హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మునుగోడు గడ్డ గులాబీ వనమైంది. ఉపఎన్నిక తీర్పు ముందే తేటతెల్లమైంది. తామంతా సీఎం వెంటే అని నిరూపించింది. బీఆర్ఎస్ జైత్రయాత్రకు బంగారిగడ్డ పునాది రాయి అయ్యింది. భారత రాజకీయాలను మార్చేది తెలంగాణ గడ్డేనని మరోమారు తేల్చిచెప్పింది. ఈ అద్భుత అవకాశం తామే దక్కించుకొంటామని ప్రతినబూనింది. మునుగోడు ప్రజలు ధనబలం కాదు.. జనబలం ఉన్న టీఆర్ఎస్ వైపే ఉంటామని చాటిచెప్పారు. ఆదివారం నల్లగొండ జిల్లా చండూరు సమీపంలోని బంగారిగడ్డ వద్ద నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగసభకు జనవాహిని పోటెత్తింది. సీఎం కేసీఆర్ ప్రసంగానికి జనం చప్పట్లతో ఆమోదం తెలిపారు. ఒక్కో మాటకు కేరింతలు కొట్టారు. తెలంగాణపై కేంద్రం వివక్ష, ప్రభుత్వాలను కూలదోసేందుకు బీజేపీ చేసిన కుట్రలను వివరించినపుడు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ‘నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవిని మించిన పదవి ఉంటదా? ఇంకేం కావాలి నీకు.. ఎందుకీ అరాచకం..ఎందుకీ కిరాతకం? ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోస్తున్న మోదీకి మునుగోడు గట్టి గుణపాఠం చెప్పా ల్నా? వద్దా? అని ప్రశ్నించినపుడు ‘చెప్పు డే…చెప్పుడే’ అన్న నినాదాలు ప్రతిధ్వనించా యి. ‘గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే వస్తాయా? అని అడిగినప్పుడు ‘రావు..రావు’ అని సభాప్రాంగణం నినదించింది.
మలుపు తిప్పిన సభ
బంగారిగడ్డలో నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ మునుగోడు ఉపఎన్నికను మలుపుతిప్పింది. నియోజకవర్గానికి గత ప్రభుత్వాలు, 8 ఏండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను సీఎం పూసగుచ్చినట్టు వివరించారు. ఇవన్నీ నిజమా..కాదా ? అని అడిగినపుడు నిజమేనని సమాధానం వచ్చింది. మాట ఇచ్చిండంటే కేసీఆర్ తప్పడన్న సంతోషం సభికుల్లో కనిపించింది. తన మాటలతో జనాన్ని ఒప్పించి మెప్పించగల ఏకైక నేత కేసీఆరేనని పలువురు చర్చించుకొన్నారు.
విజయం ఏపక్షమే
మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖరారైంది. టీఆర్ఎస్ ప్రజాబలం ముందు.. బీజేపీ ధనబలం నిలువలేదని సీఎం సభతో నిరూపితమైంది. భారీ మెజార్టీ సాధించి పెట్టేందుకు సభ దోహదం కానున్నది. కేసీఆర్ చెప్పిందే నిజమని.. నిన్నటివరకు తటస్థంగా ఉన్న 10-12 శాతం ఓటర్లు కూడా సీఎం కేసీఆర్ సభతో టీఆర్ఎస్ వైపు మొగ్గనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉద్విగ్న ప్రసంగం..యువత హుషారు
ఉరకలెత్తే యువలోకం సీఎం కేసీఆర్ ఉద్విగ్న ప్రసంగంతో ఉర్రూతలూగింది. ఆలోచనాపరులు, మేధావులు, కవులు, కళాకారులు, యువకులు సమాజగతిని మార్చాలని ఆయన కోరారు. మునుగోడును, నల్లగొండను, తెలంగాణను తద్వారా దేశచరిత్రను మార్చేశక్తి యువతకు ఉన్నదని వివరించారు. దేశానికి జరుగుతున్న అన్యాయం, మోదీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని సీఎం వివరిస్తున్నప్పుడు సభలోని యువత ‘జై కేసీఆర్..జై తెలంగాణ..జై భారత్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేసింది. పార్టీలకు సిద్ధాంత బేధాలు ఉండొచ్చు.. నయవంచనలకు, ప్రలోభాలకు లొంగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించినప్పుడు యువత నుంచి చక్కటి స్పందన వచ్చింది. చౌటుప్పల్, సంస్థాన్నారాయణపురం, గట్టుప్పల్, నాంపల్లి మండలాల నుంచి మహిళలు వాహనాల్లో తరలివచ్చారు. చండూరు, మునుగోడు సమీప గ్రామాల నుంచి పాదయాత్రగా చేరుకొన్నారు. ‘తొవ్వొంటి పాటలు పాడుతూ జాతరకు పోయినట్టు నడిచినం..అలసట అనిపించలేదు బిడ్డా’ అని చేతికర్రతో సభకు వచ్చిన నర్సవ్వ అనే వృద్ధురాలు తెలిపింది.
