CM KCR | బీఆర్ఎస్ సభ అంటే.. ప్రజలు పోటెత్తుతారు. జనసునామీతో హోరుగాలి కూడా గులాబీమయమైపోతుంది. ప్రచండ రుద్రనర్తనను తలపించేలా కేసీఆర్ తన మాటలతో నిప్పులు చిమ్ముతారు. ఒక్కొక్క మాట ఓ తూటాలా దూసుకెళ్తుంటే జనం ఆలోచనలోపడతారు. ఆనందపడతారు. చప్పట్లు కొడుతూ మద్దతు తెలుపుతారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ప్రజాఆశీర్వాద ఎన్నికల ప్రచార సభల్లో ప్రతిరోజూ ఇదే దృశ్యం ఆవిష్కృతమవుతున్నది. రోజుకు మూడు, నాలుగు బహిరంగ సభలు జరిగినా.. అలుపెరగకుండా కేసీఆర్ రణగర్జన చేస్తూనే ఉన్నారు. ఆదివాసీ ప్రాంతమైనా, కోల్బెల్ట్ ఏరియా అయినా.. పల్లె, పట్నం ఎక్కడైనా.. కేసీఆర్ సభ అంటే జనకెరటం ఎగిసిపడుతున్నది. ప్రియనేత మాట కోసం ఎన్నిగంటలైనా ఎదురుచూస్తున్నది. మంగళవారం పినపాక, భద్రాచలం, నర్సంపేటల్లో జరిగిన బీఆర్ఎస్ ప్రచార సభల్లో జన ప్రభంజనం కనిపించింది. గులాబీ గెలుపునకు సంకేతంలా అగుపించింది.. ఇది ప్రజాచేతన!.. ప్రగతికి దీవెన!
వరంగల్ జిల్లాలో పెట్టాల్సిన మెడికల్ కాలేజీని నర్సంపేటలోనే పెట్టాలని పెద్ది సుదర్శన్రెడ్డి పట్టుబట్టి సాధించిండు. గోదావరి నీళ్లు వచ్చినా, పాకాల కింద రెండు పంటలు పండుతున్నా, కాళేశ్వరం నీటితో నర్సంపేటలో 270 చెరువులను నింపుతున్నా ఇదంతా సుదర్శన్రెడ్డి సాధించుకున్న ఘనత. గతంలో కొట్లాటలు, హత్యలతో కల్లోలంగా నర్సంపేట అంతా ఉండేది. ఈ పదేండ్లల్ల ప్రశాంతంగా ఉన్నది. ఎప్పుడూ మీ మధ్యనే ఉంటూ నర్సంపేటను బాగుచేసుకోవాలనే తలంపు ఉన్న సుదర్శన్రెడ్డి కావాల్నా? ఐదేండ్లకోసారి వచ్చే టూరిస్టులు కావాల్నా? ప్రజలు తేల్చుకోవాలి.
– సీఎం కేసీఆర్
కర్ణాటక నుంచి ఒక పెద్దమనిషి వచ్చిండు. అక్కడ ఉప ముఖ్యమంత్రట. కేసీఆర్ మా గొప్పతనం తెలుసా? మేము రూ.600 పింఛన్ ఇస్తున్నమని చెప్తున్నడు. ఏమిరా సన్నాసి మేం రూ.2000 ఇస్తం
రా అని చెప్పిన. ఇది చాలదన్నట్టు.. నువ్వు కర్ణాటకకు రా.. వచ్చి చూడు అని మాట్లాడిండు. ఇంకోమాట ఏం చెప్తడు.. కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంట్ ఇస్తున్నం తెలుసా? అంటున్నడు. 24 గంటల కరెంట్ ఇచ్చేకాడ.. మేం 5 గంటలు ఇస్తున్నమని చెప్తే దేంతో నవ్వాలో నాకైతే అర్థం కాలేదు. కాంగ్రెస్ పద్ధతి ఇట్లుంటది. కాంగ్రెసోళ్లు ఏనాడూ పేదల గురించి ఆలోచించలేదు.. ఆలోచించరు గూడా.
– సీఎం కేసీఆర్
24 గంటల కరెంటు అవసరం లేదు.. 3 గంటలు చాలని కాంగ్రెసోళ్లు అంటున్నరు. పైగా రైతులు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాల్నట. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే మూడు గంటలల్ల పొలం పారుతదని అంటున్నరు. మరి 10 హెచ్పీ మోటర్లు ఎవరు కొనిస్తరు? వీని అయ్య కొనిస్తడా? అసలు రైతుల దగ్గర 10 హెచ్పీ మోటర్లు ఉంటయా? రైతులు వాడేది 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లే. రాష్ట్రంలో 30 లక్షల కనెక్షన్లున్నయి. మరి 30 లక్షల 10 హెచ్పీ మోటర్లు కొనాల్నా? ఇది కొంపలు ముంచే యవ్వారం కాదా? మూడు గంటలల్ల పొలం పారుతదా?
-సీఎం కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని, ఈ ఎన్నికల్లో వెయ్యిశాతం తామే గెలుస్తున్నామని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు రైతులు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలంటూ కొత్త పాట పాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ‘రైతులు వాడేది 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లే. మరి 10 హెచ్పీ మోటర్లు మీ అయ్య కొనిస్తడా?’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర రైతాంగానికి ఇవ్వాల్సిన కరెంటుపై, పొలాలకు వాడే మోటర్లపై కనీస అవగాహన లేదని మండిపడ్డారు.
అలాంటి నాయకులు రాష్ట్ర రైతాంగం వెతలు తీరుస్తామని కథలు పడ్తున్నారని విమర్శించారు. సోమవారం అశ్వారావుపేట, పినపాక, నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కరెంటు 5 గంటలే ఇస్తున్నారని చెప్పారు. గతంలో పాలకులు ఏనాడూ రైతుల గురించి ఆలోచించలేదని, ఇప్పుడు తాము ఆలోచిస్తుంటే రకరకాల విమర్శలు చేస్తున్నారని, అందుకే అన్నీ ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. ‘ధరణిని బంగాళాఖాతంలో వేస్తమని కాంగ్రెస్ అంటున్నది. బంగాళాఖాతంలో వేసేది ధరణినా? లేకపోతే రైతులనా? అని ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ నుంచి ఏ సమాధానం రావడం లేదు. భూములపై హక్కులను రైతులకే ఇచ్చింది బీఆర్ఎస్.
ఆ హక్కులను గోల్మాల్ చేస్తమని అంటున్నది కాంగ్రెస్. రైతులే గోల్మాల్ అయితరో, లేకపోతే.. కాంగ్రెస్నే గోల్మాల్ చేస్తరో ఆలోచించుకోవాలి’ అని కేసీఆర్ కోరారు. ప్రాజెక్టు ద్వారా పారే నీళ్లకు నీటి తీరువా బకాయిలు రద్దుచేయడమే కాకుండా పన్ను లేకుండా చేశామని, 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా ఇవ్వడంతోపాటు పండిన పంటను ప్రభుత్వమే కొంటున్నదని చెప్పారు. రైతుల అప్పులుతీరి, వారి బాధలు పోవాలని ఇవన్నీ చేపట్టామని తెలిపారు. రైతుబంధు వృథా అని, 3 గంటల కరెంటు సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారని, ఈ విషయాలపై రైతులు ఆలోచన చేయాలని సూచించారు.
‘పీసీసీ అధ్యక్షుడు ఒకటికి రెండుసార్లు ఒకటే అంటున్నడు. ఆయన అహంకారానికి, గర్వానికి హద్దే లేదు. ఆయన ఏం పడగొడుతడో నాకు అర్థంకావడంలేదు. ఆయనకున్న తెలివేందో నాకు తెలియదు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తానని, 24 గంటల కరెంట్ వేస్ట్ అని అంటున్నడు’ అని రేవంత్పై కేసీఆర్ విరుచుకుపడ్డారు. కరెంట్ వృథా అని రేవంత్ అంటుం టే.. రైతుబంధు దుబారా అని ఉత్తమ్కుమార్రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. మూడు గం టల కరెంట్తో పొలాలు పారుతాయా? పామాయిల్ తోటలు పారుతాయా? అని ప్రశ్నించా రు. ఏ పార్టీ వైఖరి ఏంటో గుర్తించి ఓట్లు వే యాలని, 24 గంటల కరెంట్ ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ కోరారు.
