హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ‘నవంబర్ 30న ప్రజా ఓట్లతో దుమ్ములేవాలె.. నా ముందున్న జనం దమ్ము కేసీఆర్ దమ్ము కాదా? ఈ దమ్ము మొత్తం బైలెల్లితే దమ్ము.. దుమ్ము లేస్తది’ అని విపక్షాలను బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. చాలా కాలం తర్వాత కేసీఆర్ తన పూర్వ ఉద్యమభాషను భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. ‘కేసీఆర్ నీకు దమ్ముందా? కొడంగల్కు వస్తవా? కొడవలి పట్టుకొని వస్తవా? గాంధీ బొమ్మదగ్గరకొస్తవా? అంటున్రు.. కేసీఆర్ దమ్మేందో ఢిల్లీకి తెలుసు. దేశం మొత్తానికి తెలుసు’ అని తన దమ్మేందో గుర్తుచేశారు. తన బలం ప్రజలేనని తేల్చిచెప్పారు. ‘ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు, సిపాయిలు.. తెలంగాణ రాకముందు ఎవరి బూట్లు తుడ్చారో.. ఎవడేం పనిలో ఉన్నారో తెలుసు. నాడు పక్షిలాగా ఊరూరు తిరిగి, యావత్తు తెలంగాణను ఉద్యమంగా మలిచి పోరాడి రాష్ర్టాన్ని సాధించుకున్నాం’ అని నిప్పులు చెరిగారు. నిన్నటి దాకా ఒక లెక్క.. ఇప్పటి నుంచీ ఒక లెక్క అన్నట్టే సీఎం కేసీఆర్ గురువారం ప్రసంగాలు దుమ్మురేపాయి. ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా ఆయన అచ్చంపేట, వనపర్తి, మునుగోడు నియోజకవర్గాల్లో పాల్గొని, ప్రసంగించారు. మూడు నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ విపక్షాలపై చండ్రనిప్పులు చెరిగారు. మిగతా పార్టీల రాజకీయ నాయకులు, ఎన్నికల కోసమే రాజకీయాలు చేసే నాయకుల్లా కాకుండా తనకు బాధ్యత ఉందని విస్పష్టం చేశారు. తెలంగాణ తెచ్చిన నేతగా, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుతున్న నేతగా తాను చెప్తున్నానని ప్రకటించారు. ప్రజలు గెలవాలని ఉద్బోధించారు. ఒక దశలో ‘ఫర్ సపోజ్… మీరు ఓడగొడితే రెస్ట్ తీసుకుంటం. మాకు వచ్చేదేమీ లేదు పోయేదేమీ లేదు. నష్టపోయేది ప్రజలే. చెప్పుడు మా బాధ్యత. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లుగా తెలంగాణను ఓ దరికి తీసుకువస్తున్న వాళ్లుగా మీకు చెప్పడం మా కర్తవ్యం’ అని సీఎం కేసీఆర్ స్ఫటిక సదృశ్యంగా చెప్పారు.
అధికారమే పరమావధిగా, అందుకోసమే రాజకీయాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ విధానాలను కేసీఆర్ తూర్పారబట్టారు. గతంలో జానారెడ్డిలాంటి నాయకులు మాట తప్పినట్టే తాజాగా కర్ణాటకలో కాంగ్రెస్ మాట తప్పిన పాలనను తనదైన శైలిలో ఏకరువు పెట్టారు. ‘నాడు అసెంబ్లీ సాక్షిగా రెండేండ్లలో 24 గంటల కరెంటు తెలంగాణలో ఇస్తామని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని వాగ్దానం నేను చేసిన. చెప్పినట్టు చేసిన. అప్పుడు కాంగ్రెస్ నేత జానారెడ్డి.. 24 గంటల కరెంటు ఇస్తే తాను రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తానని చెప్పి, నేడు మాట తప్పాడు’ అని గుర్తుచేశారు. ‘మొన్న కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు 24 గంటలు కరెంటు ఇస్తమని కోసిన కోతలు నెరవేరకపోవడంతో.. అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. అక్కడి కాంగ్రెస్ నాయకులు కొడంగల్, గద్వాలకు వచ్చి కాంగ్రెస్కు ఓటు వేయొద్దని ధర్నాలు చేస్తున్నారు’ అని ఆ పార్టీ మాటతప్పిన గత వర్తమాన చరిత్రను సీఎం కేసీఆర్ వివరించారు. అదే సమయంలో బీజేపీ నాటకీయ కుట్రలను పటాపంచలు చేశారు. ‘ఎన్నికల వేళ బీజేపీ నుంచి ముఖ్యమంత్రులు దిగుతారు. మనం చేసే పనుల్లో పదిశాతం కూడా పనులు చేయని సన్నాసులు మనకు నీతులు చెప్తారు’ అని నిప్పులు చెరిగారు.
ఎన్నికలు రాంగనే ఎవరేది పడితే అది చెప్తే విని ఊరుకోకూడదని కేసీఆర్ ప్రజలకు హితవు పలికారు. ఎవరొస్తే తెలంగాణ మంచిగుంటదో ఆలోచించి ఓటెయ్యాలని, లేదంటే తెలంగాణ ఆగమైతది..కుకలు, నకలు చింపిన తెలంగాణ అయితది’ అని తెలిపారు. మొత్తంగా నిన్న మొన్నటిదాకా ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రసంగానికి.. గురువారం నాటి పదునెక్కిన భావవ్యక్తీకరణకు నడుమ తెలంగాణ ఆర్తి.. భవిష్యత్తు చిత్రణను స్పష్టం చేశారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి పాలమూరులో వెలిసిన గంజికేంద్రాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడను వదిలించేందుకు తాను పడిన శ్రమను, పడ్డ క్షోభను కేసీఆర్ కండ్లకు కట్టారు. ‘పాలమూరులో గంజికేంద్రాలు పెట్టిననాడు, గొంతులెండి కిలోమీటర్ల కొద్ది బిందెలు పట్టుకొని నీళ్లకోసం వెళ్లిననాడు, అర్ధరాత్రి కరెంటుకోసం పోతే పాములు, తేళ్లు కుట్టి చనిపోయిననాడు, కరువును తట్టుకోలేక ఏడ్చుకుంటూ బొంబాయికి వలసపోయిననాడు ఈ కొడుకులు ఒక్కడైనా ఉన్నడా? ఎవడైనా వచ్చిండా? రేపు ఉంటరా? బహురూపులుగా వచ్చేవారిని తరిమికొట్టండి’ అని కేసీఆర్ ధర్మాగ్రహాన్ని ప్రదర్శించారు. ‘ఇన్నాళ్లూ మీ బిడ్డగా నేను పోరాటం చేశాను. ఇప్పుడు మీరు పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది’అని హితబోధ చేశారు. తెలంగాణను పోరాడి సాధించుకున్నామని, తెలంగాణ ఒకడు పెట్టిన భిక్షకాదని పునరుద్ఘాటించారు. ఎన్నికలవేళ ప్రజలు ఆగం కాకూడదని చెప్పారు.