హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు చెందిన 15 లక్షల పైచిలుకు కార్మికులు తెలంగాణలో పని చేస్తున్నారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న పనికి, ఉపాధికి మన కూలీలు సరిపోవడం లేదు. తెలంగాణలో ఉపాధి పెరిగింది. ఒకనాడు మనం వలసపోయాం. ఇప్పుడు పొరుగు రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వస్తున్నారని చెబుతూ కేసీఆర్ సుమతీ శతకంలోని ఓ పద్యం వినిపించారు.
అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ
తెలంగాణలో అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు. అద్భుతమైన వైద్యం ఉన్నది. అద్భుతమైన నీల్లు, కరెంట్ ఉన్నాయి. అద్భుతంగా ఉపాధి ఉన్నది. అందుకే ఇక్కడకు కార్మికులు వస్తున్నారు. బెంగాల్, యూపీ నుంచి వచ్చి నాట్లు వేస్తున్నారు. బీహార్, ఒడిశా, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పత్తి ఏరడానికి వస్తున్నారు. కర్నూల్ నుంచి లేబర్ వస్తున్నారు. వ్యవసాయం విస్తరిస్తుంది. ముంబై బస్సులు సంచరించిన పాలమూరు జిల్లాలో ఇప్పుడు ఇతర రాష్ట్రాల కూలీలు వచ్చి పనులు చేస్తుంటే సంతోషంగా ఉందన్నారు. మేం తప్పులు చేస్తే విమర్శించడంలో తప్పు లేదు. కానీ అనవసరంగా మన రాష్ట్ర పరువును బజారున పడేయొద్దు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది అని సీఎం కేసీఆర్ తెలిపారు.