ప్రత్యేక ఆకర్షణగా నలుగురు ఎమ్మెల్యేలు
బీజేపీ కొనుగోలు కుట్రను పటాపంచలు చేసిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బంగారిగడ్డ బహిరంగ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్రెడ్డి, గువ్వల బాలరాజును సీఎం కేసీఆర్ సభకు పరిచయం చేస్తూ ‘బీజేపీ వందల కోట్ల ప్రలోభాలను కాలిచెప్పు తో కొట్టిన తెలంగాణ పులిబిడ్డలు. మన ఎమ్మెల్యేలు. ఇట్లాంటి ఎమ్మెల్యేలు కావాలె తెలంగాణకు అనగానే చప్పట్లు, ఈలలు మార్మోగాయి.
సభకు ఎడ్లబండిపై వస్తున్న రైతులు
బంగారిగడ్డ బాటలో.. సీఎం కేసీఆర్ సభకు తరలివస్తున్న జనం
వామపక్ష నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ అభివాదం
జనంలో మమేకమై..
మంత్రులు, ఎమ్మెల్యేలు వేదిక మీద కాకుండా సభలో జనంతో మమేకమయ్యారు. మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వారివారి గ్రామాల నుంచి జనంతో కలిసివచ్చారు. సాధారణ ప్రజల్లా కింద కూర్చొని సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంటే అధికారం కోసమో..పదవుల కోసమో పాకులాడేవాళ్లు కాదని, ప్రజా సేవకులం అని నిరూపించారు.
మునుగోడు గెలుపు..జాతికి మలుపు
బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలకు మునుగోడు మునుపెట్టనున్నదని తేలిపోయింది. తాము అభివృద్ధికి అడుగులు వేయటమే కాదు..దేశ రాజకీయాలను మార్చే అద్భుత అవకాశం తమకే దక్కుతుందని మునుగోడు ప్రజలు తేల్చిచెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అఖండ విజయంతో గెలిపిస్తే ఇటు మునుగోడు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని, అటు సీఎం కేసీఆర్ రాజకీయాలను శాసించే శక్తిగా అవతరిస్తారని మునుగోడు ప్రజలు ఈ సభ ద్వారా తేల్చిచెప్పారు.
అప్రమత్తంగా ఉండాలి
మునుగోడులో టీఆర్ఎస్ విజయం ఖాయమైనా చివరిక్షణం వరకు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, సీపీఎం, సీపీఐ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పెట్టుబడిదారులు, రాజకీయ బ్రోకర్గాండ్లు ప్రజలను ప్రలోభాలకు గురిచేసి..వారి దృష్టిని మళ్లించేందుకు దొంగనాటకాలు ఆడుతారని వీటిపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని కర్తవ్యబోధ చేశారు. చైతన్యవంతమైన మునుగోడు ప్రజలపై ఆయన అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించారు. మందుగుండు సామగ్రికి, తలాతులం బంగారానికి తలొగ్గద్దని హితవు పలికారు. ముండ్లచెట్లకు పండ్లురావని గుర్తించాలని ఆయన మనుగోడు ప్రజలను కోరారు. కరిచేపామును మెడలో వేసుకోవద్దని బుద్ధిమాట చెప్పారు.
ఇండ్లకు తాళాలు వేసి..
