మెదక్ : జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ మెదక్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి మెదక్ పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్కు దారి పొడవునా జననీరాజనాలు పలికారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలికారు.
కాగా, దివ్యాంగులకు పెంచిన రూ.4016 పింఛన్ సొమ్ము పంపిణీకి బుధవారం సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. బీడీ టేకేదారులు, ప్యాకర్లకు రూ.2,016 చొప్పున ఆసరా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ రెండింటి ప్రారంభంతో మరో చారిత్రక ఘట్టానికి మెదక్ పట్టణం వేదిక కానున్నది.
అలాగే మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మెదక్ సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.