ఎమ్మెల్యేల ఎన్నికతోనే మన ప్రభుత్వం ఏర్పడుతుందని, ఇక్కడ ఒకరు.. అక్కడ ఒకరు గెలిస్తే ఇబ్బందులొస్తాయని.. కాబట్టి ప్రజలు ఆలోచించి అభివృద్ధికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ రాజ్యంలో ఎంతో ఏడ్చినం. పొద్దాక కొంత.. రాత్రి కొంత కరెంట్. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే లంచాలివ్వడం. పంటలు ఎండిపోవడంవంటి అనేక బాధలు అనుభవించినం.కాబట్టే జాగ్రత్తగా ఓటేయాలి’ అని సూచించారు. నాడు కరెంట్ కోతలు, మంచినీళ్లు, సాగునీరు లేక మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి లక్షలాది మంది వలసలు పోయిన తీరును వివరించారు. వీటిన్నింటినీ బేరీజు వేసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమపద్ధతిలో పనులు చేసుకుంటూ ముందుకు సాగిందని చెప్పారు. ‘స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంట్ సమస్యను పరిష్కరించుకున్నాం. రైతాంగం, పరిశ్రమలు, అన్ని రంగాలకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ సరఫరా చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ప్రధాని మోదీ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నారు. రైతుల బాధలు తెలుసు కనుకనే.. కరెంట్ ఆవశ్యకత తెలుసు కాబట్టి, వారి వెతలు తీర్చేందుకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలనుకున్నాం.. ఇస్తు న్నాం’ అని స్పష్టం చేశారు. రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బంది లేకుండా.. మార్కె ట్ యార్డుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టామని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వస్తున్నదని, అయినప్పటికీ.. రైతును నిలబెట్టాలని ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్నప్పటికీ ప్రజలు మంచినీళ్లకు ఎందుకు బాధపడ్డారో అర్థం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని గూడేల్లో ఎలాంటి పరిస్థితి ఉండేదో అందరికీ తెలుసని చెప్పారు. వర్షాకాలం వచ్చిందంటే ‘మంచం పట్టిన మన్యం’ అనే వార్తలు వినిపించేవని, అంటురోగాలతో గిరిజన ప్రాంతాలన్నీ చచ్చిపోతున్నవనే వార్తలు వచ్చేవని ఆవేదన వ్యక్తంచేశారు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఆ పరిస్థితి ఉన్నదా? అనేది ఆలోచించాలని కోరారు. తనకన్నా ముందు అనేకమంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ ఎవ్వరూ మంచినీటి సమస్యను తీర్చలేకపోయారని చెప్పారు.
‘మరి అప్పట్లో.. పాలకులకు తెలివిలేకనా? ఆలోచన లేకనా? ప్రజలను వాళ్ల ఖర్మకే వదిలేసినరా? దయచేసి ఆలోచన చేయాలి. నేనేమైనా నదులను కొత్తగా తీసుకొచ్చానా? గోదావరి, కృష్ణా నదులు తరతరాల నుంచీ ఉన్నవే. మరి మంచినీళ్లు కూడా ఎందుకు రాలేదో ప్రజలు ఆలోచించాలి.ప్రజల మీద ప్రేమ ఉంటే, బాధ్యత ఉంటే నీళ్లు వచ్చేవి’ అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం లుంగీ కట్టుకొని ఊపుకుంటూ ప్రచారానికి వస్తారనీ, గంగానది ఉన్న ఉత్తరప్రదేశ్లో కూడా నేటికీ మంచినీళ్లకు దిక్కులేదని విమర్శించారు. గోదావరి, కృష్ణా నదులున్నా కాంగ్రెస్ పాలకులు అసమర్థతతో పంటలను ఎండబెట్టారని కేసీఆర్ మండిపడ్డారు. ‘దుమ్ముగూడెం దగ్గరి నుంచే 16 మండలాలకు నీళ్లు పోతున్న య్.