చండూరులో జరిగిన బహిరంగ సభ జనసంద్రమై ఉప్పొంగింది. నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలు తమ ఇండ్లకు తాళాలు వేసి కుటుంబసమేతంగా తరలివచ్చారు. ఎవరూ ఊహించని విధంగా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు భారీ సంఖ్యలో ఈ సభకు రావడం గమనార్హం. సీఎం కేసీఆర్ తమకు పెద్ద కొడుకులా పింఛన్లు ఇస్తున్నారని వృద్ధులు..కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో తమ ఆడబిడ్డల పెండ్లి చేస్తున్నారని తల్లిదండ్రులు.. ‘ఆసరా’ పింఛన్లతో ఆదుకొంటున్నారని ఒంటరి మహిళలు, దివ్యాంగులు.. రైతుబంధుతో వ్యవసాయాన్ని పండుగలా మార్చారని రైతులు స్వచ్ఛందంగా సభకు తరలివెళ్లడంతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభ వెలుపల సైతం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో భారీ జనసందోహం కనిపించింది.
పోటెత్తిన జనవాహిని
బంగారిగడ్డ సభాప్రాంగణం మధ్యాహ్నం 12.30కే జనంతో నిండిపోయింది. కళాకారుల ఆటాపాటలు అలరించాయి. సభా ప్రాంగణానికి సీఎం కేసీఆర్ హెలికాప్టర్ సరిగ్గా 3.48 నిమిషాలకు చేరుకొన్నది. హెలికాప్టర్ చూడగానే జనం ‘జై కేసీఆర్..జై తెలంగాణ’ అంటూ ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. వేదికపైకొచ్చిన కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. 4.04 గంటలకు మొదలుపెట్టి 4.46 గంటల వరకు ఆయన ప్రసంగించారు. మునుగోడు, తెలంగాణ, దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ చేసిన ఆలోచనాత్మక ప్రసంగాన్ని సభికులు ఓపిగ్గా విన్నారు.
భారీ ఎల్ఈడీ స్క్రీన్లతో బీజేపీ ప్రలోభ పర్వం
బంగారిగడ్డ సభాప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్ల మీద బీజేపీ ప్రలోభపర్వాన్ని ప్రదర్శించారు. ఎమ్మెల్యేల ఎరపై ‘క్యాషా’యస్వాములు జరిపిన సంభాషణలను ప్రత్యేకంగా వినిపించారు. ఆమ్ ఆద్మీపార్టీ నేత ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలుపై నిర్వహించిన ప్రలోభపర్వాన్ని కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు.
మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా.. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజ్ఞప్తి
మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేసి, తనను గెలిపించాలని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చి తనకు అవకాశం ఇచ్చారని చెప్పారు. ‘మీ సేవకుడిగా నిరంతరం అందుబాటులో ఉంటా. అభివృద్ధి కోసం పాటుపడుతా. మునుగోడు మట్టిబిడ్డను.. ఇక్కడ్నే పుట్టినోణ్ణి. మీ బిడ్డగా నన్ను మరోసారి ఆశీర్వదించండి’ అని విజ్ఞప్తి చేశారు. ఆదివారం చండూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరేయాలని కోరారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్లు గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, యాదా్రద్రి జెడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, కర్నాటి విద్యాసాగర్, సీపీఎం నేతలు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నేతలు చాడ వెంకట్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నోరు అదుపు తప్పితే నాలుక చీరేస్తాం
నీ లెక్క మేం అమ్ముడుపోలే.. రాజగోపాల్కు కూనంనేని హెచ్చరిక
