CM KCR | 24 ఏండ్లుగా తెలంగాణే ఆశగా, శ్వాసగా బతుకుతున్నాను. ఆ విషయం మీ అందరికీ తెలుసు. పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ తెచ్చినం. అభివృద్ధి పథంలో ఆదర్శంగా నిలిపినం. నేడు తెలంగాణలో పంటల ఉత్పత్తి పెరిగింది. పంటల వైవిధ్యం కూడా పెరగాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి. ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు కావాలె. రైతులందరూ వాటాదారులు కావాలి. రైతుల బిడ్డలందరికీ అందులో ఉద్యోగాలు రావాలి. అటువంటి గొప్ప ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్గా తెలంగాణ ఎదగాలి. అవే నా కలలు. పేదరికాన్ని తగ్గించడంలో ఎంతో ముందున్నాం. అదే ఆశయంతో ముందుకు వెళ్దాం. అందుకు మీ ఆశీస్సులు ఉండాలి.
-వరంగల్, గజ్వేల్ ప్రజాఆశీర్వాద సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘మీ అందరికీ తెలుసు. 24 ఏండ్లుగా తెలంగాణే ఆశగా, శ్వాసగా బతుకుతున్నాను. పేగులు తెగేదాక కొట్లాడి తెలంగాణ తెచ్చినం. అభివృద్ధి పథంలో ఆదర్శంగా నిలిపినం. నేడు తెలంగాణలో పంటల ఉత్పత్తి పెరిగింది. పంటల వైవిధ్యం కూడా పెరగాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి. ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు కావాలి. రైతులందరూ వాటాదారులు కావాలి. రైతుల బిడ్డలందరికీ అందులో ఉద్యోగాలు రావాలి. అటువంటి గొప్ప ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్గా తెలంగాణ ఎదగాలి. అవే నా కలలు. పేదరికాన్ని తగ్గించడంలో ఎంతో ముందున్నాం. అదే ఆశయంతో ముందుకు వెళ్దాం. అందుకు మీ ఆశీస్సులు ఉండాలి’ అని సీఎం కేసీఆర్ కోరారు. కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నదని, అదే జరిగితే పచ్చని తెలంగాణ మళ్లీ రక్తసిక్తమే అవుతుందని హెచ్చరించారు. గుడ్డిగా కాకుండా విచక్షణతో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. వరంగల్లో, గజ్వేల్లో బీఆర్ఎస్ పార్టీ మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘రైతుల వైభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ చరిత్రకు సాక్షిగా నిలిచిన వరంగల్ వీరభూమికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న. తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు వరంగల్ పట్టణమే వేదికగా నిలిచింది. అతిభారీ బహిరంగ సభ ఇక్కడే జరిగింది. భద్రకాళి మాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నం. అమ్మవారికి కిరీట ధారణ చేసి నేను మొక్కు కూడా చెల్లించుకున్న. అన్నింటికన్నా మించి రాష్ట్ర ప్ర భుత్వం ఇచ్చిన గౌరవం ఏమిటంటే రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టడం. చెరువులు బాగుచేసుకునే కార్యక్రమానికి మిషన్కాకతీయ పేరు పెట్టడం. కాకతీయ రాజులకు తెలంగాణ ప్రజలు అర్పించిన నిజమైన నివాళి ఇది. ఉద్యమాన్ని తలకెత్తుకున్న సందర్భంలో నన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించిన ప్రజా కవి కాళోజీని, అండగా నిలిచిన ప్రొఫెసర్ జ యశంకర్సార్ను మనఃపూర్వకంగా స్మరించుకుంటున్న’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
వ్యవసాయానికి తాము 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తుంటే.. కాంగ్రెస్ నేతలు 3 గంటలే ఇస్తామంటున్నారని, 24 గంటల కరెంటు కావాలో.. 3 గంటలు కావాలో నిర్ణయించుకొని ఓటేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ‘3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటున్నడు. 10 హెచ్పీ మోటర్లు పెట్టుకుంటే సరిపోదని చెప్తున్నడు. 10 హెచ్పీ మోటరే పెట్టినమనుకో.. 3 గంటల కరెంటే ఉన్నదనుకో.. ఒకేసారి అందరూ స్విచ్లు నొక్కితే ట్రాన్స్ఫార్మర్లు పటాకులు పేలినట్టు పేలుతయ్. ఈ రోజు తెలంగాణలో 30 లక్షల మోటర్లు ఉన్నయ్. ఇవన్నీ 10 హెచ్పీకి మారాలంటే సుమారు రూ.40 నుంచి 50 వేలకోట్లు కావాలి. మరి ఆ పైసలు ఎవరు తెచ్చివ్వాలి?’ అని ప్రశ్నించారు.
ఉద్యమంలో మన మానుకోటలో సమైక్యవాదులను తీసుకొచ్చి మీటింగ్ పెడతామన్నోళ్లు ఇప్పుడు హన్మకొండలో నిలబడ్డరు. అనాడు ఎవలైతే మనమీదకు రాళ్ల దాడి చేసిండ్రో, తుపాకుల దాడి చేసిండ్రో వాళ్లే ఇవాళ ఎమ్మెల్యేలుగా పోటీగా నిలబడుతున్నరు.
– సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వరంగల్ నగరం అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘వరంగల్ సిటీలో నాడు భయంకరమైన బాధ ఉండె. ఇవాళా నీళ్లు ఎట్ల వస్తున్నయ్? బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా వస్తున్నయ్. వరంగల్లో అభివృద్ధి మళ్లీ ప్రారంభమైంది. వరంగల్కు పెద్ద బాధ ఏమిటంటే రైల్వే లైన్ అడ్డం. కనీసం 6 బ్రిడ్జిలు రావాల్సి ఉన్నది. ఈ టర్మ్లో తప్పకుండా అవి పూర్తి చేస్తాం. రెండు నగరాలకు చాలా మేలు జరుగుతది. ఇప్పటికే బైపాస్ రోడ్డు వచ్చింది. మరోపక్కన రింగు కంప్లీట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. కుడా ఆధ్వర్యంలో వరంగల్ మాస్టర్ ప్లాన్ తయారవుతున్నది. వినయ్భాస్కర్ మా పోటీ హైదరాబాద్తోని అని అన్నడు. వరంగల్ అట్ల కావాలనే కోరిక ఆయనకు ఉన్నది. మంచిదే. పనిచేసేవాళ్లకు అట్లనే ఉంటది. తప్పకుండా తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం వరంగల్. కాబట్టి విద్యాసంస్థలు, ఐటీ ఇండస్ట్రీ వచ్చింది. పరిశ్రమలు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నాం. వరంగల్ను ఉజ్వలమైన నగరంగా చూడాలనే అభిలాష నాకు ఉన్నది. వరంగల్ అభివృద్ధి ఇప్పుడే మొదలైంది. ఈ వేగం ఆగవద్దు. మీరి చ్చే బలమే మాకు పెద్ద ధైర్యం. ఈ సారి కూడా మద్దతు తెలిపండి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్, తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్ను గెలిపించడానికి నగరంలో ఆకాశాన్ని ముద్దుపెట్టుకుంటా అని లేస్తున్న 24 అంతస్థుల దవాఖాన బిల్డింగ్ చాలదా? ఇంత పెద్ద దవాఖాన హైదరాబాద్లో కూడా లేదు. కిడ్నీ, గుండె, లివర్ ట్రాన్స్ప్లాంట్ వంటి 14 రకాల మల్టీ స్పెషాలిటీస్తోని భారతదేశంలోనే ఎక్కడా లేని దవాఖాన నిర్మిస్తున్నం’ అని సీఎం కేసీఆర్ వివరించారు. దాస్యం, నన్నపునేని ఇద్దరూ బీసీ బిడ్డలేనని, వారిని గెలిపించే బాధ్యత బీసీలే తీసుకోవాలని కోరారు.
గజ్వేల్ తన ఆత్మగౌరవాన్ని పెంచిందని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ‘గజ్వేల్ నా గౌ రవాన్ని పెంచింది. నన్ను ఈ స్థాయికి తెచ్చిం ది. తొమ్మిదిన్నరేండ్లుగా గజ్వేల్ ప్రాంతం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశాను. మంచి నీళ్ల బాధ శాశ్వతంగా తీరిపోయింది. ప్రాజెక్టులు, కాలువలు రావడంతో సాగునీటి బాధ తీరిం ది. రైలూ వచ్చేసింది. గజ్వేల్ అన్ని రంగాల్లో గుర్తింపు కలిగిన నియోజకవర్గంగా ఎదిగింది. రోల్ మాడల్గా మారింది. ఇంకా చాలా అభివృద్ధి కావాల్సి ఉన్నది. ఈ ఎన్నికల్లో ఇది నా చివరి సభ. ఇది 96వ సభ. గజ్వేల్ నుంచి మీరు అవకాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డాను. ట్రిపుల్ ఆర్ గజ్వేల్ మీదుగానే రాబోతున్నది. 24 ఏండ్లుగా తెలంగాణనే ఆశగా, శ్వాసగా బతుకుతున్నాను. తెలంగాణ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలంటే బీఆర్ఎస్ మళ్లీ గెలవాలి. నాకు వచ్చే ఫిబ్రవరికి 70 ఏండ్లు వస్తాయి. తెలంగాణ తెచ్చిన కీర్తే నాకు ఆకాశమంత ఎత్త్తు. ఇప్పటికే పదేండ్లు సీఎంగా పనిచేసిన. తెలంగాణ రేపు ఒక అద్భుతమైన రా ష్ట్రం కావాలి. పేదరికం శాశ్వతంగా పోవాలి. వందశాతం అక్షరాస్యత రావాలి. ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలి. పేదలు లేని తెలంగాణ కావాలి. ఇదంతా ఉట్టిగా నోరుతో చెబితే కాదు. దళితులు తరాలుగా వివక్షకు, దోపిడీకి గురయ్యారు. వాళ్లు కూడా మనతోపాటు పైకి రావాలి. అందుకే దళితబంధు తెచ్చాం. గజ్వే ల్ నియోజకవర్గ దళిత బిడ్డలందరికీ శుభవార్త చెప్తున్నా. ఈ ఎన్నికలు కాగానే గజ్వేల్ నియోజకవర్గంలో ఒకే విడతలో దళితబంధు తెచ్చుకుం దాం. దళిత వాడల్లోని దరిద్రాన్ని పీకి అవతల పడేద్దాం’ అని కేసీఆర్ ప్రకటించారు.
