హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పీడిత ప్రజల పక్షపాతి మల్లు స్వరాజ్యం అని పేర్కొన్నారు. నాటి రైతాంగ పోరాటం అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా నాయకురాలు స్వరాజ్యం అని కొనియాడారు. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారని ప్రశంసించారు. స్వరాజ్యం జీవన గమనం, గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. స్వరాజ్యం లాంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటు అని కేసీఆర్ పేర్కొన్నారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం.. హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం మృతిపట్ల సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యానికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.