నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభా వేదిక వద్దకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కేసీఆర్ బంగారిగడ్డకు చేరుకున్నారు. కేసీఆర్ వెంట పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు కూడా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేసిన బీజేపీ దొంగలను ఆ నలుగురు ఎమ్మెల్యేలను పట్టించిన సంగతి తెలిసిందే.
టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు మునుగోడు నియోజకవర్గంలోని అన్నిగ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు.
సీఎం కేసీఆర్ బంగారిగడ్డ సభపై మునుగోడు నియోజవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. మునుగోడు అభివృద్ధిపై కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారన్న దానితోపాటు సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఎలా స్పందిస్తారన్న దానిపైనా ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. మోదీ సర్కారు విధానాలపై పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారన్న చర్చ కూడా జోరుగా సాగుతున్నది.