గుక్కెడు నీరు చూడకపోతమా అని! దోసెడు నీళ్లు పొలాలకు పారిస్తమా అని! తలాపున కృష్ణమ్మ గలగలా పారుతున్నా పాలమూరు నేల తల్లి గొడగొడా ఏడ్చింది వలస పాలకులు నిండా మోసం చేశారు. ఏ పాలకుడూ రాలే.. ఏ ప్రాజెక్టూ తేలే.. దత్తత.. ఉత్త మాటగానే మిగిలిపాయె!
70 ఏండ్లలో ఉమ్మడి సర్కార్లకు సాధ్యం కానిదాన్ని పదేండ్లలోనే సాకారం చేశారు కేసీఆర్.
ఫలితం.. కృష్ణమ్మ ఎదురెక్కి రానున్నది,పాలమూరు బీళ్లను పావనం చేయనున్నది! ఫలితం.. 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు,1,226 గ్రామాలకు తాగు నీరు అందనున్నది!
కృష్ణయ్య పుట్టినరోజున.. కృష్ణాష్టమి పర్వదినాన.. కృష్ణమ్మ ఎత్తిపోతపై సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు రాయబోయే నవ చరిత్రపై గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 16న ఎత్తిపోతల పథకం వెట్ రన్ ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. నార్లాపూర్ ఇన్టేక్ వద్ద మోటర్లను ఆన్ చేసి మహా బాహుబలి పంప్ ద్వారా కృష్ణా జలాలను అంజనగిరి రిజర్వాయర్లోకి ఎత్తిపోయనున్నారు.
దశాబ్దాల కల సాకారమవుతున్న చారిత్రక సందర్భంలో దక్షిణ తెలంగాణ రైతాంగానికి, ప్రజలకు 16వ తేదీ గొప్ప పండుగ రోజు. ఉమ్మడి పాలమూరు – రంగారెడ్డి జిల్లాల్లోని పల్లెపల్లెనా ఊరేగింపులతో ఈ విజయాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలి. పథకం ప్రారంభోత్సవానికి ప్రతి పల్లె నుంచి ప్రజలు కలశాలతో తరలివచ్చి, కృష్ణా జలాలను తీసుకెళ్లి గ్రామాల్లో దైవాల పాదాలను అభిషేకించి మొకులు చెల్లించుకోవాలని కోరుతున్నా.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయింది. ఇరిగేషన్ శాఖ అధికారులు సవాలుగా స్వీకరించి ఈ పథకాన్ని పూర్తిచేసేందుకు కంకణం కట్టుకొన్నారు. ఆఖరుకు ధర్మమే గెలిచింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావడంతోపాటు పలు అడ్డంకులు తొలగిపోయాయి. ప్రజల తాగు, సాగునీటి కష్టాలు తొలగిపోయిన శుభ సందర్భం కన్నా మనకు మరో గొప్ప వేడుక ఉండదు.
-ముఖ్యమంత్రి కేసీఆర్
PRLIS | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 16వ తేదీన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఆ రోజు నార్లాపూర్ ఇన్టేక్ వద్ద మోటర్లను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించనున్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన బాహుబలి మోటర్ల ద్వారా కృష్ణా జలాలను అంజనగిరి రిజర్వాయర్లోకి ఎత్తిపోయనున్నారు. ప్రపంచంలో ఎకడా లేనివిధంగా అత్యంత భారీ పంపులతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు దక్షిణ తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చనున్నదని సీఎం తెలిపారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వరాష్ట్రంలో మోక్షం లభించడం చారిత్రక సందర్భమని సంతోషం వ్యక్తంచేశారు. దక్షిణ తెలంగాణ రైతాంగానికి ఇది పండుగ రోజు అని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో పల్లె పల్లెనా ఊరేగింపులతో ఈ విజయోత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పథకం ప్రారంభోత్సవానికి పల్లెల నుంచి ప్రజలు కలశాలతో తరలివచ్చి కృష్ణా జలాలను తీసుకెళ్లి గ్రామాల్లో దైవాల పాదాలను అభిషేకించి మొకులు చెల్లించుకోవాలని కోరారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సచివాలయంలో సీఎం కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. బాహుబలి పంపుల వివరాలను ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. ప్రపంచంలో ఎకడా వినియోగించనివిధంగా 145 మెగావాట్ల సింగిల్ పంపులను ఈ ఎత్తిపోతల కోసం వినియోగిస్తున్నామని తెలిపారు. పంపులను బిగించే బోల్టు బరువే 12 కిలోలు ఉంటుందని, రూటర్ బరువు 80 టన్నులు ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో ఇంకా ఎన్నో వింతలు విశేషాలు ఆశ్చర్యంగొలిపే అంశాలు నమ్మశక్యంగాని సాంకేతిక అంశాలున్నాయని పేర్కొన్నారు. బాహుబలి వంటి భారీ పంపులను బిగిస్తున్నప్పుడు చూడడానికే భయం గొలిపే పరిస్థితులుంటాయని, తాను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంగా స్వయంగా చూశానని అన్నారు. అదేవిధంగా విద్యుత్తు ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావు, తాగునీరు తరలింపుకోసం చేపట్టాల్సిన చర్యల కోసం మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి తదితర అధికారులతో సీఎం సమీక్షించారు.
