Dalitha Bandhu | దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత పథకాన్ని అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా జులైలో దళితబంధు పథకం కొనసాగింపునకు ఏర్పాట్లు చేయాలని ఇవాళ జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది దళితబంధు పథకం లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగించాలని అధికారులకు సీఎం సూచించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత దశల వారీగా పథకాన్ని అమలు చేయాలన్నారు. దళితబంధు పథకం అమలులో మరింత వేగం పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు.
గత మార్చిలో జరిగిన కేబినెట్ సమావేశంలో రెండవ విడత కింద 1.30లక్షల కుటుంబాలకు రెండో విడత దళితబంధు పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాల్సిందిగా అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో 100 శాతం దళితబంధు పథకాన్ని అమలు చేయడం చేయగా.. మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 1,100 మందికి ఈ దఫాలో దళితబంధును అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో దఫాలో 1,29,800 కుటుంబాలకు దళితబంధును అమలు చేయనున్నది. మరో 200 మంది లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి అప్పగించగా.. మొత్తంగా 1.30లక్షల కుటుంబాలకు పథకాన్ని విర్తింపజేయనున్నారు. గతంలో మాదిరిగా జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.