CM KCR | కరీంనగర్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సగం తెలంగాణ తిరిగాను.. డెఫినెట్గా బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది.. మనం ప్రజలతో ఉన్నాం.. ప్రజలు మనతో ఉన్నారు.. 30న తషామా చూపెడుతారు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని గంగుల కమలాకర్కు మద్దతుగా ప్రసంగించారు.
రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతది. ఎవడు ఏది అన్నా.. ఎవడు ఏడ్సినా.. డెఫినెట్గా బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది. ఇప్పటికే సగం తెలంగాణ తిరిగాను. అద్భుతంగా ఉంది. మనకు ఏం డౌట్ అవసరం లేదు. ప్రతిపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రజలతో ఉన్నాం.. ప్రజలు మనతో ఉన్నారు.. 30న తమాషా చూపెడుతారు.. దానికి పైసా మందం కూడా రందీ పడాల్సిన అవసరం లేదు. రాష్ట్రం ఆర్థికంగా ముందుకు పోతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు.
కరీంనగర్లో చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారు. 75 ఏండ్ల తర్వాత కూడా ప్రజాస్వామ్యంలో పరిణితి రాలేదు. ప్రజాస్వామ్యంలో పరిణితి వచ్చిన దేశాలు ముందుకు పోతున్నాయి. మన దగ్గర ఎన్నికలు అనగానే హడావుడి, హంగామా, అభాండాలు, గాడిద, గుర్రం ఒక్కటై పని చేస్తాయి. గందరోగోళం చేస్తారు. ఫాల్తు వాగ్దానాలు, అవి నెరవేర్చకపోవడం, గెలవడానికి అనేక దుర్మార్గమైన పనులు, ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య పరిణితి వచ్చిన చోట ఇవి జరగవు. అమెరికాలో మనం పెట్టినట్టు సభలు కూడా పెట్టరు. టీవీల ద్వారా మెసేజ్ ఇస్తారు. ప్రభుత్వ పాలసీల మీదనే ఓటింగ్ వేస్తరు. అలాంటి పరిణితి రాకపోతే దేశం ముందుకు పోదు. కరీంనగర్ ప్రజలు విజ్ఞులు కాబట్టి ఆలోచించి ఓటేస్తారని మనవి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ఓటు. అది జాగ్రత్తగా వినియోగించాలి. ఈ రాష్ట్ర ప్రగతిని నిర్దేశిస్తుంది ఓటు. అంత శక్తివంతమైంది. ఎటు పడితే అటు వేయకూడదు. ప్రజలు గెలవాలి. అభ్యర్థుల గురించి కూడా ఆలోచించాలి. అంతకంటే ముఖ్యం అభ్యర్థుల వెనుకాల ఉన్న పార్టీల గురించి ఆలోచించాలి. ఆ పార్టీ ప్రజల గురించి ఏం ఆలోచిస్తది, నడవడిక, ఆలోచనా విధానం ఏంది..? రైతుల పేదల గురించి ఆ పార్టీల దృక్పథం ఏంటి..? ఏ పార్టీకి అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఎటు వైపు తీసుకెళ్తదని అని ఆలోచించాలి. ఆలోచించి మీరు నిర్ణయం తీసుకుంటే మంచి నిర్ణయాలు వస్తాయి అని కేసీఆర్ తెలిపారు.