హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. శ్రీరామనవమి తర్వాత బిడ్డ పెళ్లి చేద్దామని ములుగులో ఒకాయన డబ్బులు జమ చేసి పెడితే.. ఇల్లు కాలి డబ్బులు కూడా కాలిపోయాయి అని మొర పెట్టుకున్నారు. ఇక నేనే లక్ష రూపాయాలిచ్చి పెళ్లి చేయించాను. ఆ బాధల నుంచి పుట్టిందే కళ్యాణలక్ష్మి పథకం. పుట్టింది కానీ మీరు దయచేసి పని చేస్తలేరు. ఇప్పుడు గమ్మత్తు మోపైంది. పెండ్లి అనంగానే కేసీఆరే లక్ష రూపాయాలు ఇస్తుండ్రు.. నీవు ఎంత ఇస్తవు అని అంటుండ్రు. కట్నం ఇంకా ఇస్తుండ్రా అని ఒకాయనను అడిగితే అవున్ సర్ అన్నడు. కట్నం అడిగితే అక్కడనే దవుడ మీద గుంజికొట్టు.. అన్నే పండ్లు రాలిపోతయి అని చెప్పిన.
పేదోళ్లు బాకీల పాలు కావొద్దు.. ఇబ్బంది రావొద్దని చెప్పి, పెళ్లి ఖర్చు అయిపోవాలని పెట్టిన స్కీం కళ్యాణలక్ష్మి. కేసీఆర్ ఇస్తుండు.. నీవేం ఇస్తవో చెప్పు అంటే.. ఇస్త పటు బిడ్డ అని ఇయ్యాలె. ఒకరిద్దరిని ఉతికితే దెబ్బకు అడుగుడు ఆగిపోతది. గరీబోళ్లు, పేదలు లక్ష రూపాయాల లోపే పెళ్లి వొడగొట్టే వాళ్లున్నారు. కానీ ఎక్కువ డబ్బులు అడగడం సమాజంలో మంచిది కాదు. ఇది తప్పురా.. దుర్మార్గుడా అని చెప్పాలి. ఇలాంటి వాటిని తిరస్కరణ చేయాలి. ఇన్సల్ట్ చేయాలి. మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి. ఎక్కడివారు అక్కడే కథా నాయకుడైతేనే.. అక్కడ మంచి ఫలితాలు, లాభాలు వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు.