CM KCR | మోదీకి తెలంగాణ అంటే ఏం పగనో అర్థం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర సాధన – సాధించిన ప్రగతిపై చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ విద్యుత్ వినియోగంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్. జాతీయ సగటు మనకు సమీపంలో లేదు. అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడి నుంచి వచ్చింది. కాంగ్రెస్ హయాంలో విద్యుత్.. మొన్న వీళ్ల కడుపులున్నది బయటపెట్టారు. ఇస్తమని చెప్పేది తొమ్మిది గంటలు. పొద్దంతా ఇచ్చేది మూడు గంటలు.. రాత్రి ఇచ్చేది నాలుగు గంటలు. అక్కడికి వెళ్లి కరెంటు షాక్, పాములుకుట్టి వందలమంది చనిపోయారు. 24గంటల కరెంటు ఇస్తున్నా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వాళ్లకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నయని భావిస్తున్నరు. వాలికి చూస్తే ఇల్లు సంగతి తెలుస్తుంది అన్నట్లుగా.. కొన్ని సూచికలు చూస్తే రాష్ట్రం మొత్తం పరిస్థితి తెలిసిపోతుంది’ అన్నారు.
‘ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో 24గంటల విద్యుత్ సరఫరాలో లేదు. కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు. చాలా కష్టపడి ఈ పరిస్థితిని తీసుకువచ్చాం. రాష్ట్రం ఏర్పడిన నాడు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ స్థాపిత విద్యుత్శ్చక్తి 7,778 మెగావాట్లు. ఈ రోజు ఇన్స్టాల్డ్ కెపాసిటీ 18,756 మెగావాట్లు. అతిత్వరలో, నాలుగైదు నెలల్లో పబ్లిక్ సెక్టార్లో స్థాపించిన అల్ట్రామెగా పవర్ ప్లాంట్ ఇండియాలోనే నెంబర్ వన్. ఎన్టీపీసీ కూడా తర్వాత వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంగా, జెన్కో ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల పవర్స్టేషన్ను రూ.30వేలకోట్లతో నల్గొండ దామరచర్లలో ప్రారంభించాం. కాకతాళీయంగా తెలంగాణలో ఉండే పవర్ స్టేషన్లన్నీ ఉత్తర భాగంలో ఉన్నాయి. కొత్తగూడెం, పరకలా కాకతీయ కావచ్చు. భద్రాద్రి, ఎన్టీపీసీ రామగుండం కావచ్చు. నిజాం స్థాపించిన పవర్ స్టేషన్లన్నీ గోదావరి ఒడ్డున ఉత్తరం వైపు ఉన్నాయి. ఒక పవర్ లోడ్ సెంటర్ రావాలంటే దక్షిణ తెలంగాణలోనూ పెద్ద విద్యుత్ సంస్థ ఉండాలి. 2444 మెగావాట్ల జలవిద్యుత్ శ్రీశైలం, నాగార్జున సాగర్ మీదున్నది. ఇది సంవత్సరం పొడువునా రాదు. దక్షిణ తెలంగాణ సైతం బ్రహ్మాండంగా ఉండాలని టేల్పాండ్లో సమృద్ధిగా నీరుంటాయని నల్లగొండ జిల్లాలో పెట్టాలని మంత్రి జగదీశ్రెడ్డి నాతో కొట్లాడిండు. నాగార్జునసాగర్లో డెడ్ స్టోరీ 100 టీఎంసీలు ఉంటది కాబట్టి నిపుణులతో చర్చించి దామరచర్లలో ప్లాంట్ను పెట్టాం’ అని తెలిపారు.
‘ఇటీవల అక్కడ పర్యటించిన సమయంలో సంతోషం అనిపించింది. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆపేస్తమని మాట్లాడున్నరు. అక్కడ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అనే పుణ్యాత్ముడు మాట్లాడుతున్నడు. ఎన్టీపీసీ రామగుండం ఫస్ట్ ఫేజ్లో వచ్చింది 700మెగావాట్లతోనే. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేనూ వెంట వెళ్లారు. నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ వచ్చి శంకుస్థాపన చేశారు. ఇవాళ రామగుండంతో నేడు కరీంనగర్ జిల్లా ఆర్థికంగా ఏ విధంగా ఉన్నది. ఎన్టీపీసీ టౌన్షిప్ అంటే అక్కడ గర్వంగా చెప్పుకుంటరు. అలాంటిది ఏకబిగిన 4వేల మెగావాట్లు వస్తే దాని మంచి తెలియదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు. గత ఎన్నికల్లో చెప్పినా.. భూపాల్రెడ్డి నల్లగొండ జిల్లా అభ్యర్థిగా ఉంటే.. అప్పుడు సరైన సమయంలో అక్కడికి చేరుకున్నారు. మీ జిల్లాలో ఇలాంటి దుర్మార్గులను ఎలా గెలిపిస్తున్నరు ? వీళ్లకు అభివృద్ధి గురించి జ్ఞానం సోయి ఉందా? 30వేలకోట్లతో పవర్ ప్లాంట్ పెడితే దాన్ని తీసివేస్తామని చెప్పిన వ్యక్తిని నల్గొండలో గెలిపిస్తరా? అని ప్రశిస్తే ఆయను ఒడగొట్టారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దామరచర్ల విద్యుత్ ప్రాజెక్టును బంద్ చేస్తమని మాట్లాడుతున్నరు. మూడునాలుగు నెలల్లో విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించుకోబోతున్నాం’ అని ప్రకటించారు.
‘నరేంద్ర మోదీకి మనమంటే ఏం పగనో. తల్లిని చంపి బిడ్డను బతికించారని అంటున్నరు. పునర్వీభజన ద్వారా ఎన్టీపీసీలో 4వేల ప్లాంట్పెట్టి మొత్తం తెలంగాణకే సప్లయ్ చేయాలని చెప్పారు. పదేళ్ల కింద చట్టం చేస్తే ఇప్పటి వరకు హరీ లేదు శివ లేదు. 1600 మెగావాట్లే పని జరుగుతున్నది. ఇక్కడి నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అమిత్షా అనే ఆయన వచ్చి తిరుగుతాంటడు. నెల రోజుల్లో ప్రభుత్వాన్ని కూలగొడుతామంటరు. చేతనైతే కరెంటు ఇవ్వరాదా? ఇది చేతకాదు. 1600 మెగావాట్లు రెడీ అయ్యిందని అధికారులు చెబుతున్నారు. దాని ప్రారంభోత్సవానికి హాజరై ప్రధాని జాతికి అంకితం చేస్తరు.
వీళ్లు చాలా గొప్పొళ్లు. రైల్వేస్టేషన్లలో లిఫ్ట్లు ప్రారంభించి జాతికి అంకితం అంటరు. వందే భారత్ రైలుకు వందసార్లు జెండా ఊపుతరు. మరో 6400 ఫర్మ్ పవర్ రాబోతున్నది. 25వేల మెగావాట్ల రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందదబోతుందని సగర్వంగా చెబుతున్నా. 25వేల మెగావాట్లు కథలు కడితే వస్తుందా? హైడల్ విద్యుత్ రెండున్నర నెలల్లో వస్తుంది. దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవడం లేదు. పవర్ బ్యాంక్ క్రియేట్ చేసుకొని రాజస్థాన్కు ఇస్తున్నాం. మాకు అవసరం ఉన్న సమయంలో మీరు ఇవ్వాలని ఎక్స్ఛేంజీ పద్ధతిలో ఇస్తున్నాం. ఇంత నిబద్ధతతో 24 గంటలు కరెంటు ఇస్తున్నాం. ఎంత పీక్లోడ్ వచ్చినా ఇస్తున్నాం. మే నెలలో 24 గంటల విద్యుత్ సరఫరా చేయగలిగాం’ అని తెలిపారు.
‘కాంగ్రెసోళ్ల అధ్యక్షుడు అమెరికావోయి.. మూడు గంటలే విద్యుత్ సాలంటడు. కడుపులో సంగతి బయటికి చెప్పిండు. ఆయన అన్నమాట వీడియోలు కూడా ఉన్నయ్. దేశంలో ఎవ్వరివ్వని 24 గంటల కరెంటు తెలంగాణ ఎలా ఇస్తున్నది? దానికొక నిబద్ధత కలిగిన పాలసీ ఉంది. నిధుల కూర్పు ఉంది. నిరంతర మానిటరింగ్ ఉంది. నా ఐపాడ్లో ఎన్ని సైకిల్స్ మీద విద్యుత్ పోతున్నది? 50 సైకిల్స్ పోతున్నదా? లేదా? అనేది నేనే స్వయంగా చూస్తా. పోకపోతే వాకబు చేస్తా. గ్రిడ్ కొలాప్స్ కాకుండా చూసుకుంటాం. అంత మానిటర్ చేస్తేనే 24 గంటల కరెంటు అన్ని సెక్టార్లకు ఇస్తున్నాం. వీళ్లు గెలిచేది లేదు కానీ.. గెలిస్తే మాత్రం ఎన్ని గంటల కరెంటు ఇస్తామో చెప్పేశారు. మీరు మాకు ఓటేస్తే.. గొడ్డలి భుజం మీదనే ఉంది జాగ్రత్త బిడ్డా అని చెప్పిర్రు’ అన్నారు.
‘నూటికి నూరు శాతం గత ఎన్నికలకంటే ఈ సారి 7-8 సీట్లు ఎక్కువగానే గెలుస్తాం. అందులో ఎవ్వరికీ అనుమానం అక్కర్లేదు. మేము అవలంబించే విధానం అలాంటిది. పరిపాలకులకు నీతి నిజాయితీగా ఉంటే భగవంతుడు, ప్రకృతి కూడా కరుణిస్తుంది. పదేండ్ల నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. పదేండ్ల నుంచి మంచి కాలం అవుతున్నది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.