CM KCR | తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వాగ్భాణాలు సంధించారు. హుజూర్నగర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మొన్న నేను ఉన్నది ఉన్నట్లు చెబితే ఉత్తమ్ కుమార్రెడ్డి ఎగిరెగిరిపడ్డడు. నాగార్జున సాగర్ నెహ్రూ కట్టించారన్నడు.. మరి నేను కట్టించానని చెప్పానా? నెహ్రూ కట్టలేదని చెప్పానా? అబద్ధాలు చెప్పే అవసరం మాకుందా? కట్టాల్సిన చోట కట్టలేదు.. రావాల్సిన నీళ్లు వస్తవలేవు.. కుడికాలువకు ఎక్కువ నీళ్లు పెట్టుకున్నరు.. ఎడమ కాలువను నాశనం పెట్టించారని మొదటి నుంచి మొత్తుకుంటున్నం. ఇది జరుగుతున్న సత్యం’ అన్నారు.
‘2003లో విజయసింహారెడ్డి ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉండే. అక్కడ కడియం శ్రీహరి ఆ అప్పడు ఇరిగేషన్ మంత్రిగా ఉండే. ఇప్పుడు మన పార్టీలో ఉన్నడు. నీళ్లు పెట్టుకోమని, పంటలు వేసుకోమని చెప్పారు.. ఎడమకాలువ కింద రైతులు పంటలు వేశారు. మధ్యలోనే నీళ్లు బంద్ చేశారు. ఒక మూడుతడులు అయితే పంటలు పండిపోతయ్.. దానికి నీరు ఇవ్వలేదు. విజయసింహారెడ్డితో పాటు మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ ప్రాంతాల వారు నా వద్దకు వచ్చారు. అందరం నాగార్జునసాగర్ కట్టమీదికి పోయినమ్. కట్టమీద నిలబిడి నేను గవర్నమెంట్కు వార్నింగ్ ఇచ్చాను. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా పెద్ద మనిషిని కాబట్టి తూం పగులగొడుతలేను.. 24గంటల్లో నీళ్లు ఇవ్వకపోతే 5లక్షల మందితో వచ్చి తూం ఇప్పుతా అని చెప్పడం జరిగింది’ అంటూ సీఎం గుర్తు చేసుకున్నారు.
‘నాతో కలిసి మిర్యాలగూడ నుంచి వచ్చిన యువకులు ఉన్నారు. సార్ 60-70వేల మంది వచ్చినమ్.. ఏం అయితది సార్ తూము ఇప్పాలంటే.. నేను చెప్పినా.. తూములు ఇప్పితే నీళ్లు రావు.. పోలీసులు వస్తారు.. తెలివి కావాలే.. నీకు ఎందుకు.. తెల్లారే వరకు నీరు వస్తాయని చెప్పాను. చెప్పినట్లుగానే తెల్లారే వరకు నీళ్లు వదిలారు. నేను ఏమంటున్నామంటే.. గులాబీ జెండా ఎగిరినంక టీఆర్ఎస్ నాయకులు ప్రతి విషయంలో కొట్లాడారే తప్పా.. ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు కొట్లాడలేదు? నీళ్లు ఇస్తవా.. రాజీనామా చేయమంటవా అంటే దెబ్బకు దిగిరారా? కానీ అడగలేదు. మాకు పదవులు ముఖ్యం.. కాంట్రాక్టులు ముఖ్యం.. పైరవీలు ముఖ్యం.. నీళ్లు ఎటుపోతేంది.. కరెంటు వస్తేంది.. ఎవరు ఎటుపోతేంది ఇదీ కాంగ్రెస్ నేతల వైఖరి’ అంటూ తూర్పారబట్టారు.
‘ఒక విషయం మాత్రం బాగా కండ్లారా చూశారు. ఇదే ఉత్తమ్ కుమార్రెడ్డి మంత్రిగా ఉన్నడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాజాప్తా ముఖ్యమంత్రితో అసెంబ్లీలో కొట్లాడుతున్నరు. అడిగిన జవాబు లేక చెప్పే తెలివిలేక ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి లేచి ఒకమాట అన్నడు. మీరిట్లే మాట్లాడితే.. తెలంగాణకు ఒక్కపైసా కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని మాట్లాడిండు. ఇంత మంది కాంగ్రెస్ మంత్రులున్నరే.. అందులో ఒక్కడూ మొగోడు లేకుండనా? ఒక్క తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. మంత్రో.. ముఖ్యమంత్రిగా ఉండి అలా ఎలా మాట్లాడుతారు.. మేమంతా తెలంగాణ బిడ్డలం.. మా ముందే ఈ మాట అంటవా?.. అని లేచి నిలబడాలి.. అవసరమైతే రాజీనామా మొఖానికి కొట్టాలి. మరి ఎక్కడికిపాయే పౌరుషం.. ఇవాళ హుజూర్నగర్లో ఓట్లు కావాలి.. నల్లగొండలో ఓట్లు కావాలి.. నాగార్జునసాగర్లో ఓట్లు కావాలి.. కానీ తెలంగాణ ప్రజల బాధమాత్రం అవసరం లేదు. ఒక్కటే మాట మనవి చేస్తున్నా’నన్నారు.