తలాపున కృష్ణమ్మ పారుతున్నా ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్దాలపాటు ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు బాధలు అనుభవించాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులను మొదలు పెట్టినట్టే పెట్టి, ఆదిలోనే ఆపేసి పెండింగులో పెట్టారని విమర్శించారు. ఒకనాడు సుసంపన్నంగా వర్ధిల్లుతూ ఎంతో చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని సొంతం చేసుకున్న పాలమూరును గంజి కేంద్రాలు నడిపించిన దుస్థితికి నాటి ఉమ్మడి పాలకులు దిగజార్చారని మండిపడ్డారు. పాలమూరు అంటే దేశంలోనే వలస లేబర్కు పేరుగాంచిందని, పాలమూరు నిండా బొంబాయి బస్సులు క్యూలు కట్టేవని గుర్తుచేశారు. నాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా నీరు లేక కరువు తాండవమాడేదని, కనీసం తాగునీరు కూడా కల్పించలేదని దుయ్యబట్టారు. పాలమూరు జిల్లా ప్రజల బాధలను నాటి ఉద్యమ కాలంలో గోరటి వెంకన్న వంటి కవులు ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా’, చేతానమేడుందిరా.. తెలంగాణ చేలన్ని బీళ్లాయెరా’.. అంటూ పాటలు రాసిన సందర్భాన్ని సీఎం గుర్తు చేశారు.
అరవై ఎకరాలున్న ఆసామి కూడా అడవులు పట్టుకొని కూలీకి పోయిన దుస్థితిని తాను స్వయంగా చూశానని తెలిపారు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని అద్భుతమైన పంటలు పండే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు పసిడి పంటలతో నాడు సిరులు కురిపించాల్సి ఉన్నా సాగునీరు లేక కరువు పాలయిందని ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే స్వరాష్ట్రం ఏర్పడిన వెంటనే తొలుత పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పారు. ఉమ్మడి పాలకులు మొదలు పెట్టి వదిలేసిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశామని, ఫలితంగా పాలమూరు జిల్లా పచ్చబడటం ప్రారంభమైందని, వలసలు ఆగిపోయి బయటి రాష్ట్రాల నుంచే పాలమూరుకు ఉల్టా వలసలు ప్రారంభమయ్యాయని సంతోషం వ్యక్తంచేశారు. చిన్నచిన్న పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేసుకొంటేనే ఇంతగొప్పగా ఉంటే, దక్షిణ తెలంగాణ దశ దిశను మార్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకొంటే ఇంకెంత గొప్పగా తెలంగాణలో అభివృద్ధి అవుతుందో ఊహించుకోవచ్చని అన్నారు. ఈ ఎత్తిపోతలకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయని, స్వయానా పాలమూరు జిల్లా రాజకీయ నాయకులే వందల కేసులు పెట్టడం నిజంగా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి నేతలు పాలమూరు జిల్లా ప్రజలకు శాపంలా పరిణమించారని విమర్శించారు.
ఉద్యమ కాలంలో కృష్ణా నదిలో బాచుపల్లి వంటి ప్రదేశాల్లో నాణేలు వేసి నీటికోసం మొక్కిన అనేక మొకులు ఫలితమే ఈ విజయమని సీఎం అభివర్ణించారు. అందువల్ల మనందరం దేవుళ్లకు మొక్కులు చెల్లించుకోవాల్సి ఉన్నదని తెలిపారు. కృష్ణా జలాలతో దేవుళ్ల పాదాలు కడుగుతామని చెప్పారు. రెండు ఉమ్మడి జిల్లాల నుంచి వస్తున్న సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు కలశాలు తెచ్చుకొని కృష్ణా జలాలను తీసుకెళ్లి దేవుళ్లకు అభిషేకాలు చేయాలని, పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించి సంబురాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయాలని ఇంజినీర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సూచించారు. ఇప్పటికే నిర్మితమైన రిజర్వాయర్ల నుంచి నీళ్లను తరలించే కాల్వల నిర్మాణం పనులకోసం టెండర్లు పిలవాలని ఆదేశించారు. భూ సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చి గత పద్ధతులనే అనుసరించాలని కోరారు. అచ్చంపేట ఉమామహేశ్వరం పనులు ప్రారంభించాలని, అదే సందర్భంలో రంగారెడ్డి జిల్లా పరిథిలో చేపట్టాల్సిన కాల్వల నిర్మాణ పనులకు సంబంధించి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో మంత్రులు ఇరిగేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ ఎత్తిపోతల రాడార్లోకి వచ్చే చెరువులను అనుసంధానించే కాల్వల పనులను చేపట్టాలని సూచించారు. ఉత్తర తెలంగాణలో నిర్మించిన చెక్ డ్యాములు అద్భుత ఫలితాలిస్తున్నాయని చెప్పారు. ఒక తెలంగాణలో మాత్రమే భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న చర్యలే కారణమని పేర్కొన్నారు. అదేవిధానాన్ని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలోనూ అనుసరించాలని సూచించారు. ఇన్నాళ్లు మహారాష్ట్ర ఎగువ నుంచి నీళ్లు వస్తేనే కృష్ణా, గోదావరి నదుల్లో వరద వచ్చేదని, ఇప్పుడు తెలంగాణలో చేపట్టిన హరితహారంతో పరిస్థితులు మారాయని తెలిపారు. రాష్ట్రం పరిధిలోని నదీ పరీవాహక ప్రాంతాల్లోనే వర్షాలు కురిసి నదుల్లో ప్రవాహం పెరుగుతున్నదని సీఎం వివరించారు.
