మెదక్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): గల్ఫ్ బాధితుడికి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అండగా నిలిచారు. ఏజెంట్ మోసంతో దుబాయ్లో చిక్కుకున్న మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం శాలిపేట గ్రామానికి చెందిన ఎల్ల స్వామిని స్వగ్రామానికి రప్పించారు. వివరాల్లోకి వెళితే..ఎల్ల స్వామి తన అప్పులు తీర్చాలన్న ఉద్దేశంతో కామారెడ్డికి చెందిన ఏజెంట్కు రూ.75వేలు చెల్లించి, డిసెంబర్ 14న దుబాయ్కు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక కంపెనీ వీసా కాదని, టూరిస్ట్ వీసా అని తెలియడంతో స్పృహ తప్పగా, దవాఖానలో చేర్పించారు.
15 రోజుల తర్వాత స్వామి కోలుకున్నాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు ఏమీ చేయాలో తోచక ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డిని సంప్రదించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ శేరి, భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. స్వామికి ఎలాంటి చికిత్స అవసరం ఉన్నా చేయించాలని సూచించారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత స్వదేశానికి రప్పించేలా ఏర్పాట్లు చేశారు. విమానం టికెట్ ఖర్చు కూడా స్వామి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్సీ ఆ ఏర్పాట్లు చేయించగా, ఇటీవల గ్రామానికి చేరుకున్నాడు. శుక్రవారం స్వామి కుటుంబ సభ్యులు వచ్చి ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలిసి శాలువాతో సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. ఏజెంటు చేతిలో మోసపోయి అనారోగ్యం పాలైన స్వామి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండి ఆదుకుంటామని శేరి భరోసా ఇచ్చారు.