CM KCR | నిజామాబాద్ : జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎంపీ బీబీ పాటిల్ మంచి వారు.. సౌమ్యులు, కక్ష రాజకీయాలు చేసేవారు కాదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హన్మంత్ షిండేను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. జుక్కల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
గతంలో ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉండేవారని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రజల మధ్యలో ఉండి ప్రజల బాధలు వినేవారు హన్మంత్ షిండే. నెలకు 25 రోజుల నియోజకవర్గంలో ఉంటారు. అన్ని పనులు చేసే వ్యక్తి. భారీ మెజార్టీతో షిండేను గెలిపించాలని కోరుతున్నాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇంకా అడిగారు. ఎన్నికల తర్వాత అవన్నీ మంజూరు చేయిస్తాను. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా ఉండేనో ఆలోచించాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ చిన్న వయసున్న రాష్ట్రం అని సీఎం తెలిపారు. కానీ మన గొప్పతనం ఏంటంటే.. అన్ని రాష్ట్రాలను దాటేసి తలసరి ఆదాయంలో నంబర్ వన్ స్థానానికి వెళ్లాం. తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్లో ఉన్నాం. ఎక్కడా ఇవ్వని విధంగా కరెంట్ ఇస్తున్నాం. కాంగ్రెస్కు అవకాశం ఇస్తే.. రైతుబంధు రాంరాం.. కరెంట్కు కాట కలుస్తది.. ధరణిని తీసేస్తారు. మళ్లా పాత దళారీ రాజ్యమే వస్తది. జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి అని కేసీఆర్ సూచించారు.