హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): బీజేపీకి పాలన చేతకాదని తేలిపోయిందని, కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడం ఖాయమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో మోదీ సర్కారు దేశంలోని ఏ వర్గానికీ.. ఏ మంచీ చేయలేకపోయిందని విమర్శించారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశాన్ని పరిపాలించడం బీజేపీ వల్ల కాదని స్పష్టమైందని పేర్కొన్నారు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం మారాలి.. వేరే ప్రభుత్వం రావాలి అని స్పష్టంచేశారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని గ్యారంటీగా మారుస్తామని తేల్చిచెప్పారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..ఎనిమిదేండ్లలో సాధించిందేంటి?
8 సంవత్సరాల మీ పాలనలో చేసిన గొప్పపని ఏంది? వ్యవసాయరంగంలోనా? విద్యుత్తు రంగంలోనా? సాగనీటి రంగంలోనా? ఏం రంగంలో చేశారు? ఎక్కడా చేయలేదు.. సిగ్గుచేటు. కేంద్రానిది బ్యాడ్, వరస్ట్ పవర్ పాలసీ. దేశానికి కరెంట్ ఇవ్వడం మీకు చేతకాదు. సాగునీళ్లు ఇవ్వడం అసలే చేతకాదు. చివరికి మంచినీళ్లు ఇచ్చే తెలివితేటలు కూడా మీ ప్రభుత్వానికి లేవు. దేశానికి పరిపాలన కేంద్రమైన దేశ రాజధాని ఢిల్లీలోనే మంచినీళ్లు లేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నది. ఇదీ మీ గొప్ప పరిపాలనకు నిదర్శనం! దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి. అవి ఇవ్వడం కూడా చేతకాదా? లొడలొడ మాట్లాడగానే మీది గొప్ప పరిపాలన అయితదా? ఇక్కడేమైన పిచ్చోళ్లు ఉన్నరా? హైదరాబాద్కు వచ్చి అబద్ధ్దాలు చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో కనీసం 20 శాతమైనా మీ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జరుగుతున్నదా? కేంద్రంతో పోల్చితే రెండింతల ప్రగతితో దూసుకెళ్తున్న రాష్ట్రం తెలంగాణ. అలాంటి రాష్ర్టానికి వచ్చి.. ఇక్కడి ప్రభుత్వాన్ని తిట్టి పోతరా?
ఏటా 1.30 కోట్ల ఉద్యోగాలు గాయబ్..
దేశంలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం గరిష్ఠస్థాయికి పెరిగిపోయింది. ఇది వాస్తవం కాదా? దేశంలో నిరుద్యోగిత రేటు 8.3 శాతం ఉన్నది. యువత సంవత్సరానికి 1.30 కోట్ల ఉద్యోగాలు కోల్పోతున్నారు. మీ తెలివితక్కువ విధానాలతో, మీ అసమర్థతతో దేశాన్ని నాశనం పట్టించారు. ద్రవ్యోల్బణం పెరుగుదలను ఆపలేరు.. ధరల పెరుగుదలను ఆపడం చేతకాదు.. రూపాయి పతనాన్ని అపడం చేతకాదు.. పెరుగుతున్న నిరుద్యోగాన్ని ఆపడం చేతకాదు.. మరి మీకు ఏం చేతనైతది? లొడలొడ లొల్లి పెట్టడం ఒక్కటి చేతనైతదా?
నెత్తిమాసినోళ్లు 10 మంది పోతే పోతరు. దానికి భయపడుతమా? గాచారం బాగలేనోడు పోతే పోతడు.. ఏం ఫరక్ పడుతది? నేనే టీఆర్ఎస్కు ఫౌండర్ను. స్క్రాప్ నుంచి ఈ స్థాయి వరకు పార్టీని నిర్మించా. అలాంటి నేను భయపడతనా? అదో సెన్షేషనా? వాడు పోతే వాడిని మించినోడు వచ్చి పోటీ చేసి గెలుస్తడు. ఇలాంటి వాటితో కేసీఆర్ను భయపెట్టిస్తారా? నేను మళ్లీ ప్రజల్లోకి వెళ్తా. నాతో ప్రజలు లేకపోతే కదా భయపడాలి! ఎవరికీ మేం తక్కువ చెయ్యలేదు. రాష్ట్ర చరిత్రలో లేని విధంగా అన్ని కులాలకు హైదరాబాద్లో వేల కోట్ల విలువ చేసే భూములిచ్చి ఆత్మగౌరవ భవనాలు కట్టించిన మొగోడు ఎవడన్నా ఉన్నాడా? ఇంత కన్నా సక్కగా చేసేటోడు వస్తాడా? ప్రజలేమైనా పిచ్చోళ్లు అనుకుంటున్నారా? జేబులో ఉన్న పైసలు రోడ్డుమీద పడేస్తరు. సచ్చినా ప్రజలు టీఆర్ఎస్ను వదులుకోరు.బీజేపీని ఇప్పటికిప్పుడు పడగొట్టే ఆలోచన నాకు కూడా లేదు. ఇంకా వాళ్ల అహంకారం పెరగాలి.. ఇంకా తప్పులు చెయ్యాలి.. గ్యారంటీగా చేస్తరు. అహంకారం బాగా పెరిగింది. హైకోర్టు జడ్జీలను టార్గెట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జీలను కూడా లక్ష్మణరేఖ దాటారంటూ మాట్లాడుతున్నారు. ఏక్నాథ్షిండేలను సృష్టిస్తామంటున్నరు. త్వరలోనే ఎన్నికలున్నాయి. ఇయ్యాల్టికి ఇయ్యాల కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఏం పడగొట్టం.. ఆ అవసరం కూడా లేదు. ఆ దిక్కుమాలిన పంథా కూడా మంచిది కాదు. ప్రభుత్వాలను ప్రజలు కూలగొట్టాలి.. వీళ్లెవరు కూలగొట్టేందుకు?