గోదావరి, కృష్ణా నదులు ఉన్నప్పటికీ వ్యవసాయాన్ని ఎండబెట్టారు. మనల్ని కరువుకు గురిచేశారు. ఇవాళ సీతారామ ప్రాజెక్టు మీ కం డ్ల ముందే జరుగుతా ఉంది. 37 టీఎంసీల సామర్థ్యంతో సీతమ్మ సాగర్ నిర్మిస్తున్నం. పారే గోదావరి నుంచి ఇష్టమున్నన్ని నీళ్లు తీసుకోవచ్చు. ఇంకో ఏడాదిలోపే.. పాత ఖమ్మం జిల్లాలో ఇంచుకూడా మిగలకుండా వజ్రపు తునకలా తయారైతది. దశాబ్దాలుగా మనల్ని పాలించినోళ్లు.. సీతమ్మసాగర్ కట్టాలని ఎందు కు ఆలోచించలేదు. మన కర్మలకు మనల్ని వదిలేశారు’ అని మండిపడ్డారు.
గోదావరి తలాపునే పారుతున్నా ఖమ్మం జిల్లాకు నీళ్లిచ్చే ఆలోచన కాంగ్రెస్ నాయకులు చేయలేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గోదావరి నదిని ఎవరు పుట్టించింది కాదు. తరతరాలుగా, యుగయుగాలు ఈ నది ప్రవహిస్తున్నది. ఈ నదిపై సీతారామ ప్రాజెక్ట్ సీతమ్మసాగర్ చేపట్టి ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇవ్వాలని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఆలోచన చేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే సీతమ్మసాగర్ నిర్మాణమవుతున్నది. 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఏడాదిలోపే సంవత్సరంలో పాత ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఇక్క ఇంచులేకుండా అంతా సస్యశ్యామలమవుతుంది. అశ్వారావుపేట భూములకు నీళ్లొస్తాయి. ప్రగతి కాముకంగా, ప్రగతిశీలంగా ముందుకెళ్తున్నాం’ అని కేసీఆర్ చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరటక దమనకులు ఇద్దరు మొదలయ్యారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టోడిని అసెంబ్లీ గడప కూడా తొక్కనివ్వమని మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ పంపేది ప్రజలు కాదా? అని ప్రశ్నించారు. అందుకే ఆ దుర్మార్గుల అరాచకాలు ఆపడానికి, వాళ్లకు బుద్ధి చెప్పాలని కోరారు. డబ్బులు పంచి మనల్ని కొనాలని చూస్తున్నారు.. అమ్ముడుపోదామా? అని ప్రశ్నించారు. ‘గతంలో వరదలు వచ్చాయి. భద్రాచలం వచ్చి పరిశీలించా. 14 వేలకు టుంబాలకు రూ.10వేల చొప్పున సాయం అందించాం. ఎవరైతే నష్టపోయారో.. వాళ్లకు ఇండ్లు కట్టిస్తున్నాం. వెయ్యి కోట్లతో గోదావరికి ఇరువైపులా కరకట్టలు నిర్మిస్తాం. వరద నివారణ చేపడతా. కాంతారావు, వెంకట్రావ్ను గెలిపించండి. భద్రాద్రి శ్రీరాముల వారిని దర్శించుకొని రెండురోజులు ఇక్కడే ఉంటా. ఒకపూట భద్రాచలంలో, మరోపూట పినపాకలో సందర్శిస్తా. రాష్ట్ర అధికారుల బృందాన్ని తీసుకొచ్చి రెండురోజులు మీ మధ్యనే ఉండి.. కాంతారావు, వెంకట్రావ్ కోరిన కోరికలన్నీ నెరవేరుస్తా. పినపాక, భద్రాచలం రెండు నియోజకవర్గాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఒకేసారి దళితబంధు వర్తింపజేస్తాం. ఇద్దరినీ గెలిపిం చే బాధ్యత మీది.. అన్నీ అమలు చేసే బాధ్య త నాది’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ వచ్చేది లేదు.. సచ్చేదిలేదు.. వెయ్యిశాతం మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తే మళ్లీ ఎమ్మార్వో ఆఫీసుల చు ట్టూ తిరగాలని, అన్నింటికీ దరఖాస్తులు పెట్టాల్సి వస్తుందని, పైరవీకారులు.. దళారీలు వస్తారని హెచ్చరించారు. ధరణి ఉండటం వల్ల హైదరాబాద్లో డబ్బులు వేస్తే రైతుల ఖాతాల్లోకి నేరుగా వెళ్తున్నాయని చెప్పారు. 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్.. రైతులు, చేనేత కార్మికులను ఎందుకు ఆదుకోలేకపోయిందని ప్రశ్నించారు. అందుకే ఆయా పార్టీల వైఖరి, నడవడికను గుర్తించి ఓట్లు వేయాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు.
