నకిరేకల్: కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే తెలంగాణ ఇస్తమని 2004లో టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నదని, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ఇచ్చిన మాట తప్పిందని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నకిరేకల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం కావద్దని, ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని ఓట్లు వేయవద్దని, ఆచితూచి, బాగా ఆలోచించి ఓట్లు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ జిల్లా మహనీయులు పుట్టిన జిల్లా అని కొనియాడారు.
‘ఈ జిల్లా వట్టికోట ఆళ్వారు స్వామి పుట్టిన జిల్లా. ఇది నర్రా రాఘవరెడ్డి ఉద్యమాలు చేసిన గడ్డ. బాగా చైతన్యం ఉండే ప్రాంతమని నా విశ్వాసం. ఎన్నికలు వస్తుంటయ్.. పోతుంటయ్. ఎన్నికలు రాగానే గడబిడ గావద్దు. ఎవరో చెప్పింది నమ్మి ఓటేయొద్దు. బాగా ఆలోచించి ఓటేయాలె. అందుకు కావాల్సిన ప్రజాస్వామ్య పరణతి మనలో రావాలె. మీరు ఆషామాషీగా ఓటేస్తే గెలువాల్సిన వాళ్లు కాకుండా ఇతరులు గెలుస్తరు. అప్పుడు వాళ్ల పాలన బాగున్నా లేకున్నా ఐదేండ్లు భరించాలె. కాబట్టి ఓటేసేటప్పుడు అభ్యర్థుల గుణగణాలను చూడాలె. ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్రను పరిశీలించాలె. ఏ పార్టీ చరిత్ర ఏంది..? తెలుసుకుని ఓటేయాలి’ అని సీఎం చెప్పారు.
‘బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టింది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల బాగుకోసం పుట్టింది. 15 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణను సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టింది. పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఇస్తమని 2004ల టీఆర్ఎస్తోటి పొత్తుపెట్టుకుంది. ఎన్నికల్లో గెలిచినంక మాట తప్పింది. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని గట్టిగ కొట్లాడినంక ఆఖరికి దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కానీ బీఆర్ఎస్ పార్టీ పదేండ్ల పాలనలో ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చినం. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టినం. ఇవన్నీ మీకు తెలిసినవే’ అని సీఎం అన్నారు.
‘రైతుల సంక్షేమం కోసం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నది. మీ దగ్గర మూసీ ప్రాజెక్టు ఉంది. గతంలో నీటి తీరువాను వసూలు చేసేటోళ్లు. మేం దాన్ని రద్దు చేసినం. 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నం. రైతుబంధు ఇస్తున్నం. అదృష్టం బాగాలేక రైతు చనిపోతే రైతుబీమా ఇస్తున్నం. 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి మీరు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటున్నది. ఇవన్నీ మీ కళ్లముందు జరుగుతున్నయే. కానీ కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్ల పాలనలో కనీసం మంచి నీళ్లు కూడా ఇయ్యలే’ అని సీఎం విమర్శించారు.