రాజగోపాల్రెడ్డి కమ్యూనిస్టులపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే నాలుక చీరేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. రాజగోపాల్రెడ్డి రూ.18 వేల కోట్లకు అమ్ముడుపోయారని, ఆయన లెక్క తాము పార్టీ మారలేదని చురకలేశారు. ఆదివారం చండూరు సభలో కూనంనేని మాట్లాడుతూ.. ధర్మం అనే పదం కోమటిరెడ్డి బ్రదర్స్ నోటి నుంచి వస్తే.. అదే ధర్మం సిగ్గుతో తల వంచుకొంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎంపీ వెంకట్రెడ్డి బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా మారారని విమర్శించారు. తెలంగాణలో కాషాయమూకల ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు. మోదీ, అమిత్షా జైలుకెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
బీజేపీని చిత్తుగా ఓడించాలి
ఢిల్లీ కుట్ర ఫలితమే ఎన్నిక.. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్రెడ్డి: తమ్మినేని
మునుగోడు ఉప ఎన్నికలో మతతత్వ బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. రాజగోపాల్ స్వార్థ రాజకీయాలు, బీజేపీ అధిష్ఠానం ఢిల్లీ నుంచి సాగించిన కుట్రల ఫలితంగానే ఉప ఎన్నిక వచ్చిందని వివరించారు. ఆదివారం చండూరులో నిర్వహించిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడుతూ.. రాజగోపాల్రెడ్డి బీజేపీతో మూడేండ్ల నుంచి అక్రమ సంబంధం పెట్టుకొన్నారని దుయ్యబట్టారు. ఇలాంటి అవినీతిపరులను, స్వార్థపరులను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ దుర్మార్గమైన పార్టీ అని, రాష్ర్టాల హకులను కాలరాస్తున్నదని, రాజ్యాంగాన్ని సర్వనాశనం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామీజీలను ముందుపెట్టి ఎమ్మెల్యేలను కొనాలనే నీచ రాజకీయాలను చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మిషన్ భగీరథ అద్భుతం
రాష్ర్టాన్ని తెచ్చిన కేసీఆర్ సార్కే నా తొలి ఓటు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మా ఊరిలో ఇంటింటికీ అందుతున్నాయి. మిషన్ భగీరథ పథకం అద్భుతం. ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు ఇస్తుండ్రు. కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు సరఫరాతో అన్నివర్గాలు లబ్ధి పొందుతున్నాయి. యువత రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్తో కలిసి నడవాలి.
– మెరుగు హేమంత్, యరగండ్లపల్లి, మర్రిగూడ మండలం
కల్యాణలక్ష్మితో మేలు
ఆడపిల్ల పుడితే నిరుపేద తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ భారాన్ని తప్పించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆడబిడ్డ పెండ్లికి ఆర్థికసాయం అందిస్తున్నారు. ఆడపిల్లల భద్రత కోసం షీ టీమ్ ఏర్పాటు చేశారు. అవకాశం కల్పిస్తే యువత అన్ని రంగాల్లో రాణిస్తుంది. కేసీఆర్ సార్ మీదున్న అభిమానంతో 7 నెలల పాపతో మీటింగ్కు వచ్చిన.
– ఇరిగి దర్శిని, గృహిణి, చండూరు
‘దళితబంధు’తో సెంట్రింగ్ కొన్న
ఇంతకుముందు సెంట్రింగ్ కూలీకి పోయేటోళ్లం. వచ్చిన డబ్బులతో కుటుంబం బతకడం కష్టంగా ఉండేది. దళితబంధు పథకంలో సెంట్రింగ్ పరికరాలు కొన్నాం. నెలకు 30 నుంచి 40 వేలు సంపాదించుకొంటున్నాం. ఇయ్యాల సండూర్లో జరిగే సభలో కేసీఆర్ను చూడడానికి పోతున్నాం. మేమంతా కేసీఆర్ వెంటే ఉంటాం. మరింత అభివృద్ధిని కోరుకొంటున్నాం.
– సువర్ణ, జమస్తాన్పల్లి, మునుగోడు మండలం
ఆత్మగౌరవంతో బతుకుతున్నం
హిందూ,ముస్లింలను తక్కువ చేసి చూడటం ఏ పార్టీకీ తగదు. అందరం ఒకే ఊర్లో కలిసిమెలిసి ఉంటున్నం. బీజేపీ మాత్రం వేర్వేరుగా చూస్తూ మనస్పర్ధలు కల్పించేలా చూస్తున్నది. అన్ని మతాలను సమానంగా చూసే టీఆర్ఎస్కు అండగా ఉంటాం. ముస్లింలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు టీఆర్ఎస్ అవకాశాలు ఇస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మగౌరవంతో బతుకుతున్నం.
– సయ్యద్ అహ్మద్, రాజపేట తండా, మర్రిగూడ మండలం