CM KCR | నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కొరత రానే రాదు.. మిగులు రాష్ట్రంగా కాబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తి గురించే కాదు.. ఆ అభ్యర్థి వెనకున్న పార్టీ చరిత్ర చూడాలి అని కేసీఆర్ సూచించారు. అలవోకగా, ఆషామాషీగా ఓటు వేస్తే కిందమీద అవుతుంది. మంది మాటలు పట్టుకుని మారువానం పోతే మళ్లొచ్చే వరకు ఇల్లు కాలిపోయిందని అన్నట్టు ఆగమాగం అయిపోతది. కాబట్టి ఓటు చాలా విలువైంది.. దాని ప్రభావం ఐదేండ్ల భవిష్యత్పై ఉంటది కాబట్టి జాగ్రత్తగా వాడాలి. అన్ని వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేశాం. సమస్యలన్నింటిని పరిష్కారం చేసుకున్నాం అని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో ఏ మారుమూల పల్లె అయినా, ఆదిలాబాద్లో గోండు బిడ్డలకు కూడా మంచినీళ్లు అందుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. మిషన్ భగీరథ బ్రహ్మాండంగా విజయవంతం చేసుకున్నాం. కరెంట్ సమస్య కంప్లీట్ చేసుకున్నాం. యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఇంకో 4 వేల మెగావాట్ల విద్యుత్ మనకు వస్తుంది. మిగులు రాష్ట్రంగా కాబోతున్నాం. కరెంటో కొరత రానేరాదు. ఎవరికి రాని, ఎవడు యేట్లే పడని, గంగల పడని, తెలంగాణకు మాత్రం ఆ కొరత రాదు. రానివ్వడు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అని సీఎం తేల్చిచెప్పారు.
ధరణి వచ్చాక భూముల పంచాయితీలు తగ్గాయని కేసీఆర్ చెప్పారు. నూటిలో ఒకరిద్దరికి సమస్య ఉంటే పరిష్కరిస్తాం. 17 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇవ్వడం లేదు. కానీ తెలంగాణలో మాత్రం బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నాం. దీని గురించి బీడీలు చుట్టే బిడ్డలు ఆలోచించాలి. ప్రభుత్వ వైఖరి, పార్టీ వైఖరి గురించి. పోటీలో ఉన్న పార్టీకి మెదడు ఎలా పని చేస్తదో, ఏమో ఆలోచిస్తదో విచారించాలి. ఏ రాష్ట్రం కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వట్లేదు. బాల్కొండ, ఆర్మూర్ ఈ ప్రాంతాల్లో బీడీ కార్మిక బిడ్డలు ఆలోచించాలి. బీడీ కార్మికులకు రేపు ఐదు వేల పెన్షన్ రాబోతోంది. మీ ఒక్క ఓటు కూడా ఇంకో పార్టీకి పడొద్దు. ఆ విధంగా కార్యకర్తలు ప్రచారం కూడా చేయాలి అని కేసీఆర్ సూచించారు.