పర్యావరణ అనుమతులతోపాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను యుద్ధప్రాతిపదికన సంపూర్ణంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ చిత్తంతో ఉన్నదని సీఎం పునరుద్ఘాటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణకు తాగు, సాగునీరు పుష్కలంగా లభించి తెలంగాణ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని అన్నారు. సమ్మిళిత, సమగ్ర వ్యవసాయాభివద్ధి సాధించి, తెలంగాణ రైతన్నల లోగిళ్లు బంగారు పంటలతో తులతూగి బంగారు తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని పేర్కొన్నారు. మంచి హృదయంతో పనిచేస్తే ప్రకృతి కూడా కరుణిస్తదని, దేవుడు కూడా దయచూపిస్తాడనేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విజయమే నిదర్శనమని సీఎం వివరించారు. సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, సత్యవతిరాథోడ్, ఎంపీలు రంజిత్రెడ్డి, పోతుగంటి రాములు, మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, సిరికొండ మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, కసిరెడ్డి నారాయణరెడ్డి, దయానంద్ గుప్తా, ఎగ్గె మల్లేశం, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైపాల్ యాదవ్, అబ్రహం, అంజయ్య యాదవ్, మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్రెడ్డి, నన్నపనేని నరేందర్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, ప్రకాశ్గౌడ్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, రాజేందర్రెడ్డి, మర్రి జనార్ధన్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, కొప్పుల మహేశ్రెడ్డి, చిట్టెం రాంమోహన్రెడ్డి, గువ్వల బాలరాజు, కాలె యాదయ్య, జీవన్రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఆంజనేయగౌడ్, ఇంతియాజ్ ఇషాక్, రమావత్ వల్యానాయక్, సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే డ్రైరన్ ట్రయల్స్ను పూర్తి చేసుకొని వెట్న్క్రు సిద్ధంగా ఉన్నామని సమావేశంలో పాల్గొన్న ఇంజినీరింగ్ అధికారులు సీఎంకు తెలిపారు. ఇంజినీర్ల సూచనల మేరకు ఈ నెల 16వ తేదీన ఎత్తిపోతల వెట్న్ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. కృష్ణా నదికి అనుసంధానించి (శ్రీశైలం ఫోర్ ప్లో వద్ద) నార్లాపూర్ వద్ద నిర్మించిన ఇన్టేక్ వద్దకు చేరుకొని అకడ స్విచ్ ఆన్చేసి పంపులను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించనున్నారు. వెట్న్ ద్వారా ఎగిసిపడే కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్కు చేరుకోనున్నాయి. మోటర్లు ఆన్చేసిన వెంటనే సీఎం కేసీఆర్ నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకొని కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లె నుంచి సర్పంచులు, గ్రామస్తులు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం చేపట్టాల్సిన రవాణా, భోజన వసతులను ప్రభుత్వం తరఫున ఏర్పాటుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొకవోని పట్టుదల దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టి ఈ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకుపోయిందని సీఎం కేసీఆర్ వివరించారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సవాలుగా స్వీకరించి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసేందుకు కంకణం కట్టుకొన్నారని ప్రశంసించారు. ఆఖరికి ధర్మమే గెలిచిందని, కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావడంతోపాటు పలు అడ్డంకులు తొలగిపోయాయని సంతోషం వ్యక్తంచేశారు. దక్షిణ తెలంగాణ ప్రజల తాగు, సాగునీటి కష్టాలు తొలగిపోయిన శుభ సందర్భం కన్నా మనకు మరో గొప్ప వేడుక ఉండబోదని సీఎం అన్నారు. అందుకు కృషి చేసిన ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్, ఇరిగేషన్ శాఖ సలహాదారు పెంటారెడ్డి, సీఈలు హమీద్ఖాన్, రమణారెడ్డితోపాటు కీలకమైన విద్యుత్తు వ్యవస్థల నిర్మాణానికి కృషి చేస్తున్న జెనో ట్రాన్స్కో సీఎండీ ప్రభాకర్రావును సీఎం అభినందించారు. అందరి కృషికి దైవ కృప కూడా తోడు కావడం వల్లనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కొలికి వచ్చాయని అన్నారు.