దేశం గర్వించేలా నిర్మించుకున్న రాష్ట్ర నూతన సచివాలయం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉద్యోగుల విధి నిర్వహణకు అనువుగా ఉన్నది. అధికారులు, సిబ్బంది ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధిపతుల కార్యాలయాలన్నీ ఒకే దగ్గర ఉండేలా సచివాలయం సమీపంలో సమీకృత సముదాయం నిర్మించాల్సిన అవసరం ఉన్నది. స్థల నిర్ధారణ తర్వాత ట్విన్ టవర్ల నిర్మాణం చేపడుతాం.
– సీఎం కేసీఆర్
CM KCR | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులకు (హెచ్వోడీ) తరచూ సచివాలయంలో పని ఉంటున్న నేపథ్యంలో వారి కార్యాలయాలన్నీ కూడా దానికి సమీపంలో ఒకేచోట నిర్మించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. నూతన సచివాలయం పూర్తిస్థాయిలో పనిచేస్తున్న నేపథ్యంలో ఆయా హెచ్వోడీల కార్యాలయాలను ఒకేచోటకు చేర్చడంపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో చర్చించారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వశాఖల్లోని హెచ్వోడీలు, వారి ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి సమీపంలో విశాలమైన ప్రభుత్వం స్థలాలు ఎకడెకడున్నాయో ఆరా తీశారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు, హెచ్వోడీల కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా ట్విన్ టవర్ల నిర్మాణం చేపట్టనున్నట్టు సీఎం తెలిపారు. సమీకృత సచివాలయం తరహాలోనే సమీకృత హెచ్వోడీల కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు.
ఆహ్లాదకర వాతావరణంలో ఉద్యోగులు, అధికారులు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను మరోసారి ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించిన పురోగతిపై సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 2 నుంచి రోజువారీగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ముఖ్యమంత్రికి వివరించారు. దేశం గర్వించేలా నిర్మించుకున్న సచివాలయం ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉద్యోగుల విధి నిర్వహణకు అనువుగా ఉన్నదని, అధికారులు, సిబ్బంది ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తున్నారని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు.
రెండు రోజుల్లో సబ్ కమిటీ విధి విధానాల ఖరారు
కుల వృత్తులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ కులాలు, కుల వృత్తులే ఆధారంగా జీవించే రజక, నాయీ బ్రాహ్మణ, పూసల, బుడగ జంగాల తదితర వృత్తి కులాలు, సంచార జాతులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. వీరికి రూ.లక్ష చొప్పున దశలవారీగా ఆర్థిక సాయం అందజేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కార్యక్రమం అమలుకు విధి విధానాలను మరోరెండు రోజుల్లో ఖరారు చేస్తామని సబ్ కమిటీ చైర్మన్, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్కు వివరించారు. త్వరితగతిన విధి విధానాలు ఖరారు చేసి సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాలని సీఎం కేసీఆర్ మంత్రి గంగులను ఆదేశించారు.
Cmkcr
స్మారకం చెంతనే తెలంగాణ తల్లి విగ్రహం
సమీక్షా సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అమరుల స్మారకం వద్దకు చేరుకుని, అకడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే పనులన్నీ పూర్తయి సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్లకు సీఎం పలు సూచనలు చేశారు. అమరుల స్మారకానికి ముందున్న విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహానికి రెండువైపులా అత్యద్భుతమైన ఫౌంటెయిన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆర్ అండ్ బీ ఇంజినీర్ శశిధర్ను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ట్రాఫిక్కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆ తరువాత బీఆరే భవన్ వద్ద నిర్మించిన వంతెనలను పరిశీలించారు. నూతన సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా చూసేందుకు ఈ వంతెనలను నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్రెడ్డి, శేరి సుభాష్రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డితోపాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేశ్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యదర్శులు రాజశేఖర్రెడ్డి భూపాల్రెడ్డి, స్మితాసబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్పాండే, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్రాజు, ఈఈ శశిధర్ తదితరులు పాలొన్నారు.