కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2022పై సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన సీఎం కేసీఆర్.. కేంద్ర బడ్జెట్ దారుణమైన బడ్జెట్ అన్నారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని.. రైతులను పట్టించుకోలేదని.. ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
దేశ ప్రధాని మోదీ.. రైతులకు క్షమాపణ చెప్పారు కానీ.. బడ్జెట్లో మాత్రం వ్యవసాయ రంగం గురించి ప్రస్తావనే లేదు. పేద ప్రజలకు గుండు సున్నా చూపించారు. యూరియా మీద సబ్సిడీని రూ.12,708 కోట్లు తగ్గించారు. ఇతర ఎరువుల మీద రూ.22190 కోట్లు తగ్గించారు. మొత్తం రూ.34,900 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించారు. ఇవన్నీ నేను చెబుతున్నవి కాదు. బడ్జెట్ ఫిగర్స్. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.25 వేల కోట్లు కోత పెట్టారు. రూ.98 వేల కోట్లు ఉంటే 73 వేల కోట్లకు కుదించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల పట్ల నరేంద్ర మోదీ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. వ్యవసాయానికి తగ్గించడం.. ఎరువులకు తగ్గించడం, నరేగాకు తగ్గించడం.. ఎస్సీ, ఎస్టీలు 40 కోట్ల జనాభా ఉంటే 12 వేల కోట్ల బడ్జెట్ పెట్టడం.. అసలు దేని కోసం ఈ ప్రభుత్వం ఉంది.. చాలా ఘోరమైన పరిస్థితి ఇది అంటూ సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.