CM KCR | జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిపై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జీవన్రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జీవన్రెడ్డి ఇక్కడ నిలబడ్డడు. ఆయనతోని ఏం అవుతుంది? ఆయన చేస్తడు? స్టేట్ పాలసీ అంటడు.. ఇంట్ల పంటడు. ఏమన్న చేస్తడా? రేపు కరెంటు బంద్ అయితే తెస్తడా? వీఆర్వోలు వచ్చి భూములు ఆగమైతే ఏమన్నా చేస్తడా? రేపు ఎవడో ముఖ్యమంత్రి అయితే వాడు చేస్తడు.. ఈయన ఏం చేయాలే.. భజన చేయాలి. అంతకుమించి ఏమన్న ఉంటదా? అందుకే నేను చెప్పేది. గడబిడ అయిపోయి ఆగమై ఓట్లు వేయొద్దు. ఓటు వేస్తే మన తలరాతను కూడా మారుస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి’ అంటూ హెచ్చరించారు.
‘రైతులకు కాంగ్రెస్ ఒక అశనీపాతం. తెలంగాణ ప్రజలకు శని. రైతాంగానికైతే మరీ దరిద్రం. ధరణి, కరెంటుపై దుర్మార్గం ఆలోచనలన్నీ. ఇవన్నీ మేం భరిస్తామంటే మీ ఖర్మ నేనేం చేయలేను. దయచేసి ఆలోచించకుండా ఓటు వేస్తే లేని ప్రమాదం కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అనవసరంగా. పదేళ్ల నుంచి నేను చేసిన కష్టం బూడిదలో పోసి పన్నీరు అవుతుంది. ఆగమాగం అవుతది. ఎల్లమ్మగూడపెట్టుకొస్తే మల్లమ్మ మాయం చేసినట్లు అవుతుంది. ఇబ్బందులపాలవుతాం. జాగ్రత్తగా ఆలోచించాలని కోరుతున్నా. ఇవన్నీ కూడా ఆషామాషీ వ్యవహారాలు కాదు. ఎలక్షన్లు ఎప్పుడూ వచ్చినా.. సందర్భం ఏదైనా.. క్యాండిడేట్లనే కాదు.. పార్టీలను కూడా చూడాలి. ఆ పార్టీల పాలసీలను కూడా తప్పకుండా చూడాలి, విచారించాలి. ఆ పార్టీల వైఖరి, పాలసీలపై ఓట్లు పడాలి. అది మంచి ప్రజాస్వామ్యం. మన ఇబ్బందులు మనమే కొని తెచ్చుకోవద్దు కదా? మన వేలుతో మన కన్నునే పొడుచుకోవద్దు కదా? బంగారు కత్తి అని మెడకోసుకుంటమా? అట్ల ఉండద్దు కదా? అందుకోసమే జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నా’నన్నారు.
‘జగిత్యాల జిల్లా అయితదని అనుకున్నమా? మెడికల్ కాలేజీ వచ్చింది. పట్టణం అభివృద్ధి చెందుతున్నది. రూ.75కోట్లతో అభివృద్ధి చేసుకున్నాం. అండర్ డ్రైనేజీ కావాలని సంజయ్ కోరుతున్నడు. ఇంకా అభివృద్ధి చెందుతుంది. జగిత్యాల ఇంచుమించు కరీంనగర్ అంత పట్టణమైతది కొద్దిరోజుల్లోనే. దీనికి అంత కళ, పెరుగుదల ఉన్నది. ఇవన్నీ చేసుకుంటూ పోవాలంటే.. ఏవిధంగా చేయాలి. మీకు అనుకూలంగా ఉన్న మంచి ఎమ్మెల్యే ఉంటే.. అభివృద్ధి కాముకులు ఉంటే మంచిగుట్టది. కాంగ్రెస్ నాయకత్వంలో ఈ వరద కాలువకు నాలుగు తూములు పెట్టించి చెరువులు నింపారా? ఇవాళ బాజాప్తా పెట్టుకోలేదా? మనం. పెట్టుకున్నాం చెరువులు నింపుకుంటున్నం. ఇవాళ రోళ్లవాగు ప్రాజెక్టు చేసుకున్నాం. బీర్పూర్ మండలంలో పదివేల ఎకరాలు పారుతుంది. కొంత ధర్మపురికి పారుతుంది. కొంత మనకు పారుతుంది. ఇవన్నీ మీ కండ్ల ముందు కాలేదా? మీరు చూస్తలేరా? మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు కాలేదు? కాంగ్రెసోళ్లకు ఈ మందం చేతకాలేదు. అధికారం లేకనా? అధికారం ఇవ్వనే ఇస్తిమి. ఇంకే కావాలి. చేయలేదు. వాళ్ల వైఖరి చేయడం కాదు.. డంబాచారం చెప్పుడు.. గప్పాలు కొట్టుడు’ అంటూ విమర్శించారు.
‘అందులో ఇప్పుడు 12 మంది ముఖ్యమంత్రులు ఉన్నరు. ఎవడు ముఖ్యమంత్రి అయితడో వాని అయ్యకు తెల్వది. వాడు గెలిచేది నా సచ్చేది లేదు. మనమే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తున్నాం. అందులో అనుమానం లేదు. వీళ్లు ఎవరూ ఏం చేయలేరు. వీళ్లది వట్టి ముచ్చటే. గాలి లేదు గత్తర లేదు. ఉన్నకాడికి బీఆర్ఎస్దే గాలి ఉన్నది. ఇవాళ నేను మాట్లాడేది 86వ సభ. రేపు, ఎల్లుడి నా ప్రచారం కంప్లీట్ అవుతుంది. ఏనుగెల్లింది.. తోచ చిక్కింది. ఇవాళ జగిత్యాలలో చెబుతున్నా. మళ్లీ వచ్చిననాడు యాది చేస్తా. వందశాతం భయంకరమైన మెజారిటీతో బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచి చేసేది ఏం లేదు. ఏమున్నా కేసీఆర్ నాలుగు తిట్లు తిట్టడానికి పనికి వస్తరు తప్పా.. ఇక్కడ ప్రజలకు పని చేసేందుకు పనికిరారు. ఇవాళ పల్లెల్లో పల్లె దవాఖానాలు.. పట్టణాల్లో బస్తీ దవాఖానాలు.. హైదరాబాద్లో బ్రహ్మాండమైన కార్పొరేట్ దవాఖానలు ఇవన్నీ మీ కండ్ల ముందటే ఉన్నయ్’ అన్నారు.