హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: ఢిల్లీ సింహాసనాన్ని ఎదిరించి సుస్థిర పాలన అందించిన బహుజన సింహం సర్దార్ సర్వాయి పాపన్న యావత్ తెలంగాణ జాతికే గర్వకారణమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. పాపన్న స్ఫూర్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తున్నారని చెప్పారు. సర్వాయి పాపన్న 372వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం రవీంద్రభారతిలో బుధవారం అధికారికంగా వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. సాహసమే ఊపిరిగా, ధైర్యమే ఆయుధంగా బహుజనులను చైతన్యం చేసి ఏకం చేసిన మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కొనియాడారు. పెద్దలను కొట్టి పేదలకు పంచిన మహామనిషి అని అభివర్ణించారు.
సర్దార్ను ఏ ఒక కులానికో పరిమి తం చేయవద్దని, యావత్ తెలంగాణ ఆస్తి అని పేర్కొన్నారు. పాపన్న స్ఫూర్తితో నేడు సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున వేల కోట్ల విలువైన 82.3 ఎకరాలను కోకాపేట్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ఇవ్వడమే కాక, ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు రూ.95 కోట్లు సైతం కేటాయించారని గుర్తుచేశారు. గౌడ కులస్థులు సైతం ఏక సంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించుకోవాలని సూచించారు. పాపన్నకు కరీంనగర్ జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉన్నదని, వీరోచిత పోరాటంతో హుస్నాబాద్లో విజయ స్వర్గాన్ని పొందారని, ఆ స్ఫూర్తి తో కరీంనగర్లో అద్భుతమైన విగ్రహాన్ని ఆవిషరించుకుంటున్నామని తెలిపారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల చరిత్రను గత ప్రభుత్వాలు చెరిపేశాయని, స్వరాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ కృషితో పాపన్న చరిత్రను భావితరాలకు అందజేస్తూ అధికారికంగా జయంతి కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని చెప్పారు. 2014లో కేసీఆర్ సీఎం అయ్యాకే బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి సాధ్యమవుతున్నదని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా వేడుకలు
పాపన్న జయంతి వేడుకలను రవీంద్రభారతితోపాటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించింది. వేడుకల నిర్వహణకు ప్రభు త్వం రూ.10 లక్షలు కేటాయించగా, అన్ని జిల్లాల్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, నల్లగొండలో మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల, బీసీ సం ఘాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గౌడల అభివృద్ధికి పెద్దపీట
బహుజనుల సంపూర్ణ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రి శ్రీనివాస్గౌడ్ అభివర్ణించారు. 33 కోటలను జయించి గోలొండ కోటతోపాటు మొఘలాయిలు ఆక్రమించిన కాకతీయుల కోటను సైతం జయించారని వివరించారు. 56 బీసీ కులాలను ఏకం చేసి 33 కులాలకు నాడే రాజ్యాధికారం అందించారని గుర్తుచేశారు. రాజులు ప్రజలను దోచుకుంటే వాళ్లను దోచి పేదలకు పంచిన గొప్ప వీరుడని తెలిపారు. సీఎం కేసీఆర్.. పాపన్న జయంతి ఉత్సవాలు నిర్వహిద్దామని అడిగిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారని చెప్తూ ఇందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ గౌడల కోసం మోపెడ్లు, వైన్స్ల్లో 15 శాతం రిజర్వేషన్లు, పన్ను రాయితీలను అందిస్తూ, అభివృద్ధిలో పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్గౌడ్, ఉపేంద్ర, గౌడ్ సంఘం నేతలు పల్లె లక్ష్మణ్రావుగౌడ్, అంబాల నారాయణగౌడ్, రాష్ట్ర బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్గౌడ్, విక్రంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.