CM KCR | హైదరాబాద్ : విప్రహిత పేరుతో వెలసిన ఈ బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శక కేంద్రంగా నిలుస్తుంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్పల్లిలో 9 ఎకరాల స్థలంలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో బ్రాహ్మణుల సంక్షేమాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని 9 ఎకరాల్లో రూ. 12 కోట్లతో నిర్మించాం అని కేసీఆర్ తెలిపారు. సనాతన సంస్కృతి కేంద్రంగా బ్రాహ్మణ సదనాన్ని నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వమే. విప్రహిత పేరుతో వెలసిన ఈ బ్రాహ్మణ సదనం ఆధ్యాత్మిక, వైదిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శక కేంద్రంగా నిలుస్తుంది. రాష్ట్రానికి విచ్చేసే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా ఈ సదనం సేవలను అందించనుంది. ఈ భవనంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం పేద బ్రాహ్మణులకు ఉపయోగపడుతుంది. కులమతాలకు అతీతంగా పేదవారు తమ ఇండ్లలో నిర్వహించుకునే శుభకార్యాలకు పురోహితుల సేవలు కోరితే.. పురోహిత అర్చకులు ఈ భవనం నుంచి వెళ్లి ఆ ఇంట్లో కార్యక్రమాలు జరిపించి రావాలని కోరుతున్నాను. ఆ విధంగా విప్రహిత సకల జనహితగా ఆదరిపంబడాలని విఖ్యాతి పొందాలనేది వ్యక్తిగతంగా నా అభిమతం అని కేసీఆర్ పేర్కొన్నారు.
వివిధ క్రతువులు, ఆలయ నిర్మాణాలు, ఆగమ శాస్త్ర నియమాలు, దేవతా ప్రతిష్ఠలు, వివిధ వ్రతాల విధివిధానాలకు సంబంధించిన ఒక సమగ్రమైన లైబ్రరీ సదనంలో ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఆయా వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన పుస్తకాలు, డిజిటల్ వీడియోలు ఈ లైబ్రరీలో లభిస్తాయి. వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారంగా, ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా, నిత్యం భారత భాగవత రామాయాణాది కావ్య ప్రవచనాలకు వేదికగా, కళలకు కొలువుగా బ్రాహ్మణ సదనం విలసిల్లాలి అని కేసీఆర్ పేర్కొన్నారు.
సూర్యాపేటలో డాక్టర్ ఏ రామయ్య ఇచ్చిన ఎకరా స్థలంలో బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ప్రభుత్వం ఏర్పర్చింది అని కేసీఆర్ తెలిపారు. దీన్ని త్వరలోనే ప్రారంభించుకుందాం. ఖమ్మం, మధిర, బీచుపల్లి ప్రాంతాల్లో కూడా బ్రాహ్మణ భవనాలను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తుంది. మహాకవి కాళిదాసు సాహిత్య ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా మహోపాధ్యాయుడు కోలాచల మల్లినాథ సూరి పేరిట ఆ మహానీయుని స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నది అని కేసీఆర్ ప్రకటించారు.