హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన ముగించుకొని బుధవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకొన్నారు. రాష్ట్రం నుంచి వరి ధాన్యాన్ని సేకరించాలని కేంద్రాన్ని కోరడానికి మంత్రులు, అధికారులతో కలిసి ఆదివారం సీఎం ఢిల్లీ వెల్లిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, అధికారులు మూడురోజులపాటు వివిధశాఖల కేంద్రమంత్రులు, అధికారులను కలిసి ధాన్యం సేకరణపై చర్చించారు. వారికి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేశారు. సోమవారం సీఎస్ సోమేశ్కుమార్ నేతృత్వంలో అధికారుల బృందాన్ని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీశాఖ కార్యదర్శి సుధాన్షుపాండే వద్దకు పంపి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని కోరారు. సుధాన్షుపాండే నుంచి స్పష్టమైన హామీ రాకపోవటంతో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు నిరంజన్రెడ్డి, గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీలు, అధికారుల బృందాన్ని కేంద్ర అహార వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్గోయల్ వద్దకు పంపారు. ఈ వానకాలం, యాసంగి ధాన్యం మొత్తం కేంద్రమే సేకరించాలని గోయల్ను కేటీఆర్ కోరారు. గోయల్ కూడా దీనిపై సరైన సమాధానం ఇవ్వకుండా ఈ నెల 26న మరోసారి సమావేశమవుదామని చెప్పి పంపారు. అనంతరం మంత్రుల బృందం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్తో సమావేశమమైంది.