హైదరాబాద్ స్టేట్ అలాగే ఉండి ఉంటే ఇప్పటికే మన ప్రాజెక్టులు పూర్తయ్యి నీళ్లంది ధనిక రాష్ట్రంగా ఉండేవాళ్లం. దరిద్రమంతా పోయేది. సమైక్య రాష్ట్రంలో కలవడం.. అక్కడి నాయకుల దృక్పథమంతా మనదిక్కు లేకపోవడంతో బాధలు అనుభవించాం.
-సీఎం కేసీఆర్
‘తెలంగాణ ఒకప్పుడు ప్రత్యేక రాష్ట్రం (హైదరాబాద్ రాష్ట్రం)గా ఉండే. ఉన్న తెలంగాణను ఊడగొట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కలిపింది. స్వరాష్ట్రం కోసం ఎన్నిసార్లు ఉద్యమాలొచ్చినా కాంగ్రెస్ అణిచివేసి, హత్యలు చేయించింది’ అని కేసీఆర్ చెప్పారు. 2004లో పొత్తు ప్రకారం న్యాయబద్ధంగా వ్యవహరిస్తే 2005-2006లోనే తెలంగాణ వచ్చేదని, అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరించారని తెలిపారు. 14 ఏండ్లు పోరాడి.. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ నిరాహార దీక్షలకు పూనుకొంటే ప్రకటన చేసి, మళ్లీ వెనక్కి తగ్గిన కాంగ్రెస్ వైనాన్ని ప్రజల ముందుంచారు. యువకుల బలిదానాలు, పోరాటాలతో దిగివచ్చి, దిక్కులేక రాష్ర్టాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధపడిందని చెప్పారు.
‘మెచ్చా నాగేశ్వర్రావు వివాదరహితుడు. చాలా చక్కటి మనిషి. ఎమ్మెల్యే అయినా హైదరాబాద్లో ఉండరు. ఒకట్రెండురోజులే ఉండి, నియోజకవర్గానికే వస్తారు. ఆశ్వారావుపేటకు సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చారు. దీంతో రూపురేఖలు మారిపోయాయి. తాటి వెంకటేశ్వర్లు తిరిగి పార్టీలో చేరడంతో మనకు తిరుగులేదు. మళ్లీ మనమే గెలుస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ఉజ్వలమైన తెలంగాణగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు ఆశీర్వదించాలి’ అని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. అశ్వారావుపేటకు డిగ్రీ కాలేజీ, డయాలసిస్ సెంటర్, 100 పడకల దవాఖాన ఏర్పాటుచేశామని చెప్పారు. ఆశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ కావాలని అడిగితే 60 టన్నుల సామర్థ్యంగల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇప్పుడు మరో ఫ్యాక్టరీ కావాలని అడుగుతున్నారని, దానిని కూడా మంజూరు చేస్తామని హామీ చెప్పారు.
కరెంట్ వృథా అని రేవంత్ అంటుం టే.. రైతుబంధు దుబారా అని ఉత్తమ్కుమార్రెడ్డి అంటున్నారు. మూడు గంటల కరెంట్తో పొలాలు పారుతాయా? పామాయిల్ తోటలు పారుతాయా?
– సీఎం కేసీఆర్
పరాయి రాష్ట్రంవాళ్లు వస్తే వాళ్లను ఎదుర్కొన్న చరిత్ర నర్సంపేటకు ఉన్నదని, సమైక్యవాదులు వచ్చి ఇక్కడ రా జ్యం చేస్తామంటే నర్సంపేటవాసులు తీ వ్ర నిరసన తెలిపారని సీఎం గుర్తుచేశా రు. ఇలా నిరసన తెలిపినందుకు వైఎస్ షర్మిల ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డిపై పగబట్టిందని చెప్పారు. సుదర్శన్రెడ్డిని ఓడించేందుకు ఆమె డ బ్బుల కట్టలు పంపిస్తున్నదని అన్నారు. ఆమె డబ్బుల కట్టలు గెలవాలో, మన మిషన్ భగీరథ మంచినీళ్లు గెలవాలో ఆలోచించాలని కోరారు. సుదర్శన్రెడ్డిని గెలిపిస్తే ఎన్నికల తర్వాత తానే స్వయంగా వచ్చి ఒకరోజంతా రా ష్ట్ర అధికారులతోసహా మీ మధ్యే ఉండి మీరు కోరిన పనులన్నీ చేసిపెట్టే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.
