కొల్లాపూర్: కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రాంతానికి చేసిందేమీ లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా వదిలేయడమే గాకుండా వెనుకబడిన ప్రాంతమని, గరీబు ప్రాంతమని పేర్లు పెట్టారని మండిపడ్డారు. మరె ఈ గరీబు ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలం ఎట్లయ్యిందని, కోట్ల టన్నుల వడ్లు ఎట్ల పండుతున్నయని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కొల్లాపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
‘ఇందిరమ్మ కాలం అంతా తెలంగాణకు కాంగ్రెస్ పెట్టిన పేరు వెనుకపడ్డ ప్రాంతం, గరీబు ప్రాంతం. మీరు జొన్నలే పండించుకోవాలె, మీకు వడ్లు పండయ్ అన్నరు. 10 ఏండ్ల కింద గూడా మీకు నీళ్లు రావు, మీకు వడ్ల పండయ్ అన్నరు. మీకు తెలివిలేదు అని గూడా మాట్లాడిండ్రు. మరె ఇయ్యాల తెలంగాణలో 3 కోట్ల టన్నుల వడ్లు పండుతున్నయ్. మరె ఇయ్యి ఏడంగ వచ్చినయ్..? కొల్లాపూర్లో గూడా 1.25 లక్షల ఎకరాల్లో వడ్లు పండుతన్నయ్. మన డాంబర్ రోడ్లన్నీ వడ్లతోనే నిండి ఉన్నయ్. మరె తెలంగాణ వచ్చినంక ఇయ్యన్నీ ఏడంగ వచ్చినయ్..? అందుకే అర్థం చేసుకోవాలె మనం ఎంత మోసపోయినమో, ఎంత దగాపడ్డమో’ అని సీఎం ఓటర్లకు సూచించారు.
‘కాంగ్రెస్ హయాంలో పక్కన కృష్ణా నది ఉన్నా కొల్లాపూర్కు మంచి నీళ్లు గూడా ఇయ్యలే. తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఓట్లు అడుగుతందుకు సిగ్గుశరం గూడా లేదు. ఏం మొఖం పెట్టుకోని ఓట్లడుగుతుండ్రు. కేసీఆర్ కంటే దొడ్డుగ, కేసీఆర్ కంటే ఎత్తుపొడుగు ఉన్నోళ్లు ఎంత మంది ముఖ్యమంత్రులుగాలే. మరె ఏంజేసిండ్రు. వాళ్ల మొఖానికి మంచినీళ్లు ఇచ్చిండ్రా..? కరెంటు ఇచ్చిండ్రా..?, పేద, సాదలను ఆదుకుండ్రా..? రూ.2 వేల పెన్షన్ ఇచ్చిండ్రా..? మరె ఏం జేసినట్టు ఈ ఇందిరమ్మ రాజ్యం.. తోక రాజ్యం..?’ అని సీఎం మండిపడ్డారు.
‘మొన్న ఇందిరమ్మ వారసుడు రాహుల్ గాంధీ వచ్చిండు ఇదే కొల్లాపూర్కు. దేని కోసం వచ్చిండు.. గడ్డి కొయ్యనీకా..? మళ్ల తెలంగాణను ఆగం పట్టిచ్చి, ముళ్ల కిరీటం పెట్టనీకా..? దయచేసి మీరు ఆలోచన చెయ్యాలె. ఈ ఓట్లు మన తలరాత రాసే ఓట్లు. ఆషామాషీగా వేస్తే ఆగమాగం అయిపోతం. కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దు’ అని కోరారు.