హైదరాబాద్ : వరంగల్లో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ వరంగల్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఆదివారం ఉదయం వరంగల్ నుంచి భద్రాచలం వరకు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. భద్రాచలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి వరద ముంపు వల్ల సంభవించిన నష్టం.. చేపడుతున్న వరద సహాయక చర్యలపై మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించి.. దిశానిర్దేశం చేయనున్నారు.
అక్కడి నుంచి ఏటూరునాగారం ప్రాంతంలోనూ ఏరియల్ సర్వే నిర్వహించి, వరద సహాయక చర్యలపై సమీక్షించనున్నారు. సోమవారం ఉత్తర తెలంగాణలోని ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం, తదితర వరదబాధిత ప్రాంతాల్లోనూ సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో భాగంగా సీఎం కేసీఆర్ వరద బాధితులను పరామర్శించి, వారికి భరోసా ఇవ్వనున్నారు.