CM KCR | ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పోరాడే పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మాకు ఢిల్లీలో బాసులు లేరు.. మాకు బాసులు ఎవరైనా ఉన్నారంటే అది మీరే తప్ప ఇంకెవరు లేరు అని కేసీఆర్ స్పష్టం చేశారు. మీరు ఏ ఆదేశం ఇస్తే, మీకు ఏది అవసరం ఉంటే దానికే తలవంచుతాం తప్ప మా బాసులు ఢిల్లీలో లేరు. ఇక్కడ వేరే ఏ పార్టీ గెలిచినా వారి కట్కలు ఢిల్లీలో ఉంటాయి. స్విచ్ అక్కడ వేస్తేనే ఇక్కడ బల్బులు వెలుగుతాయి. వీళ్ల చేతుల ఏం ఉండదు. అందుకోసం మంచి చెడు గుర్తించాలి. తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష. చదువుకున్న విద్యావంతురాలైన హరిప్రియా నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గిరిజన ప్రాంతంలో ఇంత పెద్ద సభలు జరగవు. ఇంత మంది వచ్చారంటేనే పెద్ద మెజార్టీతో గెలిచారని అర్థమవుతుంది. తప్పకుండా విజయం మనదే అనే విశ్వాసం కలుగుతుంది. మానవీయ కోణంలో ఆలోచించే మంచి విద్యావంతులరాలైన హరిప్రియను భారీ మెజార్టీతో గెలిపించాలి అని కేసీఆర్ కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలు, రైతుల గురించి ఆలోచించలేదు అని కేసీఆర్ తెలిపారు. అందుకే పార్టీల వైఖరి, దృక్పథం గురించి ఆలోచించాలి. వైద్య విధానం, విద్యా విధానం మన కండ్ల ముందుంది. ఇంతకు ముందు ప్రయివేటు దవాఖానాల్లో ఇష్టమొచ్చినట్లు ఆపరేషన్లు చేసి దోపిడీ జరిగేది. అమ్మ ఒడి వాహనాలు వస్తున్నాయి. కేసీఆర్ కిట్ అమలు చేసిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణలో అన్ని వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు. గురుకులాల్లో చదివిన పిల్లలు బ్రహ్మాండమైన ర్యాంకులు తెస్తున్నారు. ఆల్ ఇండియా లెవల్ నీట్ పరీక్షలో కూడా ఉత్తీర్ణులు అవుతున్నారు. ఎంబీబీఎస్ సీట్లు కొడుతున్నారు. ఇంజినీర్లు, డాక్టర్లు అవుతున్నారు. గతంలో ఈ గురుకులాలు ఎందుకు లేవు. గురుకులాలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. సీతారామా ప్రాజెక్టుల త్వరలోనే పూర్తవుతుంది. మన దరిద్రం కూడా పోతది. ఎత్తులో ఉన్న మండలాలకు లిఫ్ట్ పెట్టి నీళ్లిస్తాం అని కేసీఆర్ తెలిపారు.
గిరిజన సోదరులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు అని సీఎం ధ్వజమెత్తారు. మా తండాల్లో మా రాజ్యం కావాలని పోరాడారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలు చేశాం. గిరిజనులకే అధికారం వచ్చింది. అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇల్లందు నియోజకవర్గంలో మనిషి చనిపోతే జాగ లేక గుట్టల మీద కాలబెట్టే రోజులు ఉండే. ఇవాళ వైకుంఠధామాలు ఏర్పాటు చేశాం. ప్రజల కనీస అవసరాలు గుర్తించి చేసిన వారెవరో.. చేయని వారెవరో, ప్రజలను వారి ఖర్మకు వారిని వదిలేసిన వారు ఎవరో గుర్తించి ఓటు వేయాలి అని కేసీఆర్ సూచించారు.