CM KCR | మిర్యాలగూడ : మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు స్వయానా రైతు.. ఆయన రైతుల బాధలు తెలిసిన వ్యక్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
భాస్కర్ రావు చాలా హుషారు ఉన్నారు. హుషారు ఉన్నారని తెలుసు కానీ ఇంత హుషారు ఉన్నారని తెల్వదు అని కేసీఆర్ పేర్కొన్నారు. ఏం చేసినా న్యాయంగా, ఇమాందారీగా చేయడం ఆయనకు అలవాటు. నాయకులు చాలా మంది ఉంటారు. ఎమ్మెల్యేలు చాలా మంది అయ్యారు. కానీ భాస్కర్ రావు ఎలాంటి వారంటే ఇన్నేండ్లలో ఏ ఒక్క రోజూ కూడా వ్యక్తిగతమైన పనులు అడలేదు. మిర్యాలగూడ పట్టణాభివృద్ధి, తండాల అభివృద్ధి, మంచి, సాగునీటి సమస్యల పరిష్కారం కోసం, పారిశ్రామిక వాడ కోసం పట్టుబట్టారు అని కేసీఆర్ తెలిపారు.
అదే విధంగా తన సెక్రటరీలు భాస్కర్ రావు మీద ఒక జోక్ చేస్తరు అని కేసీఆర్ తెలిపారు. లిఫ్ట్లు, చెక్డ్యాంలు కావాలని భాస్కర్ రావు కోరారు. ఆ అధికారులు మరిచిపోయారు. కాగితం మీద రాసిపెట్టుకొని వచ్చిన వెంటనే చెప్పండి అని సూచించాను. మూసీ మీద లిఫ్ట్ కావాలని అడిగారు. ఆయన స్వయంగా రైతు. రైతుల బాధలు తెలిసిన వ్యక్తి. పంటలను వేసినప్పటి నుంచి మార్కెటింగ్ చేసే దాకా రైతులకు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
మిర్యాలగూడలో ఆరున్నర కోట్లు పెట్టి కేసీఆర్ కళాభారతి కట్టినట్లు భాస్కర్ రావు తెలిపారని కేసీఆర్ అన్నారు. సంస్కృతి, కళలు ఉండే ప్రాంతం కాబట్టి.. కళాభారతి బిల్డింగే భాస్కర్ రావు మైండ్ దర్పణం పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ సవ్యంగా పరిపాలన చేసి ఉంటే.. మిర్యాలగూడలో చివరి కాలువల కోసం ఉద్యమం జరిగేది కాదు. ఈ నియోజకవర్గంలో రైతులు, పంటలు ఎక్కువ కాబట్టి.. ఒక అలజడి ఉండేది. నీళ్ల కోసం ఉద్యమం జరిగేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు కేసీఆర్.