CM KCR | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకనాడు తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప పంటకు సాగునీరు లభించలేదని.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులతో రాష్ట్రం అలరారుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సచివాలయం ప్రాంగణంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఈ పదేండ్లలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను ఆవిష్కరించారు.
గతంలో తెలంగాణ పొలాలకు ఏనాడూ సాగునీరు లభించలేదు. తలాపున పారుతుంది గోదారి.. మన చేను మన చెలక ఎడారి అని దీనంగా పాడుకొన్న పాటల సాక్షిగా.. తెలంగాణ పొలాల దాహార్తిని తీర్చితీరాలనే పట్టుదల ఉద్యమకాలం నుంచే నా మనసును ఆవహించింది. సాగునీటి రంగంలో సాధించవలసిన లక్ష్యాలను ఆనాడే స్పష్టంగా నిర్దేశించుకున్నాం. అధికారం చేపట్టిన వెంటనే ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడం, నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ వంటి పాత ప్రాజెక్టులను ఆధునీకరించడం, ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించని ప్రాజెక్టు పనులు తక్షణం చేపట్టడం, అందుబాటులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించుకొని పంటల దిగుబడి పెంచడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగినం. తెలంగాణ ఏర్పడిన తొలిదశలోనే ప్రభుత్వం అనుసరించబోయే సాగునీటి విధానంపై రాష్ట్ర శాసనసభలో నేనే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన. ఈ విధానం ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు 75 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి ఏర్పడింది. రెండుమూడేండ్లలో మరో 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణంతో సుజల, సుఫల, సస్యశ్యామల రాష్ట్రంగా తెలంగాణ విరాజిల్లుతున్నది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల, తదితర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయడం ద్వారా 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అభివృద్ధి చేశాం. దీంతో వలసల జిల్లాగా పేరుబడ్డ ఉమ్మడి పాలమూరు నేడు పంట కాలువలతో పచ్చని చేలతో కళకళలాడుతున్నది. అద్భుతమైన ఈ మార్పునకు అద్దంపడుతూ ‘వలసలతో వలవల విలపించు కరువు జిల్లా, పెండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసి, చెరువులన్నీ నింపి, పన్నీటి జలకమాడి, పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది’ అని నేనే స్వయంగా పాట రాసిన. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80 శాతం పైగా పూర్తయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకొన్నాయి. ఈ ప్రాజెక్టును పూర్తిచేసి పొలాలకు సాగునీరు అందించబోతున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలతో భూమికి బరువయ్యేంతలా పంటలు పండుతున్నాయి. రాష్ట్రంలో 2013-14 లో కోటి ఎకరాల్లో పంటలు సాగయితే, ప్రస్తుతం 2022-23 నాటికి సాగు విస్తీర్ణం 2.20 కోట్ల ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో ఒకప్పుడు 15వ స్థానంలో ఉన్న తెలంగాణ.. నేడు మొదటి స్థానానికి పోటీ పడుతున్నది. 2014-15లో వరి పంటను 34.97 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేయగా, 2022-23 నాటికి 1.21 కోట్ల ఎకరాలకు పెరిగింది. గడిచిన ఎనిమిదేండ్లలో వరి సాగు విస్తీర్ణం 247 శాతం పెరిగింది. 2014-15లో పత్తి పంటను 41.83 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, 2022-23లో 50 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. 2014-15లో రాష్ట్రంలో వచ్చిన వరి ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నులు. 2022-23లో దాదాపు 3 కోట్ల టన్నులకు పైబడిన దిగుబడి వచ్చింది. ఏడువేల ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ప్రభుత్వమే రైతు ముంగిటికి వెళ్లి మద్దతు ధరతో ధాన్యం సేకరిస్తున్నది. ఇప్పటివరకు రూ.1.21 లక్షల కోట్ల విలువైన 6.76 కోట్ల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేంద్రం నిరాకరించినా, తెలంగాణ ప్రభుత్వమే పండిన పంటనంతా మద్దతు ధరతో కొంటూ రైతుల్లో భరోసా నింపుతున్నది. ఆయిల్పామ్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఆ పంట సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నాం. దశాబ్దకాలం ముంగిట నిలిచి చూస్తే నేడు తెలంగాణ సేద్యం సిరులు కురిపిస్తున్నది. తెలంగాణ రైతు రాజ్యమై విలసిల్లుతున్నది అని సీఎం తెలిపారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతుబిడ్డది తీరని దుఃఖం. సాగునీరు ఒక్కటే అందిస్తే సరిపోదని, రైతుకు పెట్టుబడి సాయం కూడా అందించినప్పుడే సాగు సుసాధ్యమవుతుందని ఆలోచించాను. రైతు సంక్షేమం దిశగా ఎవరూ కలలో కూడా ఊహించని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేసింది. రైతుల పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు దేశంలో రైతుబంధు పథకాన్ని అమలు చేశాం. ఐదేండ్లలో ఏటా 65 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.65 వేల కోట్లు జమచేయడం ఎవరూ ఊహించని చరిత్ర. ఈ పథకం వ్యవసాయం దిశను, రైతు దశను మార్చివేసింది. రైతుబంధు పథకం కేంద్ర పాలకుల కండ్లను సైతం తెరిపించింది. వాళ్లు కూడా మన రైతుబంధు పథకాన్ని అనుసరించక తప్పలేదు. ఈ పథకం దేశ వ్యవసాయ రంగంలో సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. ఏ కారణంచేతనైనా రైతు మరణిస్తే, ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతుబీమా పథకం ప్రవేశపెట్టినం.
ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానకు కొన్ని జిల్లాల్లో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించిన. రైతుల భుజం తట్టి ధైర్యం చెప్పిన. ఈ సందర్భంగా కొంతమంది రైతులు.. ‘ఒక పంట పోయినా పర్వాలేదు. ధైర్యంగా ఎదుర్కొంటాం. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలతో మరోపంట పండించుకుంటాం’ అని ధీమా వ్యక్తం చేయటం నాకు గొప్ప సంతోషాన్నిచ్చింది. దశాబ్దకాలంలో ప్రభుత్వం రైతుల్లో కల్పించిన ఆత్మ నిబ్బరానికి వారి మాటలు నిదర్శనంగా నిలిచాయి. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించి ఆపత్కాలంలో ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది.
రాష్ట్రంలో కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం త్వరలోనే సాకారం కానున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలో ఓ అపూర్వ ఘట్టం. కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరిని 250 కిలోమీటర్ల మేర సతత జీవధారగా మార్చింది. దాదాపు 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును అభివృద్ధిలోకి తీసుకొచ్చింది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇప్పుడు 20కి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది.