చొప్పదండి: కాంగ్రెస్ పార్టీ ఇయ్యాల మ్యానిఫెస్టో విడుదల చేసిందని, దానిలో ఇప్పుడున్న ధరణిని తీసేసి దాని స్థానంలో భూ భారతిని తీసుకొస్తమని ప్రటించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. భూ భారతి కొత్తదేం కాదని, గతంలో తీసుకొచ్చారని, అయినా దానితోటి ఏం గాలేదని సీఎం చెప్పారు. భూ భారతి తెచ్చినా గదే పైరవీకారులు, గదే దళారీలు ఉండేదని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చొప్పదండిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
‘ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ప్రకటించిందట. ధరణిని తీసేసి దాని స్థానంలో కొత్త పోర్టల్ తెస్తరట. దానికి ‘భూ భారతి’ అని పేరు పెడుతరట. ఈ భూ భారతి కొత్తదేం గాదు. గతంలోనే 30, 40 ఏండ్ల కింద తెచ్చిండ్రు. దాంతోటి ఏంగాలే. మళ్ల పాత కథనే ఉండె. గదే పైరవీకారులు, గదే దళారీలు, అదే పాత కథ ఉండె. కాబట్టి మీరు బాగా ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంటు ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మూడు గంటలు చాలు అంటున్నది. మరె 24 గంటలోడు కావాల్నో.. మూడు గంటలోడు కావాల్నో మీరే తేల్చాలి. మేం రైతుబంధు ఇస్తున్నం. కాంగ్రెసోళ్లు రైతుబంధు వేస్ట్ అంటున్నరు. మరె రైతుబంధు ఇచ్చెటోళ్లు కావాల్నో.. రైతుబంధు వేస్ట్ అనేటోళ్లు కావాల్నో మీరే నిర్ణయించుకోవాలె’ అని సీఎం సూచించారు.
‘బీఆర్ఎస్ పార్టీ భూముల క్రయవిక్రయాల్లో అక్రమాలకు తావు లేకుండా ధరణి పోర్టల్ తెచ్చింది. వాళ్లు ధరణిని బంగాళాఖాతంలో వేస్తమంటున్నరు. మరె ధరణి పోర్టల్ను ఉంచుకుంటరో.. బంగాళాఖాతంల వేసుకుంటరో మీ ఇష్టం. రైతులకు మేలు జేస్తోడు కవాల్నో.. కిందమీద జేసేటోడు కావాల్నో మీరే తేల్చుకోండి. మీరు ఆలోచించకుంట ఓటేస్తే ఆగమైతరు. అప్పుడు నేను గూడా ఏం జేయలేను. పదేళ్లుగా మేం పడ్డ కష్టం బూడిదల పోసిన పన్నీరయితది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి, ఎవరిని గెలిపిస్తే రాష్ట్రం బాగుపడుతదో చూసి ఓటేయండి. ఇంక గోపాల్రావు పేట, ఘర్షకుర్తిలను మండలాలు చేయాలని మీ ఎమ్మెల్యే రవిశంకర్ కోరిండు. అదేం పెద్దపని కాదు. నిమిషాల మీద జీవో ఇష్యూ చేసి ఆ రెండు మండలాలు ఏర్పాటు చేస్తం. మీరు ముందుగా రవిశంకర్ను గెలిపియ్యండి. మండలాల ఏర్పాటుతోపాటు రవిశంకర్ కోరిన ఇంకా కొన్ని పనుల సంగతి నేను చూసుకుంట’ అని సీఎం హామీ ఇచ్చారు.