హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసి, తెలంగాణ భాషామృతాన్ని పంచిన సహజ కవి, సాహితీ తేజోమూర్తి బమ్మెర పోతనామాత్యులు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కీర్తించారు. బమ్మెర పోతన జయంతిని పురసరించుకొని ఆయన సాహితీ సౌరభాన్ని సీఎం స్మరించుకొన్నారు. పోతనామాత్యులు విరచించిన సాహితీశోభ తెలుగు సాహితీ చరిత్రలో అజరామరమై వెలిగిపోతుందని పేర్కొన్నారు. ‘బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్’ అంటూ తన కావ్యాన్ని రాజులకు కాకుండా భగవంతుడైన శ్రీరామునికే అంకితమిచ్చి, కవి ఆత్మగౌరవాన్ని చాటిన తెలంగాణ ప్రజాకవి పోతనామాత్యులు అని సీఎం కేసీఆర్ కొనియాడారు.
భాగవతం ద్వారా రంగరించి, మనకు పోత న అందించిన పద్య గుళికలు, భక్తి మాధుర్యాన్ని, భాషా పాండిత్య రసాన్ని పంచుతాయని ప్రస్తుతించారు. భాగవతం ద్వారా అలతి అలతి పదాలతో శ్రీకృష్ణతత్వాన్ని సామాన్యులకు చేర్చిన పోతన ప్రజాకవి అని సీఎం పేర్కొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన బమ్మెర గ్రామంలోని పోతనామాత్యుని జన్మస్థలంలో వారి జ్ఞాపకార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందని వివరించారు. భవిష్యత్తులో బమ్మెర ప్రాంతాన్ని సాహితీ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఆ మహాకవి స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషకు, కవిత్వానికి, ఆధ్యాత్మిక ధోరణులకు పెద్దపీట వేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.