CM KCR | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఒక పూట ప్రయాణం చేస్తేనే అలసిపోతాం. ఒళ్లు హూనం అయ్యిందని గగ్గోలు పెడుతుంటాం. కానీ 70 ఏండ్ల వయసులో రోజుకు మూడు చోట్లకు.. అలా 32 రోజుల పాటు 96 సభల్లో పాల్గొని, ప్రసంగించి, ప్రజలను మెప్పించటం అంటే మాటలా? కానీ కేసీఆర్ సాధ్యం చేసి చూపించారు. అవును! అక్టోబర్ 15న హుస్నాబాద్లో మొదలైన ఆయన ప్రజాఆశీర్వాద సభ ప్రసంగాల ఝరి.. మంగళవారం గజ్వేల్లో ప్రసంగించే వరకు కొనసాగింది. ఈ ప్రసంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో వివరించారు, ఏం చేస్తుందో తెలియజేశారు, ఓటు ఎంత గొప్పదో వివరిస్తూనే, బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వేయాలో చెప్పారు. అదే సమయంలో విపక్షాల కుట్ర కత్తులను కోట్ల గొంతుల కొడవలై తెగ్గోశారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ సర్కారు ప్రగతిని చెప్తూనే, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేశారు. రైతు వెన్నెముకను విరిచేందుకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని కండ్లకుకట్టారు. 60 ఏండ్లలో గత ప్రభుత్వాలు చేయని పనులను పదేండ్లలో చేసి చూపిన విధానాన్ని, పాలన విజయాలను వివరిస్తూ ప్రతి మెదడు ఆలోచించేలా చేశారు. తరగతి గదిలో పాఠం చెప్పినట్టు, కుటుంబ పెద్ద మంచి, చెడ్డ వివరించినట్టు ఖుల్లంఖుల్లాగా అన్ని విషయాలను వెల్లడించారు.
96 ప్రజాఆశీర్వాద సభల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. దాదాపు కోటి మందికిపైగా ప్రజలతో మమేకమయ్యారు. వారితో నేరుగా మాట్లాడారు. ఈ సభలు ఎంత గొప్పగా సాగాయంటే ఏ సభకు ఆ సభే పోటీ అని అనిపించక మానదు. తన ప్రసంగాలతో ప్రజలను మెప్పించిన ఆయన.. పార్టీ అధినేతగా బీఆర్ఎస్ శ్రేణులను ఎన్నికల సమరంలో ముందుకు నడిపించారు.
2014లో సీఎం కేసీఆర్ 80కిపైగా సభల్లో పాల్గొన్నారు. 2018లో 87 సభల్లో పాల్గొన్నారు. ఈసారి 96 ప్రజా ఆశీర్వాదసభల్లో పాల్గొని తన రికార్డులను తానే బ్రేక్ చేశారు. రోజుకు 3 బహిరంగ సభల చొప్పున 32 రోజులపాటు 96 బహిరంగసభల్లో పాల్గొన్న చరిత్ర దేశంలో మరే రాజకీయ నాయకుడికి లేదు. కేసీఆర్ ఆరోగ్యం సరిగా లేదని, బయటికి రారని విపక్షాలు, గిట్టనివాళ్లు చేసిన ఆరోపణలు ఈ దెబ్బతో పటాపంచలయ్యాయి. మంచి నీళ్లు కూడా తాగకుండా ఏకబిగిన ప్రసంగించి, ఇతర నియోజకవర్గాలకు తిరిగివెళ్లడం, అదీ కర్ణకఠోరమైన ధ్వని సృష్టించే హెలికాప్టర్లో ప్రయాణం అంత సులువు కాదని, అది కేసీఆర్కే సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
సీఎం కేసీఆర్ పాల్గొన్న ప్రతి సభలో ఇసుకేస్తే రాలనంత జనం హాజరయ్యారు. సభాప్రాంగణాలు చాలక చుట్టుపక్కల మేడలు, మిద్దెలు, చెట్లు ఎక్కి కేసీఆర్ ప్రసంగాలను విన్నారు. నియోజకవర్గాల్లోని ఊర్లకు ఊర్లు తరలివచ్చాయి. 2014లో 63 స్థానాలు, 2023లో 88 స్థానాలను సొంతం చేసుకున్న బీఆర్ఎస్కు ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లే వస్తాయని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో కేసీఆర్ సభలు హుస్నాబాద్లో ప్రారంభమై, గజ్వేల్తో ముగిసినట్టే, ఈసారి కూడా హుస్నాబాద్లోనే ప్రారంభమై, గజ్వేల్లో పూర్తయింది.