హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. అక్కడ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు, చట్టసభల, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. బీఆర్ఎస్ భవిష్యత్తు కార్యాచరణపై వారితో చర్చించారు. బీఆర్ఎస్ కిసాన్ సమితి అధ్యక్షుడిని కూడా నియమించారు. నిర్మాణంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శాశ్వత భవనాన్ని పరిశీలించారు.
శుక్రవారం మధ్యాహ్నం 1:38 గంటలకు ఢిల్లీలోని సర్దార్పటేల్ మార్గ్లో ఉన్న పార్టీ జాతీయ కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్.. ఎంపీలు, పలు రాష్ర్టాల రైతు సంఘాల నేతలు, ఇతర ప్రముఖులతో వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం కార్యాలయ మొదటి, రెండో అంతస్థుల్లో ఏర్పాటుచేసిన కాన్ఫరెన్స్ హాల్తోపాటు పలువురికి కేటాయించిన చాంబర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. ఆనంతరం తనను కలిసేందుకు అకడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు, అభివాదం చేస్తూ, పలకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా జై భారత్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలు మార్మోగాయి. సీఎం వెంట పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు సంతోష్కుమార్, కొత్త ప్రభాకర్రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, వెంకటేశ్ నేతకాని, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తదితరులు ఉన్నారు.