైనార్టీల విషయంలో మేనిఫెస్టోలో ప్రకటించకుండానే, ఆ పెద్దలతో మాట్లాడుతూ అనేక అభివృద్ధి పథకాలను అమలు చేసి ముందుకు తీసుకెళ్లామని సీఎం స్పష్టం చేశారు. మైనార్టీల బడ్జెట్ను పెంచుతాం. మైనార్టీల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా తీర్చదిద్దబోతున్నాం.
పదేండ్లలో ఒక్క సందర్భంలో కూడా అరాచకాలు, మతకల్లోలాలు, వేధింపులు లేకుండా అందరి పండుగలను గౌరవిస్తూ, ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తూ చాలా చక్కగా నిర్వహించుకున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు. సెక్యూలర్ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాం. ఈ మద్యనే రెండు పండగులు.. వినాయక చవిత, మిలాద్ నబీ కావొచ్చు. చిన్న చిన్న అవంతరాలు ఏర్పడే అవకాశం ఉందని మిలాద్ నబీని పోస్టుపోన్ చేసి గొప్పగా నిర్వహించి, ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. ఈ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో సహకరించిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు కేసీఆర్.
మంచి విలువలను బీఆర్ఎస్ పార్టీ నెలకొల్పింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో దళితుల గురించి ఆలోచించలేదు. ఒక వేళ ఆలోచన చేసి ఉంటే ఈపాటికి దళితుల పరిస్థితులు మారిపోయేవి. బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారిగా దళితబంధు కింద రూ. 10 లక్షల ఇస్తున్నాం. దళిత సమాజం బాగుపడే వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
గిరిజనులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. తండాలను, గూడేలను గ్రామపంచాయతీలుగా చేశాం అని కేసీఆర్ గుర్తు చేశారు. గిరిజన గూడెంలో, లంబాడీ తండాలో చక్కని అభివృద్ధి సాధిస్తున్నాం. పోడు పట్టాలు ఇవ్వడమే కాకుండా.. పోడు సందర్భంగా జరిగిన ఘర్షణల కేసులు ఎత్తివేశాం. రైతుబంధు, రైతుబీమా కల్పించాం. గిరిజన సోదరులకు 10 శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తున్నాం. వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చింది. వారి అభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతంది అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
బీసీ వృత్తులను వారిని గౌరవించాం అని కేసీఆర్ పేర్కొన్నారు. కాలేజీలు, స్కాలర్షిప్లు అందిస్తున్నాం. గొర్రెల, చేపల పెంపకం అమలు చేశాం. ఒకప్పుడు 16 వేల గొర్రెలు దిగుమతయ్యే పరిస్థితి. ఈనాడు మాంసం ఉత్పత్తిలో, గొర్రెల ఎగుమతిలో నంబర్ వన్ స్థానానికి ఎదిగాం. చేప పిల్లలను ఉచితంగా అందించాం. ఈ కార్యక్రమంతో వారు ఆర్థికంగా ఎదిగారు. బీసీల్లోని కులవృత్తుల వారికి కుటుంబానికి లక్ష చొప్పున కూడా అందించాం. భవిష్యత్లో ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగుతాయి అని కేసీఆర్ స్పష్టం చేశారు.