హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో పల్లె దవాఖానాలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 100 పల్లె దవాఖానలు ప్రారంభించామని, మిగిలిన చోట్ల కూడా డాక్టర్ల నియామకానికి ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో వైద్యరంగంలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.10 వేల కోట్లు ఖర్చుచేయనున్నట్టు సీఎం తెలిపారు. మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలను చేరువచేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలపై చర్చలో శుక్రవారం అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. ‘కొవిడ్ నేర్పిన పాఠంతో రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు పెంచుతున్నాం. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాం. దవాఖానల్లోని పడకలన్నింటినీ ఆక్సిజన్ బెడ్స్గా మారుస్తున్నాం. 500 టన్నుల ఆక్సిజన్ మనవద్దే ఉంటది. మన దవాఖానలన్నింటినీ సూపర్ స్పెషాలిటీ స్థాయికి అభివృద్ధి చేస్తున్నాం’ అని చెప్పారు. ‘ఉస్మానియా దవాఖానను ఏ పద్ధతిలో అభివృద్ధి చేయాలో ఆలోచించి పనులను మొదలుపెడతాం’ అని తెలిపారు.