CM KCR | దేశంలో జనాభా గణన ఎందుకు చేపట్టడం లేదని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని నిలదీశారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘మోదీ ప్రభుత్వం ఎందుకు జనాభా గణన చేపట్టడం లేదని ప్రశ్నించారు. దీని వెనుక కారణం ఏంటీ? అని నిలదీశారు. ‘140 సంవత్సరాలుగా ఏ ఒక్కసారిగా జనాభా గణన ఆగలేదు. రెండుసార్లు ప్రపంచ యుద్ధాలు వచ్చినా జనాభా గణన ఆపలేదు. దానికి ఉండే ప్రాధాన్యం దృష్ట్యా జరిగేది గణన ఆపలేదు. గణన జరిగితే ఇండ్లు ఎవరికి ఉన్నాయ్.. దేశం పరిస్థితి, ప్రజల పరిస్థితి తెలుస్తుంది. గణన చేపడితే మా బండారం బయటపడుతుందని జరుపడం లేదు. కుల గణన చేపట్టాలని బీసీ కులాలు అడుగుతున్నయ్.. ఎందుకు లెక్కించడం లేదు. ఎస్సీలు 15శాతం అని చెప్పారు.. అది ఇప్పుడు 16.50శాతం నుంచి 17 శాతాన్ని మించిపోయింది. కొన్ని రాష్ట్రాల్లో 19శాతం దాటిపోయింది. జనాభా గణన లేకుండా ఏ దేశమైనా పరిపాలన చేస్తుందా? ప్రణాళికాబద్ధమైన పరిపాలన జరగాలంటే జనగణన తప్పనిసరి. చీకట్లోకి మోదీ ప్రభుత్వం బాణం కొడుతుంది మోదీ ప్రభుత్వం. మేం చెప్పింది లెక్క, ఏం చెప్పిందే లెక్క అన్నట్లు వ్యవహరిస్తున్నరు. ఇదేనా భారతదేశాన్ని నడిపే పద్ధతి? దీనిపై ప్రజలు ఆలోచించాలి’ పిలుపునిచ్చారు.
‘గోదావరి నీళ్లు లిఫ్ట్ పెట్టి మహారాష్ట్రకు ఇస్తా అన్నవ్.. యుద్ధాలు చేసినం అని మాట్లాడుతున్నరు. ప్రజలను, ప్రజాప్రతినిధులను అందరినీ చీకట్లో పెట్టింది. కాంగ్రెస్, బీజేపీ రెండూ దొందూదొందే. నెహ్రూ ప్రారంభ దశలో కొట్లాడారు. ఆయనలో ఉండే తపనతో వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళిక, దేశానికే దారి దిక్కు, ప్లానింగ్ తీసుకువచ్చారు. ప్లానింగ్ కమిషన్లో గొప్పగొప్పగా ఉండేవారు. ఆ తర్వాత ఆగమైంది ఇండియా అంటే.. నేటికీ కోలుకుంటలేదు. ఇప్పటికీ దేశానికి లక్ష్యం ఏంటీ? ఎటు వైపు ప్రయాణిస్తున్నాం. లక్ష్యం లేని సమాజం, లక్ష్యం లేని దేశం ఎటు వైపు వెళ్తుంది. ఏమైనా చేసి ఎన్నికలు గెలువడమే లక్ష్యం. దేశంలో వర్షాపాతం 1.40లక్షల టీఎంసీలు. 70టీఎంసీలు ఆవిరైతే.. నదుల్లో 70వేల టీఎంసీలు ప్రవహిస్తుంది. ప్రస్తుతం దేశం 20-25 టీఎంసీలు వాడుకుంటోంది. మిగతదంతా సముద్రంలోకి కలుస్తుంది. సట్లెజ్, రావి, బియాస్ నదుల గురించి పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలు తన్నుకుంటున్నయ్. మహానది నీళ్ల కోసం ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ తన్నుకుంటున్నయ్.
కావేరి నది గురించి తమిళనాడు, కర్ణాటక కొట్టుకుంటున్నయ్. కృష్ణా, గోదావరి నదులపై ఆంధ్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడుపై కొట్లాట. దేశ భూభాగం 83కోట్ల ఎకరాల్లో విస్తరించి ఉంది. అమెరికాలో 29శాతమే వ్యవసాయ అనుకూల భూమి ఉంది. చైనాలో 16శాతమో వ్యవసాయోగ్య భూమి ఉంది. భారతదేశంలో 50శాతం వ్యవసాయయోగ్యమైన భూమి ఉంది. వ్యవసాయ అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఇవన్నీ సద్వినియోగం చేసుకుంటే ప్రపంచానికే గొప్ప ఫుడ్ చైన్గా ఉండేది. మన పిల్లలు ఇవాళ మెక్డోనాల్డ్కు వెళ్లి బర్గర్, సబ్వేకు వెళ్లి పిజ్జా తెచ్చుకుంటా అంటున్నరు. ఫుడ్ పాలసీ తీసుకువచ్చి అమలు చేస్తే ప్రపంచంలోనే అత్యధిక అద్భుతమైన ఫుడ్ ప్రాసెసింగ్గా ఉండాలి. అందుకే బీఆర్ఎస్ పార్టీకి ‘అబ్కీ బార్ కిసాన్ సర్కారు’స్లోగన్ పెట్టినం. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రైతులు బాగుపడుతరు. రైతుల పిల్లలతో బ్యాంకుల రుణాలు ఇప్పించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడితే ప్రపంచానికి అన్నం పెడుతం. యుద్ధం ఈ దరిద్రంపై చేయాలి. మొన్న వడ్లు కొనాలని ఢిల్లీకి పోతే.. మీరు నూకలు తినిపించడం నేర్పండని చెబుతున్నరు. ఇది ఓ కేంద్ర మంత్రి మాట్లాడాల్సిన మాటేనా?’ అని మండిపడ్డారు.