‘గోదావరి నదిని ఎవరు పుట్టించింది కాదు. తరతరాలుగా, యుగయుగాలుగా ఈ నది ప్రవహిస్తున్నది. ఈ నదిపై సీతారామ ప్రాజెక్ట్ సీతమ్మసాగర్ చేపట్టి ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇవ్వాలని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఆలోచన చేయలే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే సీతమ్మసాగర్ నిర్మాణమవుతున్నది.
– సీఎం కేసీఆర్
సుదర్శన్రెడ్డి అసలు హైదరాబాద్కు రావడమే తక్కువని, ఒకవేళ వచ్చినా వెంటనే మళ్లీ నర్సంపేటకు తిరిగివస్తారని కేసీఆర్ చెప్పారు. ఎప్పుడూ మీ మధ్యనే ఉంటూ నర్సంపేటను బాగుచేసుకోవాలనే తలంపు ఉన్న సుదర్శన్రెడ్డి రావాల్నా? టూరిస్టుల మాదిరి ఐదేళ్లకోసారి వచ్చేవాళ్లు కావాల్నా? తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. వరంగల్ జిల్లాలో పెట్టాల్సిన మెడికల్ కాలేజీని నర్సంపేటలో పెట్టాలని సుదర్శన్రెడ్డి పట్టుబట్టి సాధించారని గుర్తుచేశారు. గోదావరి నీళ్లు వచ్చినా, పాకాల కింద రెండు పంటలు పండుతున్నా, కాళేశ్వరం నీటితో నర్సంపేటలో 270 చెరువులను నింపుకుంటున్నా ఇవన్నీ సుదర్శన్రెడ్డి సాధించిన ఘనతేనని చెప్పారు. గతంలో నర్సంపేట అంతా కొట్లాటలు, హత్యలు, కల్లోలాలతో ఉండేదని, ఈ పదేండ్ల నుంచి సుదర్శన్రెడ్డి నాయకత్వంలో ప్రశాంతంగా ఉన్నదని, బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. అభివృద్ధి పెడదారి పట్టకుండా ఇలాగే కొనసాగాలంటే, పేదల సంక్షేమం ఆగొద్దంటే 30వ తేదీన జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు.
సమైక్యవాదులు, వాళ్ల చెంచాలు వచ్చి ఇక్కడ రాజ్యం చేస్తామంటే నర్సంపేటవాసులు తీవ్ర నిరసన తెలిపారు. అందుకే ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డిపై వైఎస్ షర్మిల పగబట్టింది. సుదర్శన్రెడ్డిని ఓడించేందుకు డబ్బుల కట్టలు పంపిస్తున్నది. ఆమె డబ్బుల కట్టలు గెలవాల్నో, మన మిషన్ భగీరథ మంచినీళ్లు, మన 24గంటల కరెంటు గెలవాల్నో ప్రజలు ఆలోచించాలి.
-సీఎం కేసీఆర్
పినపాక నియోజకవర్గంలో 16 వేల కుటుంబాలకు, 57 వేల ఎకరాలకు పోడు భూ ములు ఇచ్చామని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. వాళ్లమీద కేసులన్నీ రద్దు చేశామని, వాళ్లకు రైతుబంధు ఇస్తున్నామని, రైతుబీమా సౌక ర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ‘మా పార్టీ మిత్రుడు ఒక రాజుగారు భద్రాచలం అవతల ఉండేటోడు. ఒకరోజు ఆయన చెప్పిండు. సర్ మా దగ్గర గిరిజన గూడేలకు త్రీఫేజ్ కరెంట్ లేదు. వస్తే మావోళ్లు వ్యవసాయం చేసుకొని బతుకుతరని చెప్పిండు. రూ.300 కోట్లు పెట్టి రాష్ట్రంలోని అన్ని గిరిజన గూడేలకు, లంబాడీ తండాలకు త్రీఫేజ్ కరెంట్ ఇచ్చినం. బ్రహ్మాండంగా పంటలు పండుతున్నయ్’ అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నేతలకు గిరిజనులు మనుషుల్లా కనిపించలేదా? వాళ్లకు త్రీఫేజ్ కరెంట్ అవసరం ఉన్నదని తెలియదా? అని కేసీఆర్ ప్రశ్నించారు.
