CM KCR | నిర్మల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా నిర్మల్ బయల్దేరారు కేసీఆర్. నిర్మల్ చేరుకున్న సీఎం కేసీఆర్ నేరుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వెళ్లారు. కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ హైదరాబాద్ నుంచి వెళ్లారు.
మరికాసేపట్లో నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు భవనాన్ని, నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం ఎల్లపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లతో కొత్త కలెక్టరేట్ను నిర్మించారు. సుమారు 16 ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ టు విధానంలో దీనిని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ల కార్యాలయాలతోపాటు రెండు వెయిటింగ్ హాళ్లు, రెండు వీడియోకాన్ఫరెన్స్ హాళ్లు, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్ హాల్ను కూడా గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మించారు. మొదటి అంతస్థును మంత్రి చాంబర్తోపాటు వివిధ శాఖల కార్యాలయాలకు కేటాయించారు. కలెక్టరేట్ను పూర్తి ఆక్సిజన్ జోన్గా రూపొందించారు. భవనంలో రెండు లిఫ్టులున్నాయి. ఇక్కడ గ్రానైట్ పనులు పూర్తికావడంతో సువిశాల కారిడార్లు కనువిందు చేస్తున్నాయి. ప్రహరీతోపాటు ముఖద్వార ఆర్చ్, సెక్యూరిటీ గార్డు గది నిర్మాణం పూర్తయింది. అండర్గ్రౌండ్లో 80 వేల లీటర్ల సామర్థ్యంతో సంప్, 20 వేల లీటర్ల సామర్థ్యంతో రెండు ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించారు. కలెక్టరేట్ ముందు ఆవరణలో హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ సముదాయానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్తును అందించేందుకు ప్రత్యేక సబ్స్టేషన్ను ఏర్పాటుచేశారు.