CM KCR | హైదరాబాద్ : రాష్ట్రంలో గత నెలలో అనూహ్యంగా, అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అతివృష్టి పరిస్థితులను అంచనా వేస్తూ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది అని కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
భారీ వర్షాల నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి, ఆయా ప్రదేశాలకు సుశిక్షితులైన సిబ్బందినీ, పడవలనూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను, భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లను వినియోగించింది అని కేసీఆర్ తెలిపారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయ శిబిరాలు ఏర్పాటుచేసి ఆదుకున్నది. తక్షణ సహాయ చర్యల కోసం ప్రభుత్వం రూ. 500 కోట్లు విడుదల చేసింది. ఊహించనిరీతిలో కుంభవృష్టి కురిసి, వరదలు సంభవించినా, ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకొని ప్రాణ నష్టాన్ని, ఆస్తినష్టాన్నిచాలావరకు నివారించగలిగిందని సీఎం స్పష్టం చేశారు.
అతివృష్టి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. దెబ్బతిన్న ఇళ్ళకు గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం సాయం అందిస్తుంది. వరదలలో కోతకు గురైన పొలాల సంఖ్యను అంచనా వేయడం జరుగుతున్నది. జూన్, జూలై మాసాల్లో వర్షపాతంలో కలిగిన లోటును ఈ భారీ వర్షాలు భర్తీ చేశాయి. రాష్ట్రంలోని అన్ని జలాశయాలూ నిండుకుండలుగా మారాయి. ఈసారి వరిసాగు రికార్డు స్థాయిలో 64 లక్షల 54 వేల ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. పంటలు దెబ్బతిన్న రైతులు మళ్లీ విత్తనాలు వేసుకొనేందుకు వీలుగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సందర్భంగా బాధితులకు ప్రభుత్వం అన్నివేళలా బాసటగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.