భద్రాచలం నియోజకవర్గంలో అనేక వాగులు ఉప్పొంగేవని, ఆడోళ్లు ప్రసవమైతే మంచంలోనే కిలోమీటర్ల కొద్దీ ఎత్తుకునివెళ్లే పరిస్థితి ఉండేదని నాటి రోజులను గుర్తుచేశారు. ఇవాళ చాలా వాగులమీద హైలెవల్ బ్రిడ్జిలు కట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అమ్మఒడి వాహనం ఇంటికొచ్చి దర్జాగా దవాఖానకు తీసుకెళ్తున్నదని, ప్రసవం చేయించి మళ్లీ ఇంటి దగ్గర దింపుతున్నదని తెలిపారు. కేసీఆర్ కిట్టు ఇస్తున్నామని, అమ్మాయి పుడితే రూ.13 వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు ఇస్తున్నామని చెప్పారు. గతంలో మహామహులైన మేధావులు పరిపాలించారని, మరి వాళ్లెందుకు ఇవన్నీ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇవాళ బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాల్లో 100 పడకల దవాఖానలు ఉన్నాయని చెప్పారు. నాడు 3 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉంటే.. ఇవాళ 103 కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కిడ్నీ పేషంట్లకు కూడా పింఛన్ ఇస్తున్నామని, ఉచిత బస్పాస్లు ఇచ్చామని చెప్పారు.
విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్)ను మణుగూరులో నిర్మించాల్సి ఉన్నదని, ఆనాటి సమైక్యవాదులు కుట్రలు చేసి ఆంధ్రా ప్రాంతమైన విజయవాడకు తరలించారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దీనివల్ల మణుగూరు యువతకు ఉద్యోగాలు దక్కలేదని, ప్రజలు ఉపాధిని కోల్పోయారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మణుగూరులో బీటీపీఎస్ను నిర్మించామని గుర్తు చేశారు.
‘రైతాంగం చల్లగుంటేనే ప్రపంచం శాం తిగా ఉంటుంది. రైతులకోసం ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్నాం. రైతుల అప్పుల భారం పోవాలని పట్టుబట్టి నాలుగైదు కార్యక్రమాలు తీసుకున్నాం. కాలువలు, చెరువుల మీద నీటి తీరువా, వాటర్ ట్యాక్స్లేదు. ఉచితంగా నీళ్లిస్తున్నాం. కరెంట్ చార్జీలు లేవు. 24 గంటలు ఉచితంగా విద్యుత్తునందిస్తున్నాం’ అని కేసీఆర్ చెప్పారు. దేశంలోనే మొదటిసారి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం, ఇంటింటికీ నల్లా నీరు అందించడంలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉన్నదని పునరుద్ఘాంటించారు. త్వరలో నాలుగు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడితో దేశానికే అన్నంపెట్టే రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని చెప్పారు.
24 గంటల కరెంటు అవసరం లేదు.. 3 గంటలు చాలని కాంగ్రెసోళ్లు అంటున్నరు. పైగా రైతులు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాల్నట. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే మూడు గంటలల్ల పొలం పారుతదని అంటున్నరు. మరి 10 హెచ్పీ మోటర్లు ఎవరు కొనిస్తరు? వీని అయ్య కొనిస్తడా? అసలు రైతుల దగ్గర 10 హెచ్పీ మోటర్లు ఉంటయా? రైతులు వాడేది 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లే. రాష్ట్రంలో 30 లక్షల కనెక్షన్లున్నయి. మరి 30 లక్షల 10 హెచ్పీ మోటర్లు కొనాల్నా? ఇది కొంపలు ముంచే యవ్వారం కాదా? మూడు గంటలల్ల పొలం పారుతదా?
– సీఎం కేసీఆర్