24 ఏండ్లుగా తెలంగాణనే ఆశగా, శ్వాసగా బతుకుతున్నాను. తెలంగాణ రేపు ఒక అద్భుతమైన రాష్ట్రం కావాలి. పేదరికం శాశ్వతంగా పోవాలి. వందశాతం అక్షరాస్యత రావాలి. ప్రజలకు ఉచితంగా వైద్యం అందే తెలంగాణ కావాలి.
– సీఎం కేసీఆర్
కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టిందని, వందసార్లు అడిగినా తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. జిల్లాకో నవోదయ విద్యాలయం ఇవ్వాలని పార్లమెంట్లో చట్టమే ఉన్నదని, తెలంగాణలోని కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు కావాలని తానే 100 ఉత్తరాలు రాశానని, కానీ ఒక్కటే ఇవ్వలేదని ఆరోపించారు. అలాంటి బీజేపీ ఒక్క ఓటైనా ఎందుకు వెయ్యాలని ప్రశ్నించారు.
కాంగ్రెస్ తెస్తామంటున్న ఇందిరమ్మ రాజ్యంలో ఎక్కడ చూసినా కాల్చివేతలు, కూల్చివేతలేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. ‘కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తమని మాట్లాడుతున్నరు. ఇందిరమ్మ రాజ్యం ఎవనిక్కావాలె? ఇందిరమ్మ రాజ్యంలో సగం కాలిన కడుపులే కదా? ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జన్సీనే కదా? ఎన్కౌంటర్లే కదా? కాల్చివేతలు, కూల్చివేతలే కదా? ఉపాసంతోని ప్రజలున్నదే కదా? చీకటి రాజ్యమే కదా?’ అని నిప్పులు చెరిగారు. ఇదంతా ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ‘ఉద్యమంలో మన మానుకోటలో సమైక్యవాదులను తీసుకొచ్చి మీటింగ్ పెడతామన్నోళ్లు ఇప్పుడు హన్మకొండలో నిలబడ్డరు. వాళ్లే ఇవాళ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నరు’ అని మండిపడ్డారు. గీసుగొండ ప్రాంతంలో టెక్స్టైల్ పార్క్ పెట్టామని, ఏడాది రెండేండ్లలో ఇక్కడ లక్షమందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
గవర్నమెంట్ జాగాల్లో గుడిసెలు వేసుకుని, చిన్న ఇండ్లు కట్టున్న పేదలకు పట్టాలిచ్చాం. ఇంకా కొంత మంది పేదలకు ఇవ్వాల్సి ఉన్నది. ఎన్నికల తరువాత 100 శాతం వాళ్లందరికీ పైసా ఖర్చలేకుండా పట్టాలు ఇప్పిస్తాం. రాష్ట్రంలో ఇప్పటికే ఆటో రిక్షాలకు లైఫ్ ట్యాక్స్ను రద్దు చేశాం.
– సీఎం కేసీఆర్
అభివృద్ధి, సంక్షేమంలో నేడు తెలంగాణ దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘పింఛన్లు అర్థవంతంగా ఉండాలని తొలుత రూ. వెయ్యి ఇచ్చాం. రాష్ట్ర ఆదాయం పెరిగిన తరువాత రూ.2 వేలు చేశాం. రాబోయే రోజుల్లో దానిని రూ.5 వేలు చేస్తాం. తలసరి ఆదాయంలో తెలంగాణ ఇప్పుడు నంబర్ వన్గా ఉన్నది. కంటివెలుగు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మఒడి, పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలు.. ఇట్లా అనేక పథకాలను తెచ్చినం. బీసీలు, దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి ఇంగ్లిష్ మీడియంలో విద్యనందిస్తున్నాం. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీ మా, 24 గంటల ఉచిత కరెంటు, ధా న్యం కొనుగోలు చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. గవర్నమెంట్ జాగాల్లో గుడిసెలు వేసుకుని, చిన్న ఇండ్లు కట్టు న్న పేదలకు పట్టాలిచ్చాం. ఇంకా కొం త మంది పేదలకు ఇవ్వాల్సి ఉన్నది. ఎన్నికల తరువాత 100 శాతం వాళ్లందరికీ పైసా ఖర్చలేకుండా పట్టాలు ఇ ప్పిస్తాం. రాష్ట్రంలో ఇప్పటికే ఆటో రిక్షాలకు లైఫ్ ట్యాక్స్ను రద్దు చేశాం. ఎన్నికల తరువాత ఫిట్నెస్, సర్వీస్ సర్టిఫికెట్లకయ్యే రూ.1200 ఫీజులను కూడా రద్దు చేస్తాం’ అని